హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ నేత కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చి చంపుతాననే విధంగా సైగలతో అసెంబ్లీలో బెదిరించిన ఘటన పట్ల సర్కార్ సీరియస్గా తీసుకున్నది. దీనిపై సీఎం రేవంత్రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. దీనిపై ఎథిక్స్ కమిటీ చైరన్మ రేవూరి ప్రకాశ్రెడ్డి అధ్యక్షత అసెంబ్లీలో భేటీ అయ్యింది.
దీని నివేదికను స్పీకర్ను అందిస్తారు. ఆ వెంటనే స్పీకర్ దీనిపై నిర్ణయం ప్రకటించనున్నారు. వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగైనా తమ యువనేత కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ దృష్టిలో పడాలని పదే పదే ఇలా వివాదాలను ఏరికోరి తెచ్చి పెట్టుకుంటున్నాడు పాడి. అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే దోరణిని బాగా ప్రదర్శించడం ద్వారా నిత్యం వార్తల్లో నేతగా నిలవాలనేది అసలు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
కేసీఆర్ మొత్తం కేటీఆర్కే పార్టీ పగ్గాలు అందించిన నేపథ్యంలో.. యథారాజా తథా ప్రజా మాదిరిగా యువనేత మనసెరిగి నడుచుకుంటున్నాడు పాడి. ఇటీవల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అవి మా కేసీఆర్ కట్టించినవని నానా యాగీ చేసినా .. అది మైలేజీ ఇవ్వకపోగా ప్రజలు ఉల్టా ప్రశ్నించే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు.
కేసీఆర్ కట్టిస్తే..అప్పుడు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రజలు తిరగబడే స్థితిని తన ప్రవర్తన ద్వారా తెచ్చిపెట్టుకున్నాడు పాడి. ఎన్నికల సమయంలో ..తనను ఈసారి గెలిపించకపోతే ఇంటిల్లి పాది ఆత్మహత్య చేసుకుంటామని వీడియోను విడుదల చేయడం ఇప్పటికీ విమర్శిస్తుంటారు అంతా. సూసైడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటారు.
గెలిపిస్తారా..? చావమంటారా? అని ప్రజలనే బెదిరించిన నేత.. ఇక మిగిలిన వారి పట్ల ఎలా ఉంటారు? అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తున్నది. పదే పదే కేటీఆర్ దృష్టిలో పడేలా.. ఏదో ఒక రచ్చ చేయడం ద్వారా ..తనకు మంత్రి పదవి ఇస్తారనే కోణంలో కూడా ఇవన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాడనే విమర్శలూ ఉన్నాయి.
ఇది మరీ హద్దులు మీరడం ఇక్కడ మరింత చిచ్చుకు కారణమవుతోంది. మరీ అతి చేయడమే అధికార పార్టీకి అహసనం, చికాకు కలిగిస్తున్నది. అందుకే ఇక ఎథిక్స్ కమిటీని రంగంలోకి దింపింది. అది చర్యలకే సిఫారసు చేయనుంది. స్పీకర్ వేటు వేసేందుకు రెడీగా ఉన్నారు.
శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం మూలంగా ఇది సరైన గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుందని సర్కార్ భావిస్తోంది. అయితే ఉప ఎన్నికల అంశం కూడా చర్చకు వస్తోంది. గతంలో కోమటిరెడ్డి , సంపత్ల విషయంలో ఇలాంటి చర్యలే తీసుకున్నా.. హైకోర్టును ఆశ్రయించడం వల్ల దీనికి బ్రేక్ పడింది. ఇక్కడా కోర్టును సంప్రదిస్తారా? కయ్యానికి కాలు దువ్వినట్టుగా ఉప ఎన్నికలకే పోతారా? అనేదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.