Buggana Rajendranath: వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా కలిగిన మాజీ మంత్రి ఆయన. కానీ ఇప్పుడాయన కోటకు బీటలు వారాయి. పదేళ్ల తర్వాత డోన్లో టీడీపీ జెండా ఎగరడంతో.. ఇప్పుడా మాజీ మంత్రి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో ఆయనెక్కడ అనే టాక్ వినిపిస్తోందట. అంతేకాదు ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు వైసీపీ అదిష్టానం చేపట్టే కార్యక్రమాలలో కూడా ఆయన కనిపించడం లేదట. ఇంతకీ ఆయన అజ్ఞాతానికి కారణమేంటి? ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయమేంటి?
గత పది సంవత్సరాలుగా డోన్ డెన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుగులేని నేతగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడారో అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా అమరావతి, హస్తిన కేంద్రంగా పావులు కదిపారు ఆయన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికలలో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ డీలా పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే 14 స్థానాలకు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇటీవల జరిగిన 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఢీకొట్టలేక ఘోరంగా ఓడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాలలోని పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానిది ఒక ప్రత్యేక స్థానం. ప్రత్యర్థులుగా ఉండే కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీలో ఉండటం.. వైసీపీ ప్రభుత్వం, బుగ్గనపై ఉన్న వ్యతిరేకత, స్థానికులకు అందుబాటులో ఉండరనే అనే ప్రచారం కారణంగా దారుణంగా ఓడారు. ఇక అప్పటి నుంచి ఆయన కాస్త లో ప్రోఫైల్ మెయింటేన్ చేస్తున్నట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను మాట్లాడనివ్వకుండా చేసి.. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా బుగ్గన వ్యవహరించారనే టాక్ ఉంది. అయితే ఆర్థికమంత్రిగా ఉన్న బుగ్గన అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని.. వాటన్నింటిని ఇప్పుడు బయటికి తీసుకోస్తామని కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టబోతుంది? వాటిని బుగ్గన ఎలా ఎదుర్కోబోతున్నారనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాలో టీడీపీ నేతలను, వారి వ్యాపారాలను బుగ్గన టార్గెట్ చేశారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఉండకపోయేదంటారు కొందరు. ఆయన అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారనే చర్చ ఉంది. అంతేగాకుండా సొంత పార్టీ కేడర్ను బుగ్గన పట్టించుకో లేదని టాక్ ఉంది. వీటికి తోడు ఆయన సొంతమండలమైన బేతంచెర్లలోనే బుగ్గన తారా స్థాయిలో అరాచకాలను ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటి కారణంగా హ్యాట్రిక్ విక్టరీ కొడతానన్న బుగ్గన.. దారుణంగా ఓడారనే చర్చ ఉంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక విచారణలకు సిద్ధమవుతుండటంతో బుగ్గన వైసీపీలో ఉండాలా? లేక పార్టీ మారాలా? అనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అధికారం కోల్పోయి రెండేళ్లు గడుస్తున్నా.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. స్తబ్ధుగా ఉన్నారు. ఆయన హస్తిన కేంద్రంగా పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ అదీ జరగలేదు. కానీ ఆయన పక్క చూపులు మాత్రం కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సొంత పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం లేదు. అయితే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. కూటమి నేతలు అంగీకరించేది లేదని చెప్పడంతో.. కష్టమైనా సొంత పార్టీలోనే కొనసాగుతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇలా అనేక ఆరోపణలు వినిపిస్తున్న ఆయన మౌనం, అజ్ఞానం మాత్రం వీడటం లేదు.
నిజానికి బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలపై విరుచుకపడేవారు. అలాంటి నేత ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉండటంపై విమర్శలు తప్పడం లేదు. అసలు తమ నేత హైదరాబాద్లో ఉన్నారో.. ఢిల్లీలో ఉన్నారో కూడా తెలియదంటూ ఏకంగా సొంత పార్టీ నేతలే చర్చించుకునే పరిస్తితి వచ్చింది. మరి నిజంగా బుగ్గన మౌనానికి కారణమేంటి? నిజంగానే ఆయన పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారడం ఖాయమా? లేక వచ్చే ఎన్నికల వరకు ఇలానే మౌనంగా ఉంటారా? అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.
Story By Vamshi, Big Tv