KTR Backlash: అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి అనుకుంటూ మధనపడుతున్నారట వరంగల్ జిల్లా గులాబీ పార్టీ నేతలు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన జోష్ తో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటే, అమాంతం బొక్కా బోర్లా పడ్డామని బాధపడుతున్నారట. తమ నాయకుడు కేటీర్ ప్రచారంలో వాడిన బాష వల్లే ఇంతటి పరభావం జరిగిందని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారట. అసలక్కడ కేటీర్ సొంత పార్టీకి అంత మైనస్ ఎందుకయ్యారు?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. మున్సిపల్ ఎన్నికల తేదీకి సరిగ్గా వారం క్రితం వరకూ 12 మున్సిపాలిటీలలో 5 కైవసం చేసుకుంటామని భావించారు గులాబీ నేతలు. ఉమ్మడి మెదక్ జిల్లా తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సత్తా చాటుతున్నామని సంబరపడ్డారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా 12 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసింది హస్తం పార్టీ.
పంచాయతీ ఎన్నికల్లో జనగామ, పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో మరింత దూకుడుగా ప్రయత్నిస్తే 5,6 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవచ్చని గులాబీ నేతలు భావించారట. భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, తొర్రూరు, మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీలను భారీ మెజారిటీతో గెలవవచ్చని భావించారట. అందుకోసం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ఫోన్ మేనేజ్మెంట్ వరకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఎన్నికల ప్రచారం ముగింపు రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భారీ ర్యాలీలు నిర్వహిస్తే, పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని లెక్కలు వేసుకున్నారట.
ఆ క్రమంలో నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో మేజర్ వార్డు స్థానాలు గెలవబోతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు వారం రోజుల ముందు వరకు గులాబీ పార్టీకి అనుకూల పరిస్థితులే ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీ సాధించాలని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రచార పర్వాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ముగించారు. కేటీఆర్ ఎంట్రీతో తమ బలం మరింత పెరుగుతుందని భావించిన గులాబీ నేతలకు భారీ షాక్ తగిలింది. కేటీఆర్ చివరి రెండు రోజులలో ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో 70 శాతం వార్డు స్థానాలు కైవసం చేసుకుంటారని భావిస్తే… కేటీఆర్ పర్యటన తర్వాత వన్ సైడ్ గా ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. వర్ధన్నపేట, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీలలో 3వ వంతు సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుందని అంచనా వేస్తే… కేటీఆర్ పర్యటన తర్వాత పావు వంతు సీట్లు గల్లంతై కాంగ్రెస్ వశమయ్యాయి. దీంతో కేటీఆర్ ప్రచారమే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మైనస్ గా మారిందని చర్చ జరుగుతోందట.
భూపాలపల్లి, పరకాల మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పై పరుష పదజాలంతో మాట్లాడారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసాయి. కేటీఆర్ మాట్లాడిన భాష సరిగ్గా లేదని… సొంత పార్టీ నేతల సైతం అసహ్యించుకున్నారట. దీంతో అప్పటివరకు గులాబీ పార్టీపై ఉన్న సెంటిమెంట్ సైతం పోయి, కాంగ్రెస్ అభ్యర్థులకు గంపగుత్తగా ఓట్లు పడ్డాయంటున్నారు . వర్ధన్నపేట, తొర్రూరు, మహబూబాబాద్ మున్సిపాలిటీల ప్రచారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడ్డారట. ప్రతిపక్షంలో ఉండి అహంకారం భాష వాడితే అసలుకే మోసం వస్తుందని సన్నిహితుల వద్ద చర్చించుకున్నారట. అనుకున్నట్లుగానే ఆధిక్యం రావాల్సిన మున్సిపాలిటీలలో అరకొర మెజారిటీ సాధించినా చివరకు వాటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో గులాబీ పార్టీ దాదాపు పత్తా లేకుండా పోయింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో కనీసం సగం మున్సిపాలిటీలు దక్కించుకుంటామనుకున్న గులాబీ నేతలకు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలే ఓటమికి కారణమయ్యాయని సీనియర్లు భావిస్తున్నారట. ఎక్కడైనా అధినాయకుడు ప్రచారం చేస్తే కలిసి వస్తుందని కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందని మదన పడుతున్నాయంట గులాబీ శ్రేణులు. ఏది ఏమైనా కేటీఆర్ నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తలలు పట్టుకుంటున్నారట. అయితే ఈ విషయం తమ అధినాయకునికి చెప్పేందుకు మాత్రం జంకుతున్నారట. ఆ క్రమంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత ఊరికే రాలేదని… ఆ పార్టీలోని సీనియర్ లు గుర్తు చేస్తున్నారట.
Also Read: వచ్చేస్తున్నాయి రోబో సైనికులు.. శత్రువులకు ఇక చుక్కలే.. కానీ ఆ వీడియోలు నిజమేనా?
Story by: Apparao, Big Tv