GHMC: కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలతో.. గ్రేటర్ లో కాంగ్రెస్ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంది. ఈ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న హస్తం పార్టీ… రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ పీఠం దక్కాలంటే… MIM మద్దతు తప్పనిసరి అనే సమీకరణం తెరపైకి వచ్చింది. మరి, రాష్ట్ర నేతల ఈ వ్యూహానికి ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్ల చీలిక ప్రమాదం తప్పదా? లెట్స్ వాచ్ దిస్.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు 64 సీట్లు లభించినప్పటికీ, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. కానీ, కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన బై ఎలక్షన్లో హస్తం అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. ఈ తర్వాత జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపొందగా, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బీ ఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది.
వాస్తవానికి గ్రేటర్ పరిధిలో సాధారణంగా బీఆర్ఎస్, MIM పార్టీల ఆధిపత్యం ఉండేది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత పరిస్థితి మారింది. దీంతో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్ధతు ప్రకటించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్ధతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని చర్చించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఆకర్ష్’ ఆపరేషన్ ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఈ రెండూ కీలక సెగ్మెంట్లు కావడంతో పార్టీ నేతలతో పాటు ముఖ్య నేతల్లోనూ నూతనోత్సహం నెలకొన్నది. ప్రభుత్వం,పార్టీలోనూ సంతోషం ఏర్పడింది.
ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్కు కీలకంగా మారనున్నాయి. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ మద్దతును కాంగ్రెస్ ఉంచుకుంటుందా? అనే ఆసక్తికర చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మొదలైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మళ్లీ మజ్లిస్ పార్టీ అక్కడ ఏకంగా ఐదు అసెంబ్లీ సీట్లను సాధించింది. ఎంఐఎం బరిలో నిలవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లు కాస్త మజ్లిస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంఐఎంతో పొత్తు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలడం ఖాయం. జాతీయ స్థాయిలో మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్కు సంబంధాలు అంతగా బాలేవు. కానీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో ఎంఐఎం మిత్ర పక్షంగా వ్యవహారిస్తున్నది.
రేవంత్ సర్కార్ తో MIM పార్టీ సఖ్యతగానే ఉంటూ వస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక తరహాలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే మజ్లిస్ పార్టీ మద్దతు అవసరమని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నదట. కానీ పొత్తు కోసం ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎంఐఎంతో మైత్రి విషయమై ఏవిధంగా స్పందిస్తారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే పొత్తు తప్పనిసరి అనే అభిప్రాయంలో హస్తం నేతలు ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల బలం పెరగడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి రెండు విధాలుగా లాభదాయకం. స్థానిక సంస్థలతో పాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో ఆ పార్టీ ఏకపక్షంగా 45 నుంచి 50 డివిజన్ల వరకూ సీట్లను గెలుచుకుంటూ వస్తున్నది. ఓల్డ్ సిటీ కాకుండా ముస్లిం ప్రాబల్యం ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఎంఐఎం తన సత్తా చాటుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో గణనీయంగా సీట్లు సాధిస్తేనే మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు సాధించిన కాంగ్రెస్.. గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తద్వారా మజ్లిస్ పొత్తు ఉంటే మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఈజీ అవుతుందని హస్తం నేతలు భావిస్తు న్నారు. కాగా, జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.
Story by Venkatesh, Big Tv