Delimitation Debate: ఎస్.. డీలిమిటేషన్ విషయంలో సౌత్ స్టేట్స్ స్టాండ్ ఒకలా ఉంటే.. ఏపీ నుంచి మాత్రం సౌండ్ వేరేలా వినిపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ దేశ ముఖచిత్రాన్ని, దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యాన్ని ఎలా మారుస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మిగతా దక్షిణాది రాష్ట్రాల గొంతు ఒకలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల వాదన భిన్నంగా కనిపిస్తోంది. 50 శాతం సీట్లు పెంపుతోనైనా, జనాభా ప్రాతిపదికైనా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలేనన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్న వేళ.. ఏపీ నుంచి భిన్నమైన వాయిస్ వినిపిస్తోంది. ఈ విషయంలో.. మొన్న జగన్.. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొత్త డిబేట్ మొదలైంది. చంద్రబాబు, జగన్ చెబుతున్నట్లు.. 50 శాతం సీట్ల పెంపుతోనే సౌత్ స్టేట్స్కి లాభమా? 2027 సెన్సెస్ ప్రకారమైతే మరింత నష్టపోతామా? అసలు, నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబు, జగన్ వినిపిస్తున్న వాదనలు వింటే.. విషయమేంటో అర్థమవుతుంది.
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుని వ్యతిరేకించి.. డీఎంకే, ఇండి కూటమి పక్షాలకు మహిళలకు ద్రోహం చేశాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలన్నారు. అంతేకాదు, దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటాను అడ్డుకున్నారని, 50 శాతం సీట్లు పెరుగుతాయని చెబుతుంటే, ఇంకా ఇబ్బందేమిటని ప్రశ్నించారు చంద్రబాబు. డీఎంకే, ఇండి కూటమి నిర్ణయంతో.. మహిళలు నష్టపోయారన్నారు. 2027 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు చంద్రబాబు. ఇదే.. ఇప్పుడు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్కు దారితీసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా డీలిమిటేషన్పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు.. ఏం సాధించాయో ప్రశ్నించుకోవాలన్నారు. పార్లమెంటులో బిల్లు వీగిపోవడం వల్ల.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. బిల్లు వీగిపోవడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో జగన్ చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు విధానంలో.. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరిగేవని, మహిళా రిజర్వేషన్లు కూడా వచ్చే ఎన్నికల నాటి నుంచే అమల్లోకి వచ్చేవన్నారు.
ఇప్పుడు బిల్లు వీగిపోవడం వల్ల.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కలని పరిగణనలోకి తీసుకుంటే.. సౌత్ స్టేట్స్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని తెలిపారు. 50 శాతం సీట్ల పెంపు విధానంలో.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 38కి పెరుగుతాయని, అదే 2011 జనాభా లెక్కల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటే, ఎంపీ సీట్ల సంఖ్య 34 మాత్రమే అవుతాయన్నారు. అదే, 2027 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు జగన్.
ప్రస్తుతం లోక్సభలో 543 ఎంపీ స్థానాలున్నాయ్. వీటిలో.. దక్షిణాది రాష్ట్రాలకు 129 సీట్లు ఉన్నాయ్. అంటే, మొత్తం సీట్లలో 23.76 శాతం ప్రాతినిధ్యం ఉంది. అదే, 50 శాతం విధానంలో సీట్లు పెంచితే.. 815 స్థానాల్లో.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 195కి పెరుగుతాయ్. అప్పుడు, లోక్సభలో సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం 23.87 శాతానికి పెరుగుతుంది. అదే, 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, 850 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలకు దక్కేది 174 మాత్రమే అంటున్నారు జగన్. అప్పుడు.. సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం 20.44 శాతానికి పడిపోతుందని చెబుతున్నారు. చంద్రబాబు, జగన్ లెక్కలు చూశాక రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. 2027 జనాభా లెక్కల ప్రకారం గనక డీలిమిటేషన్ చేస్తే.. పెరిగే ఆ కాస్త సీట్లలోనూ కోత పడుతుందా? అనే డిస్కషన్ మొదలైంది.
దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్.. ఇప్పుడొక సెన్సిటివ్ సబ్జెక్ట్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రించినందుకు మాకు శిక్షా? అనే ఆవేదన బలంగా వినిపిస్తోంది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ వాదనలు.. ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే భిన్నంగానే కాదు, కొంత ఆందోళనతో కలిగి ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నేతలు.. డీలిమిటేషన్ని.. కేవలం సీట్ల సంఖ్య పరంగానే చూస్తున్నాయ్. సీట్లు తగ్గితే.. కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందనే వాదన బలంగా వినిపిస్తున్నారు. కానీ, ఏపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. గతంలోనే.. చంద్రబాబు ఎక్కువ మంది పిలల్ని కనమని పిలుపునిచ్చారు. ఇందులో.. డీలిమిటేషన్ ఆందోళన ఉంది. 2027 జనాభా లెక్కలను కేంద్రం ప్రాదిపదికగా తీసుకుంటే గనక.. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయ్. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలుగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ కోల్పోతామని భయపడుతున్నారు.
రాజ్యాంగం ప్రకారం, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల విభజన జరగాలి. కొన్ని దశాబ్దాలుగా దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. జనాభా నియంత్రణలో అద్భుతమైన ప్రగతి సాధించాయి. మరోవైపు, ఇదే సమయంలో.. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయ్. జనాభా పెంచుకుంటూ పోయిన ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా అదనపు సీట్లు లభిస్తాయ్.
అందువల్ల.. కేంద్ర ప్రతిపాదించిన డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ నష్టపోతాయని దక్షిణాది రాష్ట్రాల నేతలు వాదిస్తున్నారు. కానీ, ఏపీలో పరిస్థితి వేరేలా ఉంది. ఇక్కడ కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఒకే లైన్లోఉన్నట్లు కనిపిస్తోంది. మిగతా సౌత్ రాష్ట్రాలు.. తమకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటుంటే, ఏపీ నేతలు మాత్రం 50 శాతం సీట్ల పెంపుతో మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి సీట్ల పెంపుపై హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225కి పెంచాలనే నిబంధన ఉంది. సీట్లు పెరిగితే ఎక్కువ మంది నాయకులకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయ్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీకి ఉన్న అతిపెద్ద సమస్య నిధుల కొరత, అభివృద్ధి. కేంద్రంతో ఘర్షణ పడటం కంటే, కేంద్రం చెప్పిన డీలిమిటేషన్ ఫార్ములాకు సహకరించి, బదులుగా రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీలు, నిధులను రాబట్టుకునే వ్యూహంలో భాగంగానే.. సీఎం చంద్రబాబు ఇలా చెబుతున్నారని అంటున్నారు.
చంద్రబాబు, జగన్ వాదన వెనుక తక్షణ రాజకీయ ప్రయోజనం ఉందని, దీర్ఘకాలికంగా చూస్తే కొన్ని వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లోక్సభలో దక్షిణాది బలం తగ్గితే, భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే, దక్షిణాది సంస్కృతి, అవసరాలు మట్టిలో కలుస్తాయని తమిళనాడు లాంటి రాష్ట్రాల వాదనను సమర్థిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది.. కేవలం అంకెల ఆట కాదు. భారత సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన పరీక్ష. చంద్రబాబు, జగన్ ఒకే రకమైన వాయిస్ వినిపించడం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ సర్దుబాటు ఎక్కువ ఉందనే విమర్శలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఏపీకి మరో దారి లేదంటున్నారు. కానీ, దక్షిణాది ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవమే ఇప్పుడున్న అతిపెద్ద సవాల్. పైగా, చంద్రబాబు, జగన్ ఒకే విషయంలో, ఒకే రకమైన స్టాండ్ తీసుకోవడం చాలా అరుదు.
కానీ, డీలిమిటేషన్ విషయంలో ఇద్దరి ఆందోళన వెనుక రాష్ట్ర భవిష్యత్ దాగుంది. పార్లమెంటులో సీట్లు తగ్గితే, పార్లమెంటులో ఏపీ గొంత వినిపించే వారు ఉండరు. ఏపీ వాదన కేవలం రాజకీయ చదరంగం కాదు, ఇది మనుగడకు సంబంధించిన పోరాటం. సౌత్ స్టేట్స్ అన్నీ.. ఒకే తాటిపైకి వచ్చి, లోక్సభలో దక్షిణాది ప్రాబల్యం, ప్రభావం తగ్గకుండా సీట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేస్తేనే.. ఏపీ నేతల వాదనకు బలం చేకూరుతుంది. అప్పటిదాకా డీలిమిటేషన్ వ్యవహారం.. రాజకీయ వర్గాల్లో వేడి రగిలిస్తూనే ఉంటుంది.
Also Read: రూ.100 కోట్ల లెక్క ఎక్కడ? టీవీకే చీఫ్ విజయ్కు హైకోర్టు నోటీసుల షాక్!
Story by: Anup, Big Tv