Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం పై దృష్టిపెట్టింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సభ, మరోవైపు జిల్లా అధ్యక్షుల నియామకం ఇవన్నీ ఈ కేటగిరిలోకే వస్తాయనిపిస్తోంది. మరి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకున్న ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ కాంగ్రెస్కు ప్లస్ అయ్యాయా? మైనస్ అయ్యాయా? నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న జిల్లా అగ్ర నేతల మధ్య అంతరాలు చెరిగిపోయాయా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ కార్యకర్తలలో నూతన ఉత్సాహం, ఉత్తేజం కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో పదమూడు స్థానాలలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడడానికి తోడ్పాటును అందించారు కరీంనగర్ జిల్లా ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్లుగా కరీంనగర్ జిల్లా నేతలకు ప్రాధాన్యత కూడ ఇచ్చింది అధిష్టానం. తరువాత విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి రెండో విడతలో మంత్రి పదవి దక్కగా ఇప్పుడు ముగ్గురు మంత్రులు.. ఒక విప్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. మొదటి ఏడాది కాంగ్రెస్ క్యాడర్ ఎవరి దగ్గరికి వెళితే ఎలాంటి తలనొప్పి వస్తుందోనని భయంభయంగానే మంత్రులని కలిసి వచ్చారు.
నామినేటెడ్ పదవులలో శ్రీధర్ బాబుది పైచేయి కావడంతో ఇద్దరూ మంత్రుల మధ్య పొసగడం లేదని టాక్ నడిచింది. పైకి ఇద్దరు మంత్రులు బాగానే ఉన్న గాని వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నదనే ప్రచారం ఉంది. అయితే మూడో మంత్రి లక్ష్మణ్ కుమార్ నియామకంలో కూడా శ్రీధర్ బాబు కీలకపాత్ర పోషించడంతో పాటుగా పరిపాలన విషయంలో శ్రీధర్ బాబు తన ఆధిపత్యం కనబర్చుతున్నారనే చర్చ ఉంది. దీంతోపాటు ఎమ్మెల్సీ టికెట్ విషయంలో శ్రీధర్ బాబే కీలకంగా ఉండి తన మాట నెగ్గించుకోవడంతో ఒకానొక సమయంలో పొన్నం కాస్త గుర్రుగా ఉన్నారనే చర్చజరిగింది. అయితే ఆ మధ్య మంత్రి అడ్లూరి విషయంలో మాట జారడంతో తెలంగాణ పాలిటిక్స్లో పెద్ద దుమారమే రేగింది. తరువాత పొన్నం, అడ్లూరిని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ పిలిచి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇదంతా ఇప్పుడు మరిచిపోయి ముగ్గురు మంత్రులు ,విప్, ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి గ్యాప్లు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నాయకుల మధ్య ఎలాంటి వివాదాలకు తానివ్వడం లేదు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల డీసీసీ అధ్యక్షుల విషయంలో అచితూచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అయా జిల్లాలలో కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టారు. నాలుగు జిల్లాల పరిధిలో నూతన డీసీసీ అధ్యక్షులలో ఎక్కడ కూడా అభిప్రాయబేధాలు రాకపోగ అందరూ స్వాగతించారు. ఇటీవల హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంపై పెద్ద వరాల జల్లే కుదిర్చారు. ఇప్పుడు ఇదే జోష్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ మొత్తంలో సర్పంచులని గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పంచాయతీ ఎన్నికల సమయంలో నిర్వహించిన సీఎం సభ విజయవంతం కావడంతో ఈ జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ పరిధిలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని కోరడం.. పశు సంపద ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమలకు తోడ్పాటునివ్వాలనే వినతులకు సానుకూలంగా స్పందించడం ఇప్పుడు ప్లస్ అవుతుందనే చర్చ జరుగుతోంది. హుస్నాబాద్ చుట్టూరా రింగ్ రోడ్డు నిర్మించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ హామీలను అమలు చేస్తామని వేదిక మీద సీఎం హామీ ఇచ్చారు. ఈ సభకు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలిరావడం.. ఇదే సమయంలో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తానని సీఎం ప్రకటించడం అన్నీ అనుకూలంగా మారాయనే చర్చ జరుగుతోంది. సర్పంచులు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే తరువాత జరిగే స్థానిక సంస్థలలో ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ,ఎంపీపీ స్థానాలని కైవసం చేసుకోవచ్చనే ఆలోచన. నూతన అధ్యక్షుల నియామకం, ముఖ్యమంత్రి సభ సక్సెస్, ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్యతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో నయాజోష్ ఉంది.
Story by Anup, Big Tv