Manuguru Gang: హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్న శివ అనే యువకుడు రాఖీ పండుగ కోసం సొంతూరు మణుగూరుకు వచ్చాడు. కానీ ఇది తనకు చివరి పండుగ అవుతుందని అతను ఎప్పుడూ ఊహించి ఉండడు. తన దగ్గర పనిచేసే కార్మికుడు సతీశ్ సోదరిని ఇంతకుముందు MK గ్యాంగ్ వేధిస్తుండగా.. శివ అడ్డుకుని వారిని హెచ్చరించాడు. అప్పటి నుంచే ఆ గ్యాంగ్కు శివపై పగ పెరిగింది.
శివ ఊరికి వచ్చాడని తెలుసుకున్న గ్యాంగ్.. కసితీర్చుకునేందుకు కుట్ర పన్నింది. మాట్లాడుకుందామనే నెపంతో ఏరియా స్టోర్ గ్రౌండ్స్కు అతడిని పిలిపించారు. అప్పటికే 30 మంది గ్యాంగ్ సభ్యులు అతడి కోసమే ఎదురుచూస్తూ మాటేసి ఉన్నారు. శివ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా అతడిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. కనికరం లేకుండా పిడిగుద్దులతో దాడి చేశారు.
శివను కాపాడేందుకు వెళ్లిన అతని స్నేహితులను కూడా ఆ గ్యాంగ్ వదల్లేదు. అయితే మరింత తీవ్రంగా గాయపడిన శివ.. అక్కడికక్కడే గ్రౌండ్లో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. రాఖీ కట్టించుకోవాలని ఎంతో సంతోషంగా వచ్చిన తమ్ముడు .. కొన్ని గంటల్లోనే శవమై మిగిలాడని అతడి అక్కచెల్లెళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also read: తెలంగాణలో 22A రచ్చ.. సామాన్యుడి ఆస్తి హక్కులపై బీజేపీ పొలిటికల్ వార్!
ఖాన్ దాన్ అని పేరు పెట్టుకుని మణుగూరును అగ్నిగుండంగా మార్చేస్తున్నారు కొందరు రౌడీ మూకలు. కాలనీల్లో ఆడపిల్లలపై ఈవ్టీజింగ్లు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామనే బెదిరిస్తున్నారు. పిల్లలు ఆడుకోవాల్సిన ఆటస్థలాన్ని మత్తు పదార్థాలు, మద్యం తాగే రౌడీ గ్రౌండ్గా మార్చేసి అరాచకం సృష్టిస్తున్నారు.
డ్రగ్స్ మత్తులో కళ్ళు మూసుకుపోయిన రౌడీలు.. పాత రౌడీ షీటర్ల అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. రౌడీయిజాన్ని ప్రశ్నించిన వృద్ధ తల్లిదండ్రులకు మరణశాసనం రాస్తున్నారు. మా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని. తమకు రక్షణ ఇవ్వండని ఆ వృద్ధాప్యపు కళ్లు రాలుస్తున్న కన్నీళ్లు ప్రతీ ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి.
సోదరుడి చేతికి రాఖీ కట్టాలనుకున్న ప్రేగు బంధాల కల.. కన్నీటి చిత్రంగా మారిపోయింది. ఒక అమాయకుడి ప్రాణం బలిగొన్న ఈ గ్యాంగ్వార్పై పోలీసులు ఎంతవరకు కఠిన చర్యలు తీసుకుంటారో.. మణుగూరు వాసులకు నిజమైన భద్రత ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also read: బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు