AP Politics: కృష్ణాజిల్లాలో అది ఎంతో మంది రాజకీయ ఉదంతులకు నెలవు అవనిగడ్డ నియోజకవర్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే టీడీపీకి అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది . ఒకప్పుడు టీడీపీకి కంచుకోటయిన ఆ నియోజకవర్గంలో కొంతకాలంగా టీడీపీని నడిపించే నాయకుడు లేని దుస్థితి నెలకొంది . అస్సలు అవనిగడ్డపై టీడీపీ అధిష్టానం లెక్కలేంటి?
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీలో అనిశ్చితి, అయోమయం ఏర్పడిందని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలవడంతో నియోజవర్గంలో టీడీపీనీ నడిపించే నాయకుడు లేకుండా పోయారని ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుద్ధప్రసాద్ టీడీపీని వీడటంతో టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ ఎవ్వరో టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. దాదాపు రెండు సంవత్సరాల కాలంగా అవనిగడ్డ టీడీపీ ఇంచార్జీ పోస్ట్ ఖాళీగానే ఉంది.
రాజకీయాలకు కేంద్ర బిందువయినా కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజవర్గంలో టీడీపీ జెండా భుజాన వేసుకుని నడిపించే నాయకుడు ఎవ్వరు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొత్తులో ఉన్నా.. టీడీపీని వీడిన వాళ్లు తమ వాళ్ళు కాదని, పొత్తులో జనసేన నుంచి పోటీ చేసిన బుద్ధ ప్రసాద్ ను టీడీపీ నాయకుడుగా చూడలేమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. సామాజిక సమీకరణాల నడుమ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, టీడీపీ అధినాయకత్వం నియోజవర్గం లో టీడీపీ బాధ్యతలను ఎవరో ఒకరికి అప్పగించాలని కోరుతున్నారు.
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కుతుందా లేదా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. బుద్ధా ప్రసాద్ మళ్ళీ తిరిగి జనసేన నుంచి పోటీ చేస్తారా అంటే దానిపై కూడా క్లారిటీ లేదు. మరి నియోజక వర్గంలో టీడీపీ బాధ్యతలు ఎవరు భుజాన వేసుకుంటారని తెలుగు తమ్ముళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. నియోజవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ తెలుగు తమ్ముళ్ళ నుంచి గట్టిగా వినిపిస్తుంది.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు టీడీపీ అభ్యర్థిగా ఉన్న బుద్ద ప్రసాద్ అనూహ్యంగా జనసేనలోకి వెళ్ళిపోయి ఆ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే సీటు కోసమే బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి మారారనీ, కాబట్టి అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవి కొత్తవారికి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు. టీడీపీకి నియోజవర్గంలో
బలమైన కేడర్ ఉన్నా, ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ అధిష్టానం ఇంఛార్జ్ ని నియమించకపోవడంతో తమకు సమస్య వస్తే చెప్పుకునే నాధుడు లేక టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరాశలో ఉన్నారు.
మరోవైపు నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయి తెలుగు తమ్ముళ్ళ మధ్య నడుస్తున్న యుద్ధాలు టీడీపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాగే కొనసాగుతూ పోతే నియోజక వర్గంలో పార్టీ మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే అధిష్టానం వెంటనే సమర్ధుడైన ఇన్చార్జిని నియమించాలని, ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నేత నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నారు.
గత ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో పోటీ చేయాలని జనసేన నుంచి ఆశలు పెట్టుకున్న పారిశ్రామిక వేత్త విక్కుర్తి శ్రీనివాస్ కి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. బుద్ధ ప్రసాద్ జనసేన పార్టీలో చేరడం.. తనకు సీటు దక్కకపోవడంతో తన పరిస్థితి ఏంటని అయన మధనపడుతున్నారంట. ఇప్పుడు టీడీపీ అవకాశం ఇస్తే పార్టీలో చేరి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలు చేపట్టడానికి రెడీగా ఉన్నారంట . సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టికెట్ దక్కకపోయినా అయన ఆ పార్టీ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే విక్కుర్తి శ్రీనివాస్ ను టీడీపీలోకి రావాలంటూ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. విక్కుర్తి శ్రీనివాస్ సైతం ఇప్పటికే టీడీపీ అధిష్టానం వద్దకు వెళ్లి కలిసి టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
అవనిగడ్డ టీడీపీ ఇన్చార్జి ఇస్తే విక్కుర్తి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మెజారిటీ టీడీపీ నేతలు చెప్పేస్తున్నారు. సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా విక్కుర్తి సమర్థుడని, అవనిగడ్డ టీడీపీ నేతలు ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జనసేన తరపున నియోజవర్గంలో తిరిగిన అనుభవం, గ్రామస్థాయిలో ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని తమ అభిప్రాయాన్ని ఓపెన్గానే తెలుగు తమ్ముళ్ళు విక్కుర్తి శ్రీనివాస్ కు చెప్పారంట.
Also Read: వచ్చేస్తున్నాయి రోబో సైనికులు.. శత్రువులకు ఇక చుక్కలే.. కానీ ఆ వీడియోలు నిజమేనా?
అవనిగడ్డ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఆయన మద్దతుదారులు ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుందంటున్నారు .
అయింది ఏదో అయింది.. మా వాడు మీ పార్టీలోకి వచ్చాడు మీరు మా పార్టీలోకి రండని శ్రీనివాస్ కి లోకల్ టీడీపీ ఆఫర్ ఇచ్చేయడం.. టీడీపీ అధిష్టానంతో అయన ఇప్పటికే చర్చలు జరపడం పూర్తవడంతో, త్వరలోనే టీడీపీలో శ్రీనివాస్ చేరికకు రంగం సిద్ధం అవుతుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. మొత్తానికి అవనిగడ్డ నియోజకవర్గంలో నెలకొన్న ఇంచార్జ్ పంచాయతీకి తెలుగు తమ్ముళ్ళు సొల్యూషన్ వెతికారని జోరుగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి అధినేత తమ్ముళ్ళ నిర్ణయం పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.