ఉగ్రవాదుల్ని ఎదిరించేలా ఆర్మీ కొత్త వ్యూహం
కశ్మీర్ బోర్డర్లో.. ప్రతి పౌరుడు సైనికుడే!
భారత శత్రువులెవరైనా సరే.. మన బోర్డర్ దాటాలంటే ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందుకోసం.. భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయి. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు.. బోర్డర్ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తోంది.
కిష్ట్వార్, దోడా, ఉధమ్ పూర్ జిల్లాల్లో ఉగ్ర కదలికలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో.. జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో.. భద్రత దృష్ట్యా.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు.. ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా.. కిష్ట్వార్, దోడా, ఉధమ్పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది.
ఆర్మీ, కశ్మీర్ పోలీసుల సీఆర్పీఎఫ్ బృందాల ట్రైనింగ్
గత నెలలో కిష్ట్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని.. దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో.. ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని.. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి.. పోలీసులు, సైన్యమే.. ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లలో.. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు.
విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి రైఫిళ్లు, ఆటోమేటిక్ గన్స్, వాడకంపై ట్రైనింగ్
విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో.. రక్షణాత్మకంగా ఉండటంతో పాటు, వారిపై ఏవిధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు.
డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక టెక్నిక్లపైనా విలేజ్ గార్డ్స్కి శిక్షణ
బోర్డర్ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి.. పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడంపైనా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు.. డ్రోన్ టెక్నాలజీ, రాత్రి పూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్లపైనా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి ట్రైనింగ్ సెషన్స్ని నిర్వహిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో భద్రత పటిష్టంచేసే చర్యలు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. జమ్మూకశ్మీర్లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయ్. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు.. ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా.. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు.. సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు.
ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్
మరోవైపు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే.. వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.
రెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం
విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ చేతికి తుపాకులిస్తున్నారు.. శత్రువు కనిపిస్తే కాల్చిపారేసేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫుల్ ఫిట్నెస్తో ఉండి.. సరిహద్దు గ్రామాల రక్షణ బాధ్యతల్ని వాళ్లకు అప్పజెబుతున్నారు. ఇదంతా ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నా.. రెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు బోర్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలతో.. పూర్తిస్థాయిలో అలర్ట్ చేశారు. దాంతో.. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు విలేజ్ గార్డ్స్కి ట్రైనింగ్ ముమ్మరం చేశారు.
కిష్ట్వార్, దోడా, పహల్గామ్ ఉగ్రవాద కార్యకలాపాలు
పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రదాడి జరగడానికి ముందే.. కిష్ట్వార్, దోడా, పహల్గామ్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ దాడులు.. సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా లోటును ఎత్తి చూపాయి, దాంతో.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ తప్పనిసరైంది. ముఖ్యంగా.. కిష్ట్వార్, దోడా లాంటి కొండ ప్రాంతాల్లో పోలీసు, సైనిక బలగాలు నిరంతరం గస్తీ తిరగడం కష్టం. అందువల్ల.. స్థానిక గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులే.. తమ గ్రామాలను రక్షించుకోవడంలో కీలకంగా పనిచేస్తారు.
గ్రామస్థులకు ఆత్మరక్షణని ఇచ్చే వీడీజీ గ్రూపులు
ఈ విలేజ్ గార్డ్స్.. ఉగ్రవాదుల దాడులను అడ్డుకోవడంతో పాటు, స్థానిక సమాచారాన్ని సేకరించి అధికారులకు అందిస్తారు. వీరిలో స్థానిక యువత, మాజీ సైనికులు, స్థానిక పోలీసు సిబ్బంది ఉంటారు. వీరికి శిక్షణ ఇవ్వడం వల్ల.. స్థానికంగా ఉన్న ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమాజం ఐక్యంగా నిలబడి పోరాడుతుంది. ఈ వీడీజీ గ్రూపులు గ్రామస్థులకు ఆత్మరక్షణ సామర్థ్యాన్ని అందిస్తాయ్. దాంతో.. టెర్రరిస్టుల భయంతో బతకాల్సిన పరిస్థితులు తగ్గిపోతాయి.
రెండేళ్ల క్రితమే వీడీజీ గ్రూపుల్ని మొదలుపెట్టిన అధికారులు
వాస్తవానికి.. రెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పెరిగిన ఉద్రిక్తతలతో పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. కొన్నిరోజులుగా ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి శిక్షణ కూడా సైన్యం వ్యూహాంలో ఓ భాగంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఉగ్రవాదులకు గట్టి సమాధానమిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో.. వీడీజీ గ్రూప్స్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ భద్రతను పటిష్ఠం చేస్తున్నారు.
వీడీజీలకు సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల ట్రైనింగ్
ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, నార్తర్న్ కమాండ్ లాంటి విభాగాలు.. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో ఎంతో అనుభవం కలిగి ఉన్నాయ్. వాళ్లే.. విలేజ్ గార్డ్స్కి అత్యంత సమర్థవంతమైన శిక్షణను అందిస్తున్నారు. సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ వీరికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల.. ఆపరేషనల్ సమన్వయం మెరుగుపడుతుంది. ఇది ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ టెక్నాలజీలు
సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లను నిర్మూలించేందుకు.. మన సైన్యం డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ లాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. వీటిని.. వీడీజీ గ్రూపులకు పరిచయం చేయడం ద్వారా వారి సామర్థ్యం కూడా పెరుగుతుంది. టెర్రరిస్టులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో దాక్కునే అవకాశం ఉన్నందున.. సైన్యం.. విలేజ్ డిఫెన్స్ గార్డులకు గెరిల్లా యుద్ధ వ్యూహాలు, సెర్చింగ్ ఆపరేషన్లపైనా శిక్షణ ఇస్తోంది. మరోవైపు.. మన సైన్యం సన్నద్ధతను, విలేజ్ డిఫెన్స్ గార్డుల ట్రైనింగ్ని చూసి.. పాకిస్థాన్ కూడా వాతలు పెట్టుకుంటోంది.
పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ వేగవంతం
పీవోకేలోని స్థానిక ప్రజలకు ఇలాంటి ట్రైనింగే ఇస్తోంది. భారత సైన్యం చేసే దాడుల్ని తిప్పికొట్టేందుకు శిక్షణ కార్యక్రమాలను పెంచినట్లుగా వార్తలొస్తున్నాయ్. ఇప్పటికే.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణని వేగవంతం చేసింది. ఈ విలేజ్ గార్డులు కూడా స్థానిక సమాచారాన్ని అందించడంలో సహాయపడుతున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.