ఇప్పుడు అంతా యువత గురించే చర్చించుకుంటున్నారు. రాజకీయంలో యువత జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో ఢిల్లీలో జెన్-జీ చేపట్టిన ఆందోళన చూశాం. దీనిపై కేంద్రం ఉక్కుపాదం మోపిన విధానం.. ప్రవర్తించిన తీరు.. యావత్ దేశం ఆ తీరుపై భగ్గుమంటున్న పరిస్థితినీ చూస్తున్నాం.
కానీ కేంద్రానికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది. ఇది దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఘటనగా కూడా చూడొచ్చు. అవును.. కొన్ని కొన్ని ఘటనలు చిన్నగానే అనిపిస్తాయి.. అవి చేసే అలజడి మామూలుగా ఉండదు. అచ్చం ఢిల్లీ వీధులు నిన్న రణరంగంగా మారిన తీరుగానే. జెన్- జీ కాక్రోచులు కదం తొక్కినట్టుగానే. దిక్కులు పిక్కటిల్లేలా వారిచ్చిన నినాదాల మాదిరిగానే.
మొన్ననే మనం ఓ అద్భుతం చూశాం. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ను ప్రయోగించిన స్కై రూట్ అనే సంస్థ అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఇందులో ఉన్నది అంతా యువతే. యువత తలుచుకుంటే ఏదైనా చేసి తీరుతారని, అనుకున్నది సాధించి తీరుతారని చెప్పడానికి ఈ అంతరిక్ష ప్రయోగం.. ఓ కీలక మలుపైతే.. ఢిల్లీ పీఠాలు అదిరిపోయేలా, ఆకాశం దద్దరిల్లే పొలికేక పెట్టిన యువత చేపట్టిన ఉద్యమం మరో మైలురాయి.
ఇక్కడ రాజకీయ కోణం ఇమిడి ఉండటంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది అందరిలో. అందుకే ఎవరు ఎటు వైపు… జెన్-జీకి మద్దతుగా నిలిచెదెవరు? అనే ప్రశ్న ఉదయించినప్పుడు.. జవాబు క్లారిటీగానే ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కాక్రోచ్ పార్టీని అణిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తుండగా.. కాంగ్రెస్ ఇండి కూటమి జెన్-జీకి మద్దతుగా నిలుస్తూ వస్తోంది.
అయితే దీనిపై నిన్న ఓ ఆసక్తికర కామెంట్ చేశారు ప్రధాని మోడీ. అంతరిక్షంలోకి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ను ప్రయోగించిన వారంతా యువకులేనని, నేను చెప్పేది 28 ఏండ్ల యువకుల గురించి, 56 ఏళ్ల యువకుడి గురించి కాదు.. అంటూ రాహుల్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఓ వైపు బయట జెన్-జీ యువత.. తమ డిమాండ్ల కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న తరుణంలో, నీట్ పేపర్ లీకేజీల అంశం.. కేంద్రానికి ఓ మచ్చగా మారిన వైనం కళ్లముందే పెట్టుకుని, కనీసం చీమకుట్టినట్టైనా లేకుండా.. ఉన్న ప్రధాని తీరు గురించి చర్చ జరుగుతోంది. యువతకు అంత ప్రయార్టీ ఇచ్చే మోడీ.. మరి ఎందుకు జెన్-జీ కాక్రోచ్ ఉద్యమాన్ని లైట్ గా తీసుకుని, ఆ ఉద్యమకారులపై దమనకాండను ప్రయోగించారు.
అయినా డోంట్ కేర్ మమ్మల్నెవరు ఏమంటారు? మేమేం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం అని నమ్మే గుడ్డి జనం ఉన్నన్నాళ్లు.. ఇవన్నీ చెల్లుబాటు కావు.. లెక్కలోకి రావు.. అనే ధీమా అనుకోవాలా..? అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నారు. కానీ ఇక్కడ మోడీ మాటలు విన్న తరువాత.. రాహుల్ మాత్రం 56 ఏండ్లైనా యువకుడే అని అనాలనిపిస్తుంది. ఇందులో పెద్ద తప్పు కూడా లేదు. అతను మనసు, చర్యలు, యాక్టివ్ నెస్, స్పందించే తీరు అలా ఉంటుంది మరి.
ఇదో చమత్కారంగా, వెక్కిరించినట్టుగా మోడీ భావించి ఉండొచ్చు కానీ, ఆయన మాటల పరమార్థం మాత్రం ఎవరికి ఎలా చేరాలో అలాగే చేరింది.