US Military intelligence: అమెరికా దాడులు చేస్తుంటే.. చైనా రీసెర్చ్ మొదలుపెట్టేసింది. ఎస్, యూఎస్ ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలపై చైనా డేగ కన్ను వేసింది. ఇరాన్లో మొదటి బాంబు వేయకముందే.. చైనా అంతరిక్షం నుంచి రియట్ టైమ్ డేటాతో.. అమెరికా ఆయుధ సంపత్తిని బహిర్గతం చేసింది. పశ్చిమాసియాలో మోహరించిన భారీ యుద్ధ విమానాలు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకల కదలికలను.. ఎప్పటికప్పుడు బయటపెడుతోంది. షాంఘైకి చెందిన జియోస్పేషియల్ ఇంటలిజెన్స్ కంపెనీ మిజార్ విజన్ విడుదల చేస్తున్న హై-రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్.. ఇప్పుడు సెన్సేషన్గా మారాయ్.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించక ముందే ఫిబ్రవరి చివరి వారంలోనే అమెరికా ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలను మోహరించిందో మిజార్విజన్ బయటపెట్టింది. జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న ఎఫ్-22 స్టెల్త్ ఫైటర్లు, ఎఫ్-35 యుద్ధ విమానాలు, థాడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. యుద్ధం మొదలవకముందే అమెరికా వ్యూహాలను చైనా పసిగట్టేసింది. రన్వేలపై పార్క్ చేసిన యుద్ధ విమానాలు, ఎడారి ఎయిర్ఫీల్డ్స్కి చేరుకునే కార్గో విమానాలు, మధ్యధరా సముద్రంలో ఎక్కడో ఫైటర్ జెట్స్తో నిండి ఉన్న క్యారియర్ డెక్లని చూపించాయ్.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని.. చైనా అంతరిక్షం నుంచి నిశితంగా గమనిస్తోంది. మిజార్విజన్ కంపెనీకి సొంతంగా శాటిలైట్లు లేనప్పటికీ.. చైనాకు చెందిన జిలిన్-1 లాంటి శక్తిమంతమైన శాటిలైట్ నెట్ వర్క్, ఏఐ టూల్స్ సాయంతో.. ఈ డేటాని విశ్లేషిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను.. 300లకు పైగా జిలిన్-1 శాటిలైట్లతో అనుక్షణం ఓ కంట కనిపెడుతూనే ఉంది. కేవలం విమానాలే కాకుండా సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎటువైపు ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని కూడా రియల్ టైమ్లో ట్రాక్ చేస్తోంది.
Also Read: Table Fan vs Ceiling Fan: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్కి మంచిది? నిపుణులు ఇస్తున్న సలహాలివే!
యుద్ధంలో.. అమెరికా మోడ్ ఆఫ్ ఆపరేషన్ని.. శాటిలైట్ల ద్వారా ప్రతి సెకను రికార్డ్ చేస్తోంది చైనా. ఆయుధాలు లోడ్ చేయడం దగ్గర నుంచి మిసైళ్ల ట్రాకింగ్ దాకా ప్రతీది చైనా చూస్తోంది. అమెరికా సైనిక వ్యూహాలను.. చైనా డిజిటల్ డేటా బేస్గా మార్చుకుంటోంది. యుద్ధ విమానాల్లో ఇంధనం నింపే సమయాలు, ఫైటర్ జెట్ రూట్లు, ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ లాంటివాటన్నింటిని.. ట్రాక్ చేస్తోంది. ఈ డేటా డ్రాగన్ కంట్రీకి.. దశాబ్దాల పాటు కొనసాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత రహస్యంగా ఉంచే సైనిక మోహరింపుల వివరాలను, చైనాకు చెందిన నిఘా సంస్థ ఇలా బహిరంగంగా విడుదల చేయడం.. అమెరికా రక్షణ వర్ఘాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు, యుద్ధ క్షేత్రంలో అమెరికా పైచేయి సాధించకుండా.. ఇరాన్కు పరోక్షంగా సహకరించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చిత్రాల వల్ల అమెరికా వ్యూహాలు దెబ్బతినే అవకాశం ఉందని పెంటగాన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సౌత్ ఇజ్రాయెల్లోని ఓవ్డా ఎయిర్బేస్కు.. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ రాకపోకలు, సౌదీ అరేబియా, ఖతార్ సహా మిడిల్ ఈస్ట్ అంతటా యుద్ధ విమానాల మోహరింపులు, అరేబియా సముద్రంలో నేవీ కార్యకలాపాలు, క్యారియర్ కదలికలు, ఇతర సైనిక ఆస్తులను చూపించే.. హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ని.. మిజార్ విజన్ పబ్లిష్ చేసింది. ప్రతి ఫోటోని.. ఏఐ టూల్స్ ఉపయోగించి డీకోడ్ చేశారు. విమానాల రకాన్ని బట్టి లేబుల్ చేశారు. సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను గుర్తించారు. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని హైలైట్ చేశారు. ఈ ఫోటోలను జియోలొకేట్ చేసి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేశారు. కొన్ని పోస్టులు చైనా స్టేట్ మీడియాకు లింక్ చేసిన ఖాతాలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలున్న అనలిస్టులు షేర్ చేశారు. ఈ ఫోటోలు రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైంది. ఖతార్లోని అల్-ఉదీద్ ఎయిర్బేస్కి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత.. ఈ స్థావరం ఇరాన్ మిసైళ్లు, డ్రోన్ దాడులకు టార్గెట్ అయింది.
ఇరాన్పై అమెరికా దాడులను కాసేపు పక్కనబెడితే.. ఇదంతా దీర్ఘకాలికంగా చైనాకు మేలు చేకూర్చే వ్యవహారమనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్లో అమెరికా దాడి చేసినా, మరో దేశం దాడికి ప్రయత్నించినా.. ఎక్కువగా ఆలోచించకుండా, తక్కువ టైమ్లోనే బలమైన కౌంటర్ ఎటాక్స్ చేసేందుకు చైనా దగ్గర ఇప్పుడు కావాల్సినంత డేటా ఉంది. అవసరమైనన్ని వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయ్. అందుకే.. చైనా చాలా పద్ధతిగా కొడుతోందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ.. ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్ అని తెలుసు. కానీ.. యుద్ధాన్ని ఎదుర్కోనేందుకు అవసరమైన వ్యూహాత్మక డేటా ఎప్పుడొస్తుంది? అందుకే ఈ విషయంలో చైనా ఓ అడుగు ముందే ఉంది. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ని ప్రతి నిమిషం లైవ్లో చూస్తోంది.
ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బకు.. పశ్చిమాసియా మొత్తం దద్దరిల్లుతోంది. బాంబుల మోత, రక్తపాతం మధ్య అందరి అటెన్షన్.. యుద్ధం చేస్తున్న ఈ దేశాలపైనే ఉన్నాయ్. అయితే.. ఈ యుద్ధ మేఘాల మాటున దాగి.. లాభపడుతున్నది మాత్రం చైనానే. యుద్ధంలో నేరుగా తలపడకుండానే.. అమెరికా యుద్ధ తంత్రాన్ని శ్రద్ధగా చదువుతోంది. చైనా వ్యూహాత్మక వేట ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా తన ఆయుధాలను ఇరాన్పై ప్రయోగిస్తోంది. దీనిని.. చైనా ఓ లైవ్ ట్యుటోరియల్గా చూస్తోంది.
అమెరికా దగ్గరున్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు.. ఇరాన్ మిసైళ్లని ఎలా అడ్డుకుంటున్నాయి? వాటి సక్సెస్ రేట్ ఏంటి? ఇరాన్ డ్రోన్లని అమెరికా ఎలా కూల్చుతోంది? ఏ ఫ్రీక్వెన్సీలో జామింగ్ చేస్తోంది? అమెరికా బాంబులు ఎంత కచ్చితంగా టార్గెట్లని ఛేదిస్తున్నాయ్? ఇలా.. అన్ని వివరాలు చైనా డిఫెన్స్ రీసెర్చ్కు అద్భుతమైన డేటా అందిస్తున్నాయ్. భవిష్యత్లో తైవాన్ విషయంలోనో, దక్షిణ చైనా సముద్రంలోనో అమెరికాతో తలపడాల్సి వస్తే ఈ డేటా చైనాకు బ్రహ్మాస్త్రం అవుతుంది. అయినా.. యుద్ధం అంటే కేవలం ఆయుధాలు మాత్రమే కాదు కదా! వ్యూహం కూడా ముఖ్యమే. ఓ సంక్షోభం తలెత్తినప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఎలా రియాక్ట్ అవుతోంది? ఆయుధాలను ఏ రూట్లలో తరలిస్తోంది? శత్రువుల కదలికల్ని ముందే పసిగట్టేందుకు.. అమెరికా ఉపయోగిస్తున్న శాటిలైట్ నెట్వర్క్ సామర్థ్యం ఎంత? దాడి జరిగిన తర్వాత అమెరికా ఎన్ని నిమిషాల్లో స్పందిస్తోంది? అనే విషయాల్లో.. చైనా అమెరికా మైండ్ సెట్ని చదివేస్తోంది. డేటా మొత్తం సేకరించి.. సేవ్ చేసుకుంటోంది.
యుద్ధం విషయంలో అమెరికాకు సంబంధించిన అన్ని అంశాలను.. చైనా కావాల్సినంత సేకరిస్తోంది. యూఎస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.. చైనాకు ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్. ఈ యుద్ధంతో.. అమెరికా తన ఖజానాని, ఆయుధ నిల్వల్ని ఖర్చు చేస్తోంది. ఒక్కో మిసైల్ లక్షల డాలర్ల విలువ చేస్తుంది. అమెరికా.. వేల కోట్లు తగలేస్తుంటే.. చైనా మాత్రం తన ఆయుధ సంపత్తని పెంచుకుంటూ, కొత్త టెక్నాలజీని వృద్ధి చేసుకుంటూ, అవసరమైన డేటా మొత్తాన్ని సేకరిస్తూ.. సైలెంట్గా ఉంటోంది. భవిష్యత్లో.. అమెరికా చైనాపై దాడి చేయాల్సి వస్తే.. అప్పటికే ఆ దేశం ఆర్థికంగా, ఆయుధపరంగా అలసిపోయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది.. చైనాకు ప్లస్ అవుతుంది. చైనా ఇప్పుడు యుద్ధంలో లేకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో యుద్ధం తలెత్తితే అవసరయ్యే.. ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుంటోంది. అమెరికా ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉంటే, డ్రాగన్ మాత్రం యుద్ధాన్ని అర్థం చేసుకోవడంలో బిజీగా ఉంది. అందుకే.. చైనా తుపాకీ ఎక్కుపెట్టకపోయినా.. గురి మాత్రం పక్కాగా ఉంది.
గ్రేటెస్ట్ వార్ విక్టరీ అంటే యుద్ధం చేయకుండానే శత్రువుని లొంగదీసుకోవడం. అమెరికా యుద్ధంలో తలమునకలై ఉంటే.. చైనా తన శాటిలైట్లని ఉపయోగించి.. అమెరికా ఫైటర్ జెట్ల పనితీరుని, డ్రోన్ సిగ్నళ్లని, కమ్యూనికేషన్ పద్ధతులని అధ్యయనం చేస్తోంది. ఇదంతా చూశాక.. భారత్ విషయంలో చైనా వ్యూహం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. భవిష్యత్లో భారత్తో సరిహద్దు వివాదాలు తలెత్తినా.. చైనా హైబ్రిడ్ వార్ఫేర్నే అనుసరిస్తుంది. సరిహద్దుల్లో మన కదలికలను శాటిలైట్ల ద్వారా క్షణక్షణం గమనిస్తూనే ఉంటుంది. భారత్ ఎలాంటి ఆయుధాలు వాడుతోంది, ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్ని ముందే విశ్లేషిస్తారు. కానీ.. చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు ఇండియా దగ్గర కూడా స్ట్రాటజీ రెడీగా ఉంది. ఒకవేళ చైనా శాటిలైట్లు మన మీద నిఘా పెడితే, వాటిని కూల్చివేసే కెపాసిటీని భారత్ ఇప్పటికే నిరూపించుకుంది. మన మిత్రదేశాలు.. చైనా కదలికలను గమనించి.. ఇండియాకు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. చైనా దెబ్బకు.. అంతకుమించి సమాధానం చెప్పడమే భారత్ విధానం. చైనా కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలో ఇండియాకు బాగా తెలుసు.
Story by Anup, Big TV
Also Read: Tamannaah: టాలీవుడ్ కి తమన్నా క్రేజీ కమ్ బ్యాక్.. స్టార్ హీరో సినిమాలో అవకాశం!