నాలుగు నెలల తరువాత కొత్త పార్టీతో సొంత గడ్డపై అడుగుపెట్టిన కవిత.. సింహ గర్జన చేశారు. కంటనీరు పెట్టుకున్ని అందరి హృదయాలను తడిమిన ఆమె.. తను పరికిదాన్ని కాదని పరాశక్తిగా మారి రాక్షస లీడర్ల భరతం పడతానని ప్రతిన బూనారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీఆరెస్ పాంచజన్య సంకల్ప సభనుద్దేశించి ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. సివంగిలా గర్జించారు. ఇందూరు నేతలెవ్వరినీ వదల్లేదు. అందరినీ పేరు పేరునా తనదైన శైలిలో పలకరించారు. ఇక మీ పని అయిపోయింది.. ఇప్పటి దాకా ఒకలెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క అని ఆ వేదికగా తీర్మానం చేసేశారు.
మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారామె. కేసీఆర్తో తనను దూరం చేయడంలో శకుని పాత్రను పోషించిన ప్రశాంత్రెడ్డి… బీఆరెస్ ఓడిపోగానే ముకుంద్రెడ్డి, వేం నరేందర్రెడ్డిలతో కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిపారన్నారు. గంజాయి డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఒక్కో ఓటుకు 30వేల దాకా ఖర్చు చేసి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచాడని విమర్శించారు.
ఇక బాల్కొండను మరిచిపోయి.. వ్యాపారంచేసుకోవాలని, మళ్లీ పోటీ చేస్తే వెంటాడి ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆరెస్ సిట్టింగులందరినీ ఓ రౌండ్ అర్సుకున్నారు కవిత. అంతా పాత ముఖాలే, అవినీతికి కేంద్రాలే. పోరాటం తెలియదు.. ప్రజల సమస్యలు పట్టి లేవు.. మళ్లీ వీళ్లకే ఇస్తాడు కేసీఆర్ టికెట్లు.. మనమెందుకు వీరిని గెలిపించాలి… టీఆరెస్ ద్వారా వచ్చే కొత్త శక్తులను గెలిపిచుందామని పిలుపునిచ్చారు.
బంగారు తెలంగాణ పేరు చెప్పి బతుకులు బుగ్గిపాలు చేశారని, తాను బహుజన తెలంగాణను తెచ్చి సబ్బండవర్ణాల బతుకుల్లో మార్పులు తెస్తానన్నారు. అధికార పార్టీ నేతల అసమర్థతను ఎండగట్టారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, అన్ని అబద్దపు హామీలిచ్చి ఫెయిలయిన పార్టీ అని విమర్శించారు.
ఓట్లప్పుడు ఒట్లు, ఆ తరువాత తిట్లు.. ఇవే రేవంత్రెడ్డికి తెలుసునన్నారు. కేటీఆర్ వల్లే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కు దీన్ని అమ్మేందుకే అలా చేశారని విమర్శించారు. ఇందూరులో ఇక తన పార్టీ షాడో ఎమ్మెల్యేలు జనాల వద్ద తిరుగుతారని, ఎవరికి ఏ ఆపతి వచ్చినా రోడ్డెక్కుతామన్నారు.
త్వరలో ఇంచార్జిలను ప్రకటించి పార్టీ పరంగా ఇందూరులో టీఆరెస్ సత్తా చాటుతామన్నారు. బీజేపీ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో కుమ్మక్కై నిర్మిస్తున్న అవినీతి కాంప్లెక్సుల బాగోతం బయట పెడతామని వార్నింగ్ ఇచ్చిన కవిత.. ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీలో మంతనాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఏడేండ్లలో ఓ పైసా నిధులు కూడా నిజామాబాద్కు తేలేదన్నారు. ఆయనో అధర్మపురి అని… జనాలు అర్వింద్ను తుక్కు కింద ఓడగొట్టేందుకు రెడీగా ఉన్నారన్నారు.
కొత్త పార్టీ పెట్టిన తరువాత తొలిసారిగా పెట్టిన నిజామాబాద్లో పెట్టిన సభ సక్సెసయ్యింది. ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఇప్పటి వరకు జరిగిన సభలతో పోల్చితే .. ఇందూరు సభ హైలెట్గా నిలిచింది.