తెలంగాణలో అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అనే రేంజ్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం మరోసారి అధికారం కోసం ఎదురు చూస్తుంటే.. ఇప్పుడున్న అధికార పార్టీ మరో రెండు టర్ములు మేమే ఉంటామని ప్రకటించుకుంటున్నది. ఇక బీజేపీ కూడా ఎవరి పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేసి ఈసారి అధికారం చేజిక్కించుకుంటామని సవాల్ విసురుతోంది.
కొత్త పార్టీ టీఆరెస్ చీఫ్ కవిత కూడా తామే అధికారంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ కవిత చెప్పే విధానంలో కొంత ఇంట్రస్టింగు పాయింట్ ఉన్నది. ఆమె తన పార్టీని గెలిపించండని కోరే ముందే.. బీఆరెస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని పిలుపునివ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
కాంగ్రెస్ ఎట్లాగూ ఓడుతుందని జోస్యం చెబుతూనే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని ఆశల పల్లకిలో ఊరేగుతున్నదని, వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిన బీఆరెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయొద్దని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు. నిజాయితీ, నిబద్దతతో కొత్తగా పార్టీ పెట్టిన తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
ఇప్పుడీ ముచ్చట ఎందుకొచ్చిదంటే.. సర్కార్ పాలనకు వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది బీఆరెస్ పార్టీ. సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదెందుకు? అని వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపేందుకు సిద్దమవుతోంది. ఓ రకంగా సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు సిద్దమైంది.
మరో వైపు బీఆరెస్ వ్యూహాలను బలంగా తిప్పికొట్టేందుకు సర్కార్ సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే పనిలో పడింది. మంత్రుల జిల్లాల పర్యటనల వేగం పెంచింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సరళిని పెంచుతోంది. ఆ వేదికల మీద బీఆరెఎస్పై మరింత దూకుడుగా విమర్శలు గుప్పిస్తూనే.. మరో పదేళ్లు మేమే అధికారంలో ఉంటామనే మెసేజ్ను పంపుతున్నారు మంత్రులు.
ప్రజలను కూడా దీనికి కనెక్టయ్యేలా మంత్రుల స్పీచులుంటున్నాయి. తెలంగాణ మేమే ఇచ్చాము.. తెలంగాణ జనం సోనియమ్మకు రుణపడి ఉంటారు.. అందుకే కనీసం రెండు టర్ములైనా అధికారంలో ఉంచుతారు.. ఇందులో డౌట్లేదు.. అని అంటూనే.. జనం దీనికి ఎప్పుడో ఫిక్స్ అయిపోయారని ప్రజల తరపున నేతలే వకాల్తా పుచ్చుకుంటున్నారు.
అయితే బీజేపీ కూడా తన దూకుడును పెంచుతోంది. ఫీజు రియంబర్స్మెంట్, 22ఏ పై ఆందోళనలను పెంచుతోంది. అర్వింద్ తదితర నేతలైతే .. ఈసారి ఏమన్నా చేస్తాం.. అధికారంలోకి వచ్చి తీరుతామనే వ్యూహాత్మక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇది కూడా మైండ్ గేమ్లో భాగమేనని తెలుస్తోంది.
ఓ వైపు సర్ దెబ్బతో ఓట్లన్నీ గల్లంతువుతున్న తరుణంలో.. ఇది తమను విజయానికి చేరువ చేసే పరిణామనే విధంగా దీన్ని అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నది బీజేపీ. కవిత తన కొత్త పార్టీ ద్వారా జనాన్ని ఆకట్టుకునేందుకు పాంచజన్యం పేరుతో దూసుకుపోతుండగా.. తాజాగా ప్రతీ పేద కుంటుంబానికి ఎకరం భూమి ఇస్తామనే భూ లక్ష్మీ పథకాన్ని జోడించి .. కొత్త పార్టీని జనం నోళ్లలో నానేలా చేస్తున్న వ్యూహం చర్చకు వస్తోంది.
ఎన్నికలకు ఇంకా రెండేండ్ల పైబడే ఉన్నా ఇప్పుడు అధికారం కోసం పోటీలు పడుతున్నఈ నాలుగు పార్టీలకు మాత్రం త్వరలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు ట్రయల్ రన్గా మారనున్నాయని చెప్పవచ్చు.