Srikakulam: ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట.. ఎందరో ఉద్దండులైన నేతలను అసెంబ్లీకి పంపిన చరిత్ర. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి నాయకత్వ లేమి తాండవిస్తోంది. ఇన్చార్జి కూడా లేకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. అయితే, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిన రాజకీయ చదరంగంలోని వ్యూహమేనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని తీవ్ర వర్గపోరుకు చెక్ పెట్టి, పార్టీ మనుగడను కాపాడుకోవడానికి చంద్రబాబు ఎలా కొత్త పంథాను అనుసరిస్తున్నారు? మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి ఆహ్వానించే ఆలోచన వెనుక ఉన్న అంతర్గత వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం… తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక స్థానం కాదు, అదొక కంచుకోట. కళా వెంకట్రావు, ప్రతిభాభారతి వంటి సీనియర్ నేతలు ఇక్కడి నుంచే పలుమార్లు అసెంబ్లీకి వెళ్లారు. అలాంటి చరిత్ర ఉన్న ఈ స్థానం… ఇప్పుడు సరైన నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతోంది. నియోజకవర్గానికి కనీసం ఇన్చార్జి కూడా లేకపోవడంతో, క్షేత్రస్థాయిలోని టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తికి లోనవుతోంది. అయితే, ఈ సంక్షోభం వెనుక చంద్రబాబు ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఎచ్చెర్లలో టీడీపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వర్గ పోరు. 2024 ఎన్నికలకు ముందు నుంచే ఈ వర్గ పోరు నడిచింది. దాని కారణంగానే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా, కళా వెంకట్రావు వర్గం, కలిశెట్టి అప్పలనాయుడు వర్గం టికెట్ కోసం పోటీ పడ్డారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా… రెండో వర్గం సహకరించదని చంద్రబాబు భావించారు. అందుకే, బలమైన నియోజకవర్గమైనా సరే, వర్గపోరును నివారించే ఉద్దేశంతో ఆ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈశ్వరరావు సునాయాసంగా గెలుపొందారు.
ప్రస్తుతం కళా వెంకట్రావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా తమతమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో వీరి రెండు వర్గాలకు చెందిన క్యాడర్ బలంగానే ఉన్నా, వారిని నడిపించే నాయకుడు లేక పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇన్చార్జిని నియమించడానికి ఆసక్తి చూపించడం లేదు. రెండు వర్గాలకు చెందినవారిలో ఎవరిని ఇన్చార్జిగా నియమించినా మరో వర్గం సహకరించే అవకాశం లేదు. ఒకవేళ కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే ‘మూడు ముక్కలాట’ పరిస్థితి తయారవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంక్లిష్ట సమయంలోనే చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు సైతం తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచే మొదలుపెట్టారు. దీనికి తోడు ఎమ్మెల్యే సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం ఒకటే కావడం వ్యూహాత్మక అంశంగా మారుతోంది.భవిష్యత్తులో ఈశ్వరరావుతోనే ఎచ్చెర్ల రాజకీయం నడిపించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ఆయనకు టీడీపీ కండువా కప్పే ఆలోచన కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు స్వయంగా ఒకట్రెండుసార్లు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. 2029లో కూడా ఈశ్వరరావు ఎమ్మెల్యే కావడానికి అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారని ఓ సభలో చెప్పడం ద్వారా, వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ దాదాపు ఆయనకే అనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. చంద్రబాబు తన చతురతతో వర్గపోరుకు చెక్ పెట్టి, గెలిచే అభ్యర్థిని సిద్ధం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారని టాక్. వర్గపోరు కారణంగా ఆ స్థానంలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ… ఆ స్థానంలో సునాయాసంగా గెలిచిన ఎమ్మెల్యేను తమవైపు తిప్పుకునే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? వర్గపోరును ఇది పూర్తిగా అరికట్టగలదా? అనేది చూద్దాం.
Story by Venkatesh, Big Tv