Challa Babu: వేదికపై మాట మధ్యలో ఆగిపోయింది. చల్లా బాబు కళ్లు చెమ్మగిల్లాయి. పుంగనూరు టీడీపీ ఇంచార్జి మార్పు వ్యవహారం ఇప్పుడు భావోద్వేగ ఘట్టానికి దారి తీసింది. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో.. మాజీ ఇంచార్జి చల్లా బాబు తన మనసులో మాట బయటపెట్టారు. నలభై ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, పార్టీకి, చంద్రబాబుకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని చెప్పారు. పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అయితే.. కొందరు నియోజకవర్గ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేశారన్నారు చల్లా బాబు.
ఎవరి పేరు పెట్టి ఆరోపణలు చేయకపోయినా.. ఆయన మాటల్లో అసంతృప్తి కనిపించింది. ప్రసంగం చివర్లో చల్లా బాబు కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. పుంగనూరులో టీడీపీ ఇంచార్జి పదవి చుట్టూ వర్గపోరు నడిచింది. నియోజకవర్గంలో పార్టీ కేడర్ మధ్య ఉన్న విభేదాలు, ప్రత్యర్థి వర్గాల నుంచి చల్లా బాబు తీరుపై వచ్చిన ఫిర్యాదులు.. మార్పుకు ప్రధాన కారణం. స్థానిక నేతలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం నియోజకవర్గంలో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.
Also read: డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..
చల్లా రామచంద్రారెడ్డిని ఇంచార్జ్గా తప్పించింది. చల్లా బాబు గతంలో పుంగనూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోటగా ఉన్న పుంగనూరులో.. టీడీపీని బలోపేతం చేసేందుకు దశాబ్దాల పాటు పనిచేసారు. అలాంటి నేతని తప్పించి.. మధుసూదన్ నాయుడిని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో.. టీడీపీ అధిష్టానం ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, మార్పులు చేర్పులు చేపట్టింది. మరి.. చల్లా బాబు వర్గం.. కొత్త ఇంచార్జికి అండగా నిలుస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.
Also read: బిగ్ బాస్ పై సోనియా షాకింగ్ కామెంట్స్..గుర్తింపు రాలేదు అంటూ!