CM Progress Report: సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు ఈ వారం మరో భారీ పెట్టుబడితో ఓ కొత్త సంస్థ హైదరాబాద్లో తన సేవలను ప్రారంభించింది. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు.
23-11-2025 (ఆదివారం) ( ప్రత్యక్ష పర్యవేక్షణ )
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. సమ్మిట్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా చెప్పారు. ఈ సమ్మిట్ కోసం మీర్ఖాన్పేట్లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు.
23-11-2025 (ఆదివారం) ( సత్యసాయి సేవలో )
శ్రీసత్యసాయి శతజయంత్యుత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తన సేవలతో ప్రజలలో సత్యసాయి దేవుడయ్యారని… కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం ద్వారా ట్రస్టు లక్షలాది మంది జీవితాలకు వెలుగునిచ్చిందన్నారు. తెలంగాణలోనూ సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బాబా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి తమ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు రేవంత్ రెడ్డి.
24-11-2025 (సోమవారం) ( కోడంగల్లో సీఎం )
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణలో నిర్మించిన తొలి సెంట్రలైజ్డ్ కిచెన్ను ఆయన ప్రారంభించారు. కొడంగల్లోని ఎంకేపల్లి వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 312 ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న సుమారు 28 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సరఫరా కానుంది.
24-11-2025 (సోమవారం) ( ఆదర్శవంతమైన కోడంగల్ )
కొడంగల్ నియోజకవర్గంలో 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో అంగన్వాడీ భవనాల నిర్మాణం.. స్కూళ్లలో అదనపు తరగతి గుదులు.. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అగ్నిమాపక కేంద్రం, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి. 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన అసెంబ్లీ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామన్నారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుతామన్నారు. నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని.. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్ను కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్.
24-11-2025 (సోమవారం) ( ఢిల్లీలో సీఎం )
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆయన చేత సీజేఐగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానంతో సీఎం హాజరయ్యారు.
25-11-2025 (మంగళవారం) ( గ్లోబల్ సమ్మిట్పై రివ్యూ )
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులకు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సమ్మిట్లో సమగ్రంగా వివరించాలని చెప్పారు. వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను చూసిన సీఎం.. కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సూచించారు సీఎం.
25-11-2025 (మంగళవారం) ( GHMCలో విలీనం)
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న మొత్తం 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది.
25-11-2025 (మంగళవారం) ( కేబినెట్ నిర్ణయాలు )
హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. GHMC పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నగరంలో విద్యుత్ సర్కిళ్ల వారిగా మూడు విభాగాలుగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు.
26-11-2025 (బుధవారం) ( ఆహ్వానాలు పంపండి )
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్ఫష్టం చేశారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2వేల 600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఒక్కో ఈవెంట్కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు.
26-11-2025 (బుధవారం) ( తెలుగు వెర్షన్ రిలీజ్ )
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం తెలుగు వెర్షన్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకునేలా, అతి సామాన్యులు రాజ్యాంగంపై అవగాహాన పొందేలా తెలుగు వెర్షన్ రూపోందించినట్లు లా కార్యదర్శి బి. పాపిరెడ్డి సిఎంకు తెలిపారు. ప్రాంతీయ భాషలో రాజ్యాంగ అనువాదం మంచి నిర్ణయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకోవచ్చన్నారు.
26-11-2025 (బుధవారం) ( ఐపీఎస్లతో భేటీ )
పలువురు ప్రొబేషనరీ ఐపీఎస్లు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ఉన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ కూడా సీఎంతో సమావేశమయ్యారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని.. దాని కోసం నిరంతరం పనిచేయాలని ప్రొబేషనరీ ఐపీఎస్లకు సూచించారు సీఎం.
26-11-2025 (బుధవారం) ( సాఫ్రాన్ సేవలు ప్రారంభం )
శంషాబాద్లోని జీఎంఆర్ ఏరో పార్క్లో ఫ్రెంచ్ దిగ్గజ సంస్థకు చెందిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీని ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. భారత ఏవియేషన్ రంగంలో ఇదో కీలక మలుపన్న మోడీ, సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఫ్రెంచ్ దిగ్గజ సంస్థ సాఫ్రాన్ వాణిజ్య విమానాలకు శక్తినిచ్చే LEAP ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఉంటుందన్నారు ఆయన. ఫ్రెంచ్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. హైదరాబాద్ను సెలెక్ట్ చేసుకున్న సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫెసిలిటీ సెంటర్తో పాటు సాఫ్రన్కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్కు శంకుస్థాపన జరిగింది. ఈ సెంటర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేవీకి ఎంతో ఉపయోగడనుంది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించనుంది.
27-11-2025 (గురువారం) ( అభివృద్ధిని ప్రతిబింబించేలా పాలసీ )
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ఆదేశించారు. పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా మూడు రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఈ మూడు రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లో పొందుపరచాలని చెప్పారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయె రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
28-11-2025 (శుక్రవారం) ( వెల్కమ్ మెస్సీ )
అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్కు రానున్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు రానున్న మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మెస్సీని స్వాగతించడానికి, ఆతిథ్యం ఇవ్వడం కోసం తాను ఎదురు చూస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. మా గడ్డపై మీలాంటి లెజెండ్ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్బాల్ అభిమానికి ఒక ఉత్తేజకరమైన క్షణమని తెలిపారు సీఎం.
Also Read: సంవిధాన్ శక్తి రన్: రాజ్యాంగ స్ఫూర్తిని చాటిన 2 వేల మంది పరుగులు
29-11-2025 (శనివారం) ( సీఎం సమీక్షలు )
తెలంగాణ విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో వ్యవసాయం, సంక్షేమశాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు.
Story By Vamshi Krishna, Bigtv