Formula E Case: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో హైదరాబాద్ పొలిటికల్ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, HMDA మాజీ ఈఎన్సీ బీఎల్ఎన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు పరిసరాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. కోర్టు ఈ కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.
ఏసీబీ మోపిన ప్రధాన అభియోగాలు
ఈ వ్యవహారంలో నిధుల వినియోగం, అనుమతుల ప్రక్రియపై ఏసీబీ పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ముఖ్యంగా నాంపల్లి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఏసీబీ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఫార్ములా-ఈ రేసు నిర్వహణ, ట్రాక్ నిర్మాణం పేరుతో HMDA నిధుల నుంచి సుమారు రూ. 55 కోట్లను అక్రమంగా మళ్లించారనేది ఇందులో ప్రధాన ఆరోపణగా ఉంది.
కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల..
అంతేకాకుండా, మూడు సీజన్లకు చేయాల్సిన ఖర్చును ఒక్క సీజన్ కోసమే ఖర్చుగా చూపించి, కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేశారని అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు ఆర్బీఐ గైడ్లైన్స్తో పాటు పన్ను నిబంధనలను కూడా పక్కనబెట్టి, విదేశీ కంపెనీలకు నేరుగా నిధులు బదిలీ చేశారని ఏసీబీ తన ఛార్జ్షీట్లో స్పష్టంగా వివరించింది.
న్యాయపరంగా నెక్స్ట్ ఏం జరగబోతోంది?
ఈ కేసు విచారణ ఆగస్టు 25కు వాయిదా పడటంతో, తదుపరి కోర్టు ప్రక్రియ ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే వాయిదా నాటికి న్యాయస్థానం ముందస్తు చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
ఏసీబీ ఛార్జ్షీట్..
ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అభియోగాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిందితులకు ఛార్జిషీట్ ప్రతులను సమర్పిస్తుంది. ఆ ప్రతిని అందించిన అనంతరం కోర్టులో అభియోగాల నమోదు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. అభియోగాల నమోదు పూర్తయిన తర్వాత ఏసీబీ తరఫున సమర్పించిన సాక్షులను విచారించడం, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించడం జరుగుతుంది.
Also Read: ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు
సిద్ధమవుతున్న న్యాయవాదులు..
మరోవైపు, నిబంధనల ప్రకారమే నిధులు మంజూరయ్యాయని, ఇది కేవలం రాజకీయంలో భాగంగానే చేస్తున్న ఆరోపణలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు పక్షాల వాదనలు, చట్టపరమైన ప్రక్రియల నడుమ ఆగస్టు 25న నాంపల్లి కోర్టులో జరిగే తదుపరి విచారణ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.