Kavitha Party: ఇతర పార్టీల కండువా తీసి.. కవిత సమక్షంలో కొత్త జెండా పట్టుకున్న ఆ ఇద్దరు మాజీ కీలక నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అసలు పార్టీలో ఉన్నారా లేక పక్కకు తప్పుకున్నారా? నెలల తరబడి ఎలాంటి యాక్టివిటీ లేకుండా సైలెంట్గా ఉండిపోవడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల తీరు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ రక్షణ సేన పార్టీలో కవిత సమక్షంలో చేరిన సమయంలో ఈ ఇద్దరు నేతలుజనార్దన్, రాథోడ్ బాపురావులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ ఏడాది జనవరి 19న బాపురావు చేరగా, జనార్దన్ మే 28న చేరారు. కానీ, ఆ చేరికల ఘట్టం పూర్తయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలలు గడుస్తున్నా తమ సొంత నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడంలో దారుణంగా వెనుకబడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు, డిక్లరేషన్ అమలు తీరుపై కవిత గళం విప్పుతున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కానీ పార్టీలో సీనియర్లుగా రాజకీయ అనుభవం ఉన్న వీరిద్దరు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఒకటిరెండు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు తప్ప ఆతర్వాత ఏమైందో ఏమోగానీ మళ్లీ రాలేదు. ప్రభుత్వంతో పాటు ప్రధానప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనపైనా కనీసం మాట్లాడటకపోవడం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొంది. వారి సొంత కేడర్లోనూ అయోమయం నెలకొంది. చెన్నూరు, బోధ్ నియోజకవర్గ స్థాయిలో కేడర్ను సమాయత్తం చేయడం దేవుడెరుగు, కనీసం ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రచారం జరుగుతుంది. కవిత.. గ్రామస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ జెండాలను ఆవిష్కరించాలని చేసిన ఆదేశాలను సైతం పాటించలేదనే ప్రచారం జరుగుతుంది.
Also read: టీమిండియాకు అవమానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్, కంపుకొట్టే టాయిలెట్స్
ఇటీవల నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో సైతం ఈ ఇద్దరు జనార్దన్, రాథోడ్ బాపురావు ముఖ్య నేతలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు కవిత నిర్వహించే మీడియా సమావేశాలకు, పార్టీ చేపట్టే కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణలకు సైతం హాజరుకాకపోవడం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చకుదారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో మంచి పట్టున్న రాథోడ్ బాపురావు, బోడ జనార్దన్ వంటి నేతలు ఉన్నట్టుండి తెరవెనుకకు వెళ్లడం వెనుక స్పష్టమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కవిత వెంట నడిస్తే భవిష్యత్తులో రాజకీయ లబ్ధి ఎంతవరకు ఉంటుంది? సొంత నియోజకవర్గాల్లో తిరిగి ప్రభావం చూపగలమా లేదా?” అనే పునరాలోచనలో ఈ నేతలు పడ్డారనే ప్రచారం సాగుతోంది.
ఈ ఇద్దరు సీనియర్ నేతల మౌనం వెనుక ఇతర ప్రధాన పార్టీల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్లే కారణమనే ప్రచారం జరుగుతోంది. పాత పరిచయాలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇతర పార్టీల అగ్రనేతలు వీరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ప్రస్తుతం ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కవిత పార్టీలో చేరిన ఈ ఇద్దరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల తీరుపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. మరి ఈ ‘సైలెన్స్’ కు వీరు ఎప్పుడు బ్రేక్ ఇస్తారో చూడాలి.
పార్టీ పటిష్టతకు పని చేయాల్సిన సమయంలోనే నేతలు ఇలా సైలెంట్ అవ్వడంతో “వారు పార్టీలో కొనసాగుతున్నారా? లేక కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ వైపు చూస్తున్నారా?” అనే గుసగుసలు మొదలయ్యాయి. కవిత పార్టీపై వీరికి అంచనాలు లేకపోవడంతోనే సైలెంట్ గా ఉన్నారా? అనేది కూడా మరోవైపు చర్చకు కారణమైంది. కండువా కప్పుకున్న నేతలే కనిపించకుండా పోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ ఇద్దరు నేతలు త్వరలోనే తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తారా లేక ఇదే మౌనాన్ని కొనసాగిస్తారా అనేది పార్టీలోనే చర్చకు దారితీసింది.
Also read: హమ్మయ్య ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ…లుక్ టెస్ట్ పూర్తి!