Madhav: ఏపీలో భారతీయ జనతా పార్టీ రూటుమార్చిందా?.. నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అంటోందా?.. కేంద్ర పధకాలను పొగుడుతుంటే పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం లేదని, రాష్ట్రంలో కూటమి శ్రేణులతో సఖ్యతగా ఉంటూ, గత ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ పార్టీ ని బలోపేతం చేసేలా అడుగులు వేస్తుందా?. బీజేపీలో నాయకులు కొనసాగాలంటే గళం విప్పాలని, లేకుంటే పదవులు కట్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఇచ్చిన వార్నింగ్ వెనుక ఆంతర్యమేంటి? మాధవ్ హెచ్చరికతో ఏపీ కాషాయ నేతలు దూకుడు పెంచుతారా?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ … ఆయన రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్థానంలో రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమితులయ్యారు. అయితే మాధవ్ పార్టీ పదవి దక్కినప్పటినుంచి కేంద్ర పధకాలపైనే ఫోకస్ చేస్తూ, రాష్ట్రంలోని అంశాలపై అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ, పార్టీ కి మైలేజ్ తేవడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో ఆయన తాజాగా రాష్ట్రంలోని అంశాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారట.
ప్రధానంగా ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలపై స్పందిస్తూ, గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ అక్కడి నేతల్లో జోష్ నింపాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, వైసిపి నేతలపై కేసులు, కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు … ఇలా ప్రతీ దానిపై బిజెపి గళం విప్పాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సమయంలో రాజమండ్రిలో ఉన్న మాధవ్, అప్పటికప్పుడు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి, అక్కడే ఉండి అధికారులతో మాట్లాడుతూ హుటాహుటిన స్పందించారు.
అలాగే మిగతా ప్రాంతాల్లోనూ సమస్యలపైన మాధవ్ అప్పటికప్పుడే స్పందిస్తూ బిజెపి సైతం కూటమి లో భాగస్వామ్యం అని నిరూపిస్తున్నారంటున్నారు కమలనాధులు. సాధారణంగా బిజెపి అంటేనే ఇంటర్నెల్ మీటింగ్స్ ఎక్కువుగా నిర్వహిస్తుంటారు. పార్టీ నిర్ణయాలు బయటకు కూడా రాని పరిస్ధితి. కాని ట్రెండ్ మార్చి కేంద్ర ప్రభుత్వ పధకాలను వివరిస్తూనే, రాష్ట్రంలోని అంశాలపై ఫోకస్ చేస్తుండడం కమలనాధుల్లో జోష్ నింపుతోందంట.
తాజాగా పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయన్న చర్చ జరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే గ్రీవెన్స్ లో కొన్ని చోట్ల నేరుగానే బిజెపి నేతలు చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడడం కొంత ఫలితాన్నిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే వారధి కార్యక్రమంలో సైతం సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజలు బీజేపీ వైపు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారంట. అదలాఉంటే గతంలో పార్టీని విమర్శించేటప్పుడు సొంత పార్టీ నేతలే సైలెంట్ గా ఉండిపోవడం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి కోపం తెప్పించిందంట. పదవులు అలంకార ప్రాయం కోసం కాదు, ప్రతిఒక్కరూ పార్టీని విమర్శిస్తున్న సమయంలో అంతే ధీటుగా సమాధానం ఇవ్వాలని, అలా బయటకురాని వ్యక్తుల పదవులు కట్ చేస్తామంటూ హెచ్చరించినట్లు సమాచారం.
మాధవ్ హెచ్చిరికల తర్వాత బీజేపీపై ఏ పార్టీ అయినా విమర్శలు చేస్తే అంతేధీటుగా కాషాయ నేతలు బదులిస్తుండడం పార్టీ కి కొంత బూస్టప్ ఇస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పుడే ఏపీలో ఓటింగ్ శాతం పెంచుకుని, బలపడాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ నేతృత్వంలో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు.. కమలం పార్టీని రాష్ట్రంలో ఏ మాత్రం వికసింప చేస్తాయో?
Story by: Apparao, Big Tv