ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29కి బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ సారి బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్సీ స్థానమే దక్కనుంది . ఆ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. పోటీ తీవ్రంగా ఉండటంతో, పార్టీ అధినేత కేసీఆర్ ఆశిస్సులు ఎవరికి ఉండనున్నాయి. బీసీకి ఇస్తారా? ఎస్సీకి ఇస్తారా? అనే చర్చకూడా పార్టీలో జోరందుకుంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఫాంహౌస్లో ఉంటున్న అధినేత వద్దకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఎస్టీకి మళ్లీ అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్లు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. అయితే ఖాళీ అవుతున్న ఆ ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య పరంగా ఒక స్థానం దక్కనుంది. దీంతో ఆ స్థానం కోసం పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత కేసీఆర్ ఉన్న ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు సైతం వెళ్లి కలిసి వస్తున్నట్లు సమాచారం. అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులతోనూ మంతనాలు చేస్తున్నారు. అంతేకాదు కేటీఆర్, కవిత, హరీష్ రావుతోనూ తమకు ఎమ్మెల్సీ సీటు వచ్చేలా చూడాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎవరికి వారుగా ఆశావాహులు తమ స్టైల్లో లాబీయింగులు మొదలుపెట్టారు.
బీసీ రాగం వినిపిస్తున్న గులాబీ పార్టీ
ఒకస్థానం మాత్రమే ఉండటంతో ఏ వర్గానికి టికెట్ ఇస్తారనేది పార్టీలో చర్చజోరందుకుంది. ప్రస్తుతం పార్టీ బీసీ రాగం అందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై విమర్శలు గుప్పిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42శాతం రిజర్వేషన్ కల్పించాని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ తరుణంలో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా? లేకుంటే బీఆర్ఎస్ బీసీ వాదానికే పరిమితం అవుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. బీసీల నుంచి దాసోజు శ్రవణ్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
అధినేత దగ్గరకి క్యూ కడుతున్న ఆశావహులు
శ్రావణ్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని గులాబీబాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. అప్పటి గవర్నర్ తమిళిసైకి దాసోజు శ్రావణ్ పేరు కూడా చేర్చి లిస్టు పంపించగా ఆమె దాన్ని రిజెక్ట్ చేశారు. అప్పటి నుంచి దాసోజుకి పదవుల పరంగా ప్రాధాన్యత దక్కలేదు. దాంతో ఈ సారి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. బీసీ కోటాలో దాసోజుతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీలు వీజీగౌడ్, స్వామిగౌడ్ సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్లు
ఎస్టీ సామాజిక వర్గం నుంచి పదవీ కాలం ముగియనున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తిరిగి ఆశిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ తోపాటు కేటీఆర్ ను సైతం ఈ విషయంపై కలిసినట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్ , మైనార్టీల నుంచి మాజీ మంత్రి మహమూద్ అలీ, సీనియర్ నాయకుడు సలీం సైతం ఎమ్మెల్సీ పోస్టు ఆశిస్తున్నారంట. వీరుకాకుండా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారంట.
రెండో స్థానానికి పోటీచేసే ఆలోచనల బీఆర్ఎస్
అదలా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలిపే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సరిపోను బలం లేదు. అయినా రెండో స్థానానికి పోటీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ స్కెచ్ గీస్తోందట. ఆ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి గులాబీ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ మారిన వారు విప్ను ఉల్లంఘిస్తే దాన్ని కోర్టులో అస్త్రంగా మలుచుకోవాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా ఉందంటున్నారు. మరి చూడాలి కారు పార్టీ లెక్కలు ఎలా వర్కౌట్ అవుతాయో?