వెయ్యి రోజుల పాలనపై సర్కార్ తన ప్రగతి ప్రోగెస్ను విడుదల చేసింది. అందులో చాలా అంశాలే ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ది గురించిన పురోగతి బాగానే జరిగింది. దీనికి తగినంత ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడం వల్ల కూడా రేవంత్ సర్కార్పై పాజిటివ్ కన్నా నెగిటివ్ ప్రచారమే ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు.
ఓ వైపు బీఆరెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా ఇచ్చిన హామీలపై నిరసన ప్రదర్శనకు దిగుతున్న తరుణంలో.. సర్కార్ తన వెయ్యి రోజుల పాలనను ప్రజాపాలనగా అభివర్ణించుకుని సమర్థించుకుంటున్న తరుణంలో ఇది సామాన్య ప్రజానీకంలో కూడా చర్చకు వస్తున్న అంశంగా మారింది.
హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు పథకం.. ఈ మూడు జనాలకు బాగా కనెక్టయ్యాయి. ఈ సర్కార్కు ఇవే ప్రధాన ఆయువు పట్టుగా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. స్టార్టింగ్లో హైడ్రాపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరిగింది. దీన్ని బీఆరెస్ కూడా బాగా హైప్ క్రియేట్ చేసి జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోయే క్రమంలో సక్సెసయ్యింది.
క్రమంగా హైడ్రా పేదల కోసమేననే భావన ఏర్పడుతోంది. ఇప్పుడు హైడ్రా ఉండి తీరాలనే పట్టు జనాల నుంచే రావడం కూడా దీని ప్రయార్టీని తెలియజేస్తోంది. రంగనాథ్ లాంటి ఆఫీసర్ ఉండటం, ప్రభుత్వం ఆయనకు పూర్తి పవర్స్ ఇవ్వడం మూలంగా అక్రమార్కుల్లో ఓ వణుకును తీసుకురాగలిగింది సర్కార్. కానీ బీఆరెస్ ఆదిలో దీనిపై పెంచిన గొంతును అదే స్థాయిలో వినిపించలేకపోతున్నది. కారణం.. జనాలకు దీనిపై ఉన్న వ్యతిరేకత తగ్గడమే.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పురోగతి బాగుంది. జీహెచ్ఎంసీలో తీసుకున్న టవర్స్పై కూడా భారీ అంచాలున్నాయి. పేద వర్గాల్లో పాజిటివ్ చర్చ జరుగుతోంది. ఉచిత బస్సు పథకం.. మహిళల నుంచి విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్నది. దీనిపైనా బీఆరెస్ మొదట్లో తప్పుడు ప్రచారం చేయాలని చూసినా.. వెనక్కి తగ్గాల్సిన పరిస్థితే ఎదురైంది. దీన్ని కాదని బీఆరెస్ కూడా వచ్చే ఎన్నికల్లో ముందుకు పోలేదు… అంతలా ఆదరణ పొందిన పథకంగా చూడాలి దీన్ని.
ఇక అడ్మినిస్ట్రేషన్పై పట్టు లేదు. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఉచిత పథకాల అమలు బాగానే ఉంది. కానీ దీని కన్నా ..దివాళా తీస్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాల్సిన అసవరం ఉంది. ఆర్థిక పరిపుష్టి లేకపోవడం.. జనాల జీవితాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. రేవంత్ రాగానే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని బాగా ప్రచారంలో ఉంది. దీనిపై నజర్ పెట్టాలి.
పాలమూరు లాంటి వలస జిల్లా నుంచి కూడా సర్కార్ పై వ్యతిరేకత రావడానికి కారణం.. నిర్మాణ రంగం కుదేలవడం. అడ్డా కూలీలకు కూడా పనులు దొరకని దుర్బర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో.. సర్కార్ దీనిపై కూడా సీరియస్గా నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది.
పార్టీలో నిస్తేజం ఏర్పడింది. సర్కార్ వచ్చినా మాకేం లాభం జరగలేదని నిరుత్సాహం పెరిగింది. ఎవరూ ఉత్సాహంగా లేరు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలంటే పార్టీ పటిష్టతను కూడా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది.