Echerla TDP:ఇది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి బలమైన కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జ్ పీఠం ఖాళీగా ఉంది. దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గానికి ఇన్చార్జ్ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను ఎవరు సమన్వయం చేయాలి? క్యాడర్ను ఎవరు నడిపించాలి?అన్న ప్రశ్నలు టీడీపీలో వినిపిస్తున్నాయి.
టీడీపీ ఇన్చార్జ్ కోసం పోటీ..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్ల సీటు బీజేపీకి వెళ్లింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ ఎచ్చెర్లపై ఫోకస్ పెట్టింది. ఇన్చార్జ్ను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీంతో పార్టీలో ఇన్చార్జ్ రేసు మొదలైంది. ఈ రేసులో రణస్థలం మాజీ సర్పంచ్ బానోజీ నాయుడు, రణస్థలం మండల టీడీపీ అధ్యక్షుడు లంక శ్యామ్, లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు సురేష్, టీడీపీ నేత చౌదరి బాబ్జి పేర్లు వినిపిస్తున్నాయి.
also read :లక్కీ డ్రాలో అదిరిపోయే ట్విస్ట్.. టోకెన్ తీసిన చిన్నోడికే ఇల్లు!
కాపు ఓటు బ్యాంక్.. టీడీపీ ఇన్చార్జ్ రేసులో ముగ్గురు
నలుగురిలో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎచ్చెర్లలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి రాజకీయంగా కలిసొస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ నలుగురిలో లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు సురేష్ మినహా మిగిలిన ముగ్గురు నేతలు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అయితే.. కేవలం కుల సమీకరణాల ఆధారంగానే నిర్ణయం తీసుకోకూడదనే వాదన కూడా పార్టీలో ఉంది.
సీనియారిటీ ఎంత? క్యాడర్ బలం ఎంత? నియోజకవర్గంలో వ్యక్తిగత పట్టు ఎంత? పార్టీ కోసం ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఇన్చార్జ్ను ఎంపిక చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
also read :చంద్రబాబుపై అనిల్ ఫైర్.. బీదకు దిమ్మతిరిగే కౌంటర్!
భార్యా? తమ్ముడా? ఎచ్చెర్ల టీడీపీ పగ్గాలు ఎవరికి
ఇదిలా ఉంటే మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన నేత కావడంతో.. నియోజకవర్గంలో ఆయనకు మంచి పరిచయాలు, పట్టు ఉందనే టాక్ ఉంది. తన భార్య ప్రభ లేదా తన తమ్ముడు సూర్యనారాయణలో ఒకరికి ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇన్చార్జ్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.