Anantapur: రాజకీయాలు మారుతున్నాయి.. దీనికి తగ్గటుగానే రాజకీయాల్లో తరాలు కూడా మారుతున్నాయి. కీలక నేతలు వృద్ధాప్యం కారణంగానో.. మరేదైనా కారణంతోనో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి తప్పుకొని వారసులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడీ కేటగిరిలో మరో నియోజకవర్గం కూడా చేరినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నేతలు?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. టీడీపీ నేత గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు.
అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు. అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు.
వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, తన సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్కు కొద్దిపాటి ఛాన్స్లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
Story by Anup, Big Tv