Gorantla vs Thopudurthi: ఒక వరలో రెండు కత్తులు పట్టవంటారు. కానీ అక్కడ మాత్రం కాదు. ఒకటో కృష్ణుడు బెంగళూరు వెళ్లగానే.. రెండో కృష్ణుడు ఢిల్లీ నుంచి డైరెక్టుగా దిగేస్తారట. ఇప్పుడు పార్టీ కేడర్ ఇటు వైపుండాలా? అటు వైపుండాలా? ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఆ పర్యావసానం ఎలాంటిది? ఇప్పుడు చూద్దాం..
ఒకరు పోలీసులతో ఢీ అంటే ఢీ
మరొకరు కాన్వాయ్ తో హంగామా
ఢీ అంటే ఢీ.. బాహా బాహీ.. నువ్వెంత అంటే నువ్వెంత? ఈ నియోజకవర్గం నాదంటే నాది.. ఇదీ రాప్తాడు వైసీపీలో సాగుతూన్న రసవత్తర నాటకంలోని కొన్నంటే కొన్ని దృశ్యాలు.. ఆల్రెడీ ఉద్యోగం ఊడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అసలే ఉద్యోగమూ లేని గోరంట్ల.. ఇరువురి మధ్య రాఫ్తాడులో నువ్వా నేనా సై అంటే సై అన్నట్టుగా వ్యవహారం సాగుతోందట.
ఇరువురి మధ్య రాఫ్తాడులో నువ్వా- నేనా
ఒకరిపై మరొకొకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకు రాప్తాడు వేదికగా పోరాటం సాగిస్తున్నారట. ఒకపక్క ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయిన పరిటాల సునీత- సవాల్ విసురుతూంటే.. మరోపక్క గోరంట్ల మాధవ్ ను ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట తోపుదుర్తి.
తోపుదుర్తి ఇక్కడ అంటూ మీసం మెలేస్తోన్న ప్రకాష్ రెడ్డి
అదేంటండీ ఆయన మీ నియోజకవర్గంపై కన్నేశారు? మీ కామెంట్ ఏంటని అంటే, ఇన్నాళ్లూ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గ బాధ్యతలు ఎవరు చూశారు? నిన్న రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో టీడీపీ తో తొడగొట్టిందెవరూ.. తోపుదుర్తి ఇక్కడ.. అంటూ ప్రకాష్ రెడ్డి మీసం మెలేస్తున్నారట.
మరంత తోపైతే బెంగళూరు ఎందుకు పారిపోతున్నట్టు-గోరంట్ల
అదేంటండీ ప్రకాష్ రెడ్డి అలాగంటున్నారని గోరంట్లను అడిగితే.. మరి ఆయనంత.. తోపైతే బెంగళూరు ఎందుకు పారిపోతున్నట్టు? కౌంటర్ అటాక్ చేస్తున్నారాయన. దానికి తోడు ఈ సెగ్మెంట్లో తన సామాజిక వర్గ ఓటర్లు కూడా అత్యధికంగా ఉండటంతో.. ఈ టికెట్ ఎలాగైనా సాధించాలన్న ఆలోచనతో ఉన్నారట గోరంట్ల. ఈ ఏడాది జనవరి ఒకటిన రామగిరికి చెందిన కొందరు స్థానిక నేతలు గోరంట్ల మాధవ్ కు రాప్తాడు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం చేశారట. దీంతో ఆగ్రహానికి గురైన ప్రకాష్ రెడ్డి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట. స్థానిక బీసీ వర్గంలో ప్రకాష్ రెడ్డి తమకు వద్దంటూ.. అంతర్గత సమావేశాల్లో తమ నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు రామగిరి జడ్పీటీసీ తో పాటు కుంటిమద్ది సర్పంచి, ఎంపీటీసీ రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడ్డట్టు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గోరంట్ల ఎప్పటికప్పుడు కూటమిపై కామెంట్లు
ఇక్కడ తన వర్గానికి ఎలాగూ పట్టుంది కాబట్టి.. గోరంట్ల పెద్ద స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా అస్సలు వదులుకోవడం లేదట. ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వంపై కామెంట్లు గుప్పిస్తున్నారు. అదే నోటితో.. ఎమ్మెల్యే పరిటాల కుటుంబంపైనా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
పరిటాల సమీప బంధువులే ఈ హత్యకు కారకులన్న కామెంట్లు
మొన్న తగరకుంట దాడిలో గాయపడ్డ వైసీపీ నేతను అందరికంటే ముందుగా పరామర్శించారు గోరంట్ల. అంతే కాదు వైసీపీ నేత కురుబ లింగయ్య మృతదేహానికి నివాళులర్పించి.. పోలీసులతో తలబడ్డారు. బాధిత కుటుంబాన్ని పరమార్శించడానికి కూడా పోలీసుల అనుమతులు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ.. కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అంతే కాదు పరిటాల సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ.. పరిటాల శ్రీరామ్ ను టార్గెట్ చేశారు. తమ పాలనలో హింసా రాజకీయాల్లేవనీ. అదే కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్షన్ తిరిగి ప్రారంభమైనట్టు చెప్పుకొచ్చారు గోరంట్ల.
రామగిరి ఎంపీపీ ఎన్నికలను 2వారాలు వాయిదా వేయించిన తోపుదుర్తి
ఇలా ఎటు నుంచి ఎటు చూసినా.. గోరంట్ల గట్టి పట్టే బిగిస్తున్నారట. ఈ విషయం గుర్తించిన ప్రకాష్ రెడ్డి.. ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నికలను రెండు వారాల పాటు వాయిదా వేయించగలిగారు. కానీ, తిరిగి తనను కేసులు తరుముకు రావడంతో.. తిరిగి బెంగళూరు పారిపోయారట. ఇదే అదనుగా భావించిన గోరంట్ల ఢిల్లీ నుంచి వచ్చి తిరిగి తనదైన శైలిలో యాక్టివ్ అయ్యారట. హస్తిన నుంచి వచ్చీ రాగానే, లింగమయ్య మృతికి నిరసనగా ఛలో పాపిరెడ్డి పల్లి అంటూ పిలుపునిచ్చి హల్ చల్ చేశారట.
Also Read: జగన్కి జడ.. గండమా!? ఆ మహిళ ఎవరంటే..
ఎవరు ఇంచార్జో ఒక క్లారిటీ ఇవ్వొచ్చుగా- కార్యర్తల ఆవేదన
ఇటు పోలీసులకు అటు కార్యకర్తలకు ఈ ఇరువురి నేతల పోరాటం విషయంలో.. ఏం చేయాలో అర్ధం కావడం లేదట. మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకైతే తాము ఎవరి వైపున ఉండాలో అర్ధం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి చూడాలి. అధిష్టానం వీరి మధ్య ఈ పోటీ ఎందుకు పెడుతోందో? గోరంట్లను ఎందుకు ఎగదోస్తుందో.. తేలాల్సి ఉందంటున్నారు. ఒక వేళ ప్రకాష్ రెడ్డికి ఇక్కడ ఛాన్స్ లేదంటే చెప్పేయవచ్చు కదా? అదే గోరంట్ల ఇలా ఎగబడుతుంటే ఆయన్ను వారించవచ్చు కదా? ఏ క్లారిటీ లేకుండా ఇలా ఇద్దరినీ ఉసిగొల్పి మా మనోభావాలతో ఆడుకోవడం ఎందుకు? అని వాపోవడం రాప్తాడు వైసీపీ కార్యకర్తల వంతుగా మారిందట.