Balineni Srinivas Reddy: గత ఎన్నికల ముందు వరకు ఆ జిల్లాలో అన్నీతానై నడిపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వదిలి జనసేనలోకి వెళ్ళటంతో ఆయన సీన్ మొత్తం మారిపోయిందట పాపం….పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా ఆయన పరిస్థితి తల్లకిందులైందట.. పార్టీ మారిన ఆయన భవిష్యత్తుతో పాటు ఆయనను నమ్ముకున్న అనుచరగణం భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారిందట.. దాంతో దెబ్బిపోడుపులు ఎక్కువవటంతో సైలెంట్ గా మారిపోయారట ఆ మాజీమంత్రి.. అసలు అంతటి దిగ్గజనికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి … 1999 నుంచి 2014 ఎన్నికల ముందు వరకు ఉపఎన్నికలతో కలిపి ఒంగోలులో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి తన స్టామినా ఎంటో నిరూపించుకున్నారు. 2014లో వైసీపీ అభ్యర్ధిగా పరాజయం పాలైన ఆయన, 2019 నుండి 24 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చక్రం తిప్పారు. అయితే టైమ్లో ఆయన కూటమి పార్టీ నేతలను చిన్నచూపు చూశారని , పలు ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి.
2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి రెండో సారి ఓటమిపాలైన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. అయితే బాలినేని రాకను కూటమి పార్టీ నేతలు పెద్దఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుండి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన బాలినేని శ్రీనివాస రెడ్డి 2024 తరువాత రాజకీయ జీవితం సంకటంలో పడటంతో జనసేన తీర్థం పుచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు జనసేనలోకి వచ్చిన తర్వాత గందరగోళంగా మారిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. తనతో పాటు భారీ అనుచరుగణం,జిల్లాలో మరికొంతమంది ముఖ్య నాయకులు జనసేనలోకి వస్తారని, తన ప్రభావాన్ని చూపించి పార్టీలో పట్టు సాధించాలని భావించిన బాలినేనికి వైసీపీ నుండి ఆశించినంతమంది వెంట రాక నిరాశే మిగిలింది. ఇటు జనసేన జిల్లా నేతలు కూడా కూటమి నాయకులతో కలిసి బాలినేని పార్టీలోకి రాకుండా ప్రయత్నించి… తర్వాత ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నడిపిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షేక్ రియాజ్తో పాటు జనసేన నేతలు మరియు కూటమి పార్టీ నేతలు కూడా బాలినేని రాకను అదే స్థాయిలో వ్యతిరేకించారు. ముఖ్యంగా బాలినేని రాజకీయ ప్రత్యర్ధి దామచర్ల జనార్ధన్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న చక్రం తిప్పాలని చూశారు. ఆ క్రమంలో మెగా ఫ్యామిలీతో తనకున్న అనుంబంధంతో బాలినేని తనకుమారుడితో కలిసి వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బాలినేని పిలుపుమేరకు ఒంగోలులోని 20 మంది కార్పొరేటర్లు బాలినేని వెంట నడిచారు.
అంత వరకూ బాగానే ఉన్నా పార్టీలో చేరి ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ నేటికీ తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో అటు బాలినేని రాజకీయ భవిష్యత్తుతో పాటు కుమారుడు రాజకీయ భవితవ్యం, వారితో వెళ్లిన కార్పొరేటర్ల ఫ్యూచర్ కూడా అగమ్య గోచరంగా మారిందనే చర్చ నడుస్తుందట. మరోవైపు త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏంటి అనేది పదేపదే బాలినేని వద్ద ప్రస్తావిస్తున్నారట బాలినేని వెంటనడిచిన నేతలు.
బాలినేని కూడా పార్టీలో తగిన పట్టును సాధించలేక… వెంట వచ్చిన కార్పొరేటర్లకు సరైన సమాధానం చెప్పలేక ఒంగోలు వైపు రావడం కూడా మానేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తాము తప్పు చేసామా అనే భావనలో కార్పొరేటర్లు ఉన్నారట. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తమ రాజకీయ భవితవ్యం కాపాడాలని బాలినేనిపై కార్పొరేటర్లు ఒత్తిడి పెంచుతున్నారట…కొందరైతే పట్టు ఉన్న పాత పార్టీలోకి తిరిగి వెళ్లిపోదామని బలవంతం చేస్తున్నారట..
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీలో ఉంటామని నమ్మి వచ్చిన వారికి కూడా సీట్లు దొరికే అవకాశం లేదని… అందరికీ న్యాయం జరగాలంటే తిరిగి వైసీపీలోకి పోవాలని… బాలినేని వద్ద పార్టీ క్యాడర్ పోరు పెడుతోందంట…. దాంతో బాలినేని ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. క్యాడర్ ను కాపాడుకోనటం, తిరిగి పూర్వ వైభవం పొందడం కోసం ఆయన పాత పార్టీ వైపు నడుస్తాడా…. లేక జనసేన పార్టీలోనే క్రియాశీలకంగా మారి, తనను నమ్ముకున్న వారి రాజకీయ భవితవ్యాన్ని కాపాడతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
Story by: Apparao, Big Tv