Cheepurupalli Politics: విజయనగరం జిల్లా చీపురుపల్లి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ.. చీపురుపల్లి అంటే బొత్స అని బ్రాండ్ వేసుకున్న ఆయనకి గత ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. బొత్సపై టీడీపీకి చెందిన మరో దిగ్గజం కిమిడి కళావెంకట్రావు విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత ఆ సీనియర్లు ఇద్దరూ నియోజకవర్గంలో కొత్త రాజకీయం మొదలుపెట్టారంట. చీపురుపల్లిని ఓన్ చేసుకోవడానికి తమ వారసుల్ని రంగంలోకి దింపి గైడ్ చేస్తున్నారంట. తమ రక్తం పంచుకుని పుట్టిన వారి కోసం సొంత బంధువులనే తొక్కేయాలని చూస్తున్నారంట. అసలింతకీ ఆ దిగ్గజాల స్కెచ్ ఏంటి? అసలు చీపురుపల్లిలో ఏం జరుగుతోంది?
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీనియర్ నేతలు వారసత్వ రాజకీయాలు షురూ చేస్తున్నారు. చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు , వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణలు ప్రస్తుతం వారసుల ప్రమోషన్ పనిలో ఉన్నారంట. తమ నియోజకవర్గంలో వేరొకరు వేలు పెట్టకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది . తమ తర్వాత కూడా తమ వారసులే ఉండాలి తప్ప వేరొకరు ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడుతునట్లు చీపురుపల్లి ప్రజలు కోడై కూస్తున్నారు .
ఒక వైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున , మరోవైపు వైసీపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కి ఛాన్స్ లేకుండా పక్కా ప్రణాళికతో తాజా మాజీలు అడుగులు వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది . ఇపుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ . కిమిడి నాగార్జున కి ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది . అసలు గత ఎన్నికల్లో చీపురపల్లి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన నాగుర్జున.. అధిష్టానం నిర్ణయం మేరకు పెదనాన్న కళావెంకట్రావు కోసం సీటు త్యాగం చేశారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాని ఆయన భావిస్తున్నారు.
అలానే బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకి కూడా జిల్లాతో పాటు చీపురుపల్లిలో మంచి పట్టుంది . మేనల్లుడితో విభేదాల కారణంగా బొత్ససత్తిబాబు గత ఎన్నికల్లో మజ్జి శ్రీనుకి వైసీపీ టికెట్ దక్కకుండా చేశారు. ఆ క్రమంలో సదరు సినియర్లు చాప కింద నీరులా తమ వారసులను రెడీ చేస్తున్నారట . ఇరువురు జిల్లా అధ్యక్షులకి చాన్స్ ఇవ్వకుండా పథకం ప్రకారం వారసులు క్షేత్ర స్థాయిలో ఉండేలా జాగ్రతలు తీసుకుంటున్నారు ఈ తలలుపండిన నేతలు . ఇప్పటికే కిమిడి కళా వెంకటరావు తనయుడు రాంమల్లిక్నాయుడు చీపురుపల్లిలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంట .. మరోవైపు బొత్స తనయురాలు అనుష తండ్రికి తగ్గ తనయురాలుగా తనను తానూ నిరూపించుకునేందుకు తాపత్రయపడుతున్నారంట.
బొత్త, కళా వెంకట్రావు ఇద్దరూ మొదట స్థానిక సంస్థల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరవ్వడానికి స్కెచ్ గీస్తున్నట్లు ఇప్పటికే లీకులు ఇస్తున్నారు . ఒకేసారి ఎమ్మెల్యే కాకుండా జడ్పిటీసి లుగా ప్రజలను మెప్పించి .. తర్వాత ఎమ్మెల్యే లుగా పోటీ చేయాలని ఆ ఇద్దరు తండ్రులు తమ వారసులకిదిశా నిర్దేశం చేసినట్లు రాజకేయ వర్గాల్లో చర్చ జరుగుతోంది . ఈ క్రమంలోనే గుర్లలో బొత్స అనుష , గరివిడిలో కిమిడి రాం మల్లిక్ నాయుడు లు జడ్పిటిసి లుగా బరిలోకి దిగనున్నరనే చర్చ జోరందుకుంది . ఒకేసారి ఎమ్మెల్యే అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుమానం ఒకవైపుంటే, మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల వివరాలు, నిధులు వ్యవహారం ఇలా అన్ని తెలుసుకోవడానికి జడ్పీ సరైన వేదిక అనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది .
బొత్స తనయురాలు తన తల్లి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అడుగు జాడల్లో నడవడానికి ఫిక్స్ అయ్యారంట . బొత్స ఝాన్సీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొదట జడ్పిటిసి గా గెలుపొంది , జడ్పీ చైర్మన్ పీఠాన్ని చేజేక్కించుకున్నారు. ఆ తరువాత విజయనగరం ఎంపీ గా పోటీ చేసి గెలిచారు . దీంతో అనుష కూడా ఇపుడు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది . మరోవైపు రామ్మల్లిక్నాయుడు పిన్ని, అంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తల్లి మృణాళిని కూడా మొదట శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్గా పనిచేశారు., రాష్ట్ర విభజన తర్వాత చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పని చేశారు . దీంతో వీరిద్దరి పొలిటికల్ ఎంట్రీ కూడా సెం టూ సెం అలానే ఉండనుందా అనే చర్చ జోరుగా జరుగుతోంది .
అదలా ఉంటే చీపురుపల్లిలో వైసీపి జిల్లా అద్యక్షుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు , టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునల దూకుడును కట్టడి చేయడం కూడా ఈ తలలు పండిన సీనియర్ల పన్నాగంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఈ ఎన్నికల సమయంలోనే చీపురుపల్లికి వచ్చారు . అంతకు ముందు కిమిడి నాగార్జున నియోజకవర్గంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు . 2019 లో బొత్స పై పోటీ చేసి ఓటమి చవి చూసినప్పటికీ గట్టి పోటీ ఇచ్చారు . ఆ తరువాత కూడా 2024 ఎన్నికల వరకు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యారు .
చీపురుపల్లిలో ఈ సారి కిమిడి నాగార్జున గెలుపు గ్యారంటీ అనుకొనే లోపు కూటమి లెక్కల్లో కళా వెంకటరావు ఎంటరయ్యారు. దీంతో నాగార్జునకు అన్యాయం చేసారనే భావం ఇప్పటికీ ప్రజల్లో ఉందట . అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందుగా మేల్కొనడం మేలని భావిస్తున్న కళా వెంకటరావు మెల్లగా నాగార్జునను సైడ్ చేసి వారసున్ని తయారు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి . మరోవైపు చిన్న శ్రీను ది కూడా ఇదే పరిస్థితి . మామ బొత్స మినిస్టర్ గా పని చేసిన మూడు దఫాలు నియోజకవర్గంలో ఆ మేనల్లుడు అన్ని తానై నడిపించారు . తనకంటూ ప్రత్యెక స్థానం సంపాదించుకున్నారు .
అటు కాంగ్రెస్ హయంలోనూ , ఇటు వైసీపి హయంలోనూ చిన్న శ్రీనే షాడో ఎమ్మెల్యేగా పని చేసేవారని చీపురుపల్లి వాసులు అంటుంటారు . అందుకే ఈ ఇద్దరు తమకు పోటీ కాకుండా చూసుకోవడానికి, వారసుల్ని తయారుచేయాల్సిందేనని , ఎలా అయినా నియోజకవర్గాన్ని తమ అడ్డాగానే ఉంచుకోవాలని పరితపిస్తున్నారట తలలు పండిన ఆ సీనియర్లు . చూడాలి మరి వారి పాచికలు ఎలా పారతాయో.
Story by: Apparao, Big Tv