ఈ ఫ్రీ బస్సు పథకం మళ్లీ చర్చలోకి వచ్చింది. కేరళం మంత్రి సీపీ జాన్ తాజాగా దీనిపై కామెంట్ చేయడమే కాదు… సర్కార్ బడుల ప్రస్తావనను తీసుకొచ్చి ఈ రెండింటికీ లింకు చేయడమే వివాదమైంది. అసలాయనేమన్నాడు? ఇటీవలే కేరళంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టింది ఆ సర్కార్. అయితే అంతకు ముందున్న మహిళా ప్రయాణికులతో పోల్చితే ఈ ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టిన తరువాత చాలా ఎక్కువగా ప్రయాణిస్తున్నారని తేలిందట.
దీనిపై ఈ మంత్రి సర్కార్ స్కూళ్లకు దీనికి లింకు చేస్తు మాట్లాడాడు. మహిళలు ఫ్రీ బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తోసుకుంటూ మరీ ఎక్కుతున్నారు. బాగానే ఉంది. నిజంగా ఇది వారికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది. కానీ సర్కార్ స్కూళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నా.. తమ పిల్లలని మాత్రం ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారెందుకు? ఇదే సమయంలో సర్కార్ దవాఖనాలను కూడా బాగానే వాడుకుంటున్నారు. ఈ స్కూళ్ల విషయంలో ఈ వైరుధ్యమేమిటీ? అని ప్రశ్నించారు.
ఆయన ఉద్దేశ్యం సర్కార్ బడులను కూడా వినియోగించుకుంటే.. ప్రైవేటుకు కట్టాల్సిన ఫీజుల భారం తగ్గుతుంది కదా!అని. కానీ ఆ మంత్రికి ప్రాక్టికల్ నాలెడ్జి తక్కువేననాలి. ఎందుకంటే.. ఫ్రీ బస్సు పథకాన్ని మహిళలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు నిజమే. పేద, మధ్య తరగతి బడ్జెట్కు ఇది ఊతంగా నిలుస్తున్నది. ప్రైవేటు జాబులు చేసుకునే వారికి నెలకు దాదాపు గా పదివేల రూపాయల వరకు దీని ద్వారా మిగులుతున్నాయి. అప్పటి వరకు ఆటోలు.. ఇతర రవాణా సౌకర్యాలపై ఆధారపడి వెళ్లే మహిళలు కూడా ఫ్రీ బస్సును వినియోగించుకుంటున్నారు. అందుకే ఆ బస్సులు కిక్కిరిస్తున్నాయి. బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం సర్కార్ మీద ఉంది.
ఇక సర్కార్ బడుల విషయానికి వస్తే.. ఈ వ్యవస్థపై ఇంకా నమ్మకం కుదరలేదు. పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకుంటున్నారు. ఆస్తులు పంచి ఇవ్వకున్నా.. తాము అప్పుల పాలైనా సరే, పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలనే ఉద్దేశమే అందరిలో ఉంది. అందుకే అంతా ప్రైవేటు స్కూళ్ల వైపు చూస్తున్నారు. మరీ పేద వర్గం సర్కార్ బడులకు పంపుతున్నది. అదీ వారికి గత్యంతరం లేకనే.
కానీ సర్కార్ విద్యా వ్యవస్థలో మార్పులు పెద్దగా రాలేదు. అందుకే వీటిపై ఇంకా గురి కుదరడం లేదు. ఇక ఆస్పత్రుల విషయం కూడా ఆ మంత్రి ప్రస్తావించాడు. సర్కార్ ఆస్పత్రులను కూడా బాగానే వినియోగించుకుంటున్నారని. అయితే ప్రైవేటులోకి వెళ్లడం లేదా? చాలా మంది ఇప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులపైనే ఆధారపడుతున్నారు. మరీ పేదరికంలో ఉన్నవారు తప్ప సర్కార్ ఆస్పత్రుల్లోకి వెళ్లడం లేదు. ఈ వ్యవస్థపైనా ఇంకా గురి కుదరలేదు జనానికి.
అది ఏ రాష్ట్రమైనా.. విద్యా, వైద్యం విషయంలో సర్కార్ చేపడుతున్న చర్యలు, సంస్కరణలు జనానికి వాటి మీద నమ్మకాన్నైతే పెంచడం లేదు. పాలకులు మారినా.. ఈ వ్యవస్థల తీరు మారడం లేదనేది దశాబ్దాలుగా జనాలు చూస్తున్నారు. అందుకే కష్టమైనా, భారమైనా ఈ రెండు అంశాల్లో ఎక్కువగా ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు.
ఉచిత రవాణా అనగానే అటువైపు ఎందుకు పోతున్నారంటే.. ఉన్నపళంగా వారిని ఆర్థికంగా భారం కాకుండా అది ఆదుకుంటున్నది కాబట్టి. ఇప్పుడు ఈ పథకం ప్రతీ రాష్ట్రంలో అనివార్యమైంది. ఎందుకంటే.. మనిషి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. ఆదాయమూ పెరగడం లేదు. కానీ అన్ని ఖర్చులూ పెరిగిపోయాయి. అందుకే ఈ ఫ్రీ బస్సు.. ఆ పెరిగిన ఖర్చుల్లోంచి రవాణాకు సంబంధించిన భారాన్ని మినహాయిస్తున్నది. అది ఆ కుటుంబాలకు దొరుకుతున్న ఉపశమనంగా చూడాలి.