Cabinet Dismissal: స్వేచ్ఛ బ్యూరో: మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం కొత్తమేకాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. తాజాగా కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవుల నుంచి తొలగింపు, వైదొలగడం లాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగానే చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కారణంగా ఉమ్మడి ఏపీ, అనంతరం ఏపీ, తెలంగాణలో పలువురు మంత్రి పదవులు కోల్పోయారు. తాజాగా ఈ జాబితాలోకి కొండా సురేఖ చేరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముగ్గురు మంత్రులను తొలగించారు. అందులో టి.రాజయ్య, ఈటల రాజేందర్, కొండా సురేఖ ఉన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన ఇద్దరు రాజయ్య, సురేఖ ఉండటం గమనార్హం.
2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలోనూ కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపింది. అయితే గతంలో రాష్ట్ర ముఖ్యనేతల జోక్యంతో అప్పట్లో చర్యలు తీసుకోలేదు. సంజాయిషీ ఇచ్చారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై నే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. సుస్మిత మాటలతో ఎటువంటి సంబంధం లేదని కొండా సురేఖ చెప్పుకురావడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం, సీఎంతోపాటు ముఖ్యనేతలుసైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు అమె క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలోనూ కేబినెట్ మంత్రిగా ఉండి సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడంతో చర్యలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కు ప్రభుత్వం పంపిన లేఖకు ఆమోదం తెలపడంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, రాజయ్యను పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ తొలి కేబినెట్లో టి.రాజయ్య ఉపముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పరిపాలన వైఫల్యం, స్వైన్ఫ్లూ నివారణ చర్యల్లో అవినీతి, ఆరోగ్య శాఖ ద్వారా వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, ఇతర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మంత్రి పదవి కోల్పోయారు. ఆస్థానంలో కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Also read: ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఘటన
అధికారికంగా ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. కరోనా సమయంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో వెనుకబడిన తరగతుల రైతులకు చెందిన అసైన్డ్ భూములను ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ ఆక్రమించిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మెదక్ జిల్లా కలెక్టర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా తక్షణ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసీఆర్ అప్పట్లో ఈటలపై చర్యలు తీసుకున్నారు.
1988లో బడ్జెట్ లీకుతో 31మంది మంత్రులపై వేటు.. ఏపీ సీఎం ఎన్టీఆర్ ప్రభుత్వంలో రహస్యంగా ఉండాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు మీడియాకు లీక్ అయ్యాయన్న కారణంతో 31 మంది మంత్రులపై వేటువేశారు. కేఈ కృష్ణమూర్తి, కె.జనార్దన్ రెడ్డి, ముద్రదగడ్డ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు తదితరులపై వేటు వేయడంతో టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
టీఆర్ఎస్ పార్టీతో పొత్తుతో 2009లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ఆర్ కేబినెట్ లో హరీష్ రావు, ఈటల రాజేందర్ మంత్రులుగాఅవకాశం కల్పించారు. అయితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
Also read: మొబైల్ నెంబర్లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎన్టీరామారావు కేబినెట్లో రామచంద్రరావు కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వయంగా స్టింగ్ ఆపరేషన్ చేయించి, మంత్రివర్గం నుంచి తొలగించారు.
ఉమ్మడి రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో దేవయ్య కార్మిక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన మాజీ డ్రైవర్ హత్య కేసులో సుద్దాల దేవయ్యపై తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మరింత వివాదం పెరగడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కృష్ణయాదవ్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. దేశాన్ని కుదిపేసిన వేల కోట్ల అబ్దుల్ కరీం తెల్గీ నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో కృష్ణయాదవ్ ఏజెంట్గా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో మహారాష్ట్ర పోలీసులు కృష్ణయాదవ్ను అరెస్ట్ చేశారు. దీంతో కేబినెట్ నుంచి తొలగింపుతో పాటు పార్టీ నుంచీ సస్పెండ్ చేశారు.
ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో చేనేత, జౌళిశాఖ మంత్రిగా శంకర్ రావు పనిచేశారు. తోటి మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలపై అనేకసార్లు బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అధికార కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. అనేక హెచ్చరికల తర్వాత మంత్రివర్గం నుంచి తొలగించారు.
Also read: కొండా సురేఖపై వేటుతో షాక్ తిన్న కీలక నేతలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్.కిరణ్ కుమాణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభావం, రాష్ట్రవిభజన అంశానికి సంబంధించి పాలనాపరమైన నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించారు. లండన్ పర్యటనలో ఉండగా రవీంద్రారెడ్డి బహిరంగంగా విమర్శించడంతో ఆయనను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫారసు చేశారు. గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ ఆయన్ను తక్షణమే కేబినెట్ నుంచి తొలగించారు.
వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మానపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వచ్చాయి. విపక్షాల నుంచి డిమాండ్లు, అధిష్ఠానం ఒత్తిడి పెరగడంతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వీరి రాజీనామాలను ఆమోదించారు. గవర్నర్ వద్దకు పంపి కేబినెట్ నుంచి మే 2013 లో తొలగించారు.
గుమ్మనూరు జయరాం(2024) వైస్ఆర్సీపీ అధినేత జగన్ మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం పనిచేశారు. 2024 మార్చిలో వైస్ జగన్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించారు. పార్టీ పిరాయించిన జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు.
Also Read: కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!