Nellore Politics: నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు లోలోపల అసంతృప్తితో అల్లాడిపోతున్నారట. తమ చేత్తో తమ కళ్ళనే పొడుచుకునట్లు తమ అధిష్టానమే తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారట. అప్పుడూ వైసీపీ వారి పెత్తనమే..ఇప్పుడు వారి పెత్తనమేనా అంటూ పెదవి విరుస్తున్నారట. తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక తపస్సు చేసే మౌన మునుల్లా మారిపోతున్నారట. ఇంతకీ తెలుగు తమ్ముళ్ల అవేదన ఏంటి?.. అసలు సింహపురి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది?
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతల పెత్తనమే దానికి ప్రధాన కారణం
రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే సింహపురి గా పిలవబడే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా, నిత్యం వార్తల్లో ఉంటాయి. కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను చెప్పుకుంటారు. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో పదికి పది స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం కనిపించింది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది. అయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆనందం టీడీపీ శ్రేణుల్లో ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతల పెత్తనమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతల్లో ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు.. వారితో కలిసి అనేక మంది వైసీపీ నేతలు, క్యాడర్ టీడీపీ గూటికి చేరిపోయారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి మకాం మార్చేశారు. కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేటకు ఎమ్మెల్యేలుగా కొత్త వ్యక్తులను టీడీపీ పరిచయం చేసింది.
అధిష్టానం ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదట
వైసీపీ శ్రేణుల రాకతో ఆందోళన చెందుతున్న తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న కీలక నేతలకు టీడీపీ అధిష్టానం మంచి భరోసానే ఇచ్చింది. ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని, రాబోయే రోజుల్లో పదవుల విషయంలో తొలి ప్రాధాన్యత మీకే ఇస్తామని బుజ్జగించింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు ఆ నేతలు. కానీ ప్రస్తుత పరిస్థితి తారుమారైందట. అధిష్టానం ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదట. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. దేవాలయాల్లో కమిటీల దగ్గర నుంచి ప్రధాన కార్పొరేషన్ల వరకు తూతూ మంత్రంగానే పదవులు వస్తున్నాయట. పైగా కూటమి ప్రభుత్వం కావడంతో జనసేన, బీజేపీకి పదవుల పందేరం చేయాల్సి వస్తోంది. దీంతో పదవులు ఆశించిన తెలుగు తమ్ముళ్లు భంగపడాల్సి వస్తోందంట.
గ్రామాల్లో, పట్టణాల్లో ఫించన్ల పంపిణీ
మరోవైపు ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యేల గెలుపుకోసం పరుగులు తీసి పనిచేశారు. గ్రామాల్లో, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లలో అప్పటి వైసీపీ నేతలను ఎదుర్కుని ఎన్నికల్లో అష్టకష్టాలు పడ్డారు తెలుగు తమ్ముళ్లు.. తాజా పరిణామాల నేపధ్యంలో వైసీపీ నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు టీడీపీలోకి వచ్చారు. ఎవరినైతే ఎన్నికల్లో తాము ఎదురొడ్డి గొడవలు పడి పనిచేశామో.. వారితో కలిసి ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఫించన్ల పంపిణీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వారినే పొగడాల్సి వస్తోందని తెలుగు తమ్ముళ్లు అవేదన చెందుతున్నారు. పైగా మెన్నటి ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన క్యాడర్ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో పాత టీడీపీ నేతల కంటే ముందే వారికి కావాల్సిన పనులను చకచకా చేసేసుకుంటూ వెళ్లిపోతుంటే పాత టీడీపీ నేతలు నోరెళ్లబెట్టి చూస్తున్నారట.
మీ గోడు అదైతే మరి నా గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన అవేదన
అదలా ఉంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వ సమయంలో శాసించిన కొంత మంది సీనియర్ నేతలు ఇప్పుడు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పక్కన చేరారు. అప్పట్లో వారి పెత్తనం భారీగానే కనిపించంది. టీడీపీ నాయకులను నోరెత్తనిచ్చేవారు కాదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేసేవి. ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా వారే పెత్తనం చేసుకుంటూ వెళ్తున్నారట. నెల్లూరు కార్పొరేషన్లో అయితే అదే సభ్యులు, అదే నాయకులు ప్రస్తుతం టీడీపీ కండువాలు కప్పుకు కూర్చుని తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక తాము టీడీపీని గెలిపించుకుని ఏం లాభం అన్నఅంతర్మధనం తెలుగు తమ్ముళ్లను ఉడికిస్తోందట. ఈ విషయంపై ఎవరితో అయినా మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా తమ రాజకీయ భవిష్యత్ ఊహించుకుని సైలెంట్ అయిపోతున్నారట. ఓ టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దగ్గర తమ బాధ చెప్పుకుంటే.. మీ గోడు అదైతే మరి నా గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన అవేదననను ఆయన వెళ్లగక్కారట.
రాష్ట్ర అధ్యక్ష రేస్ లో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర
తాజాగా తెలుగు దేశం పార్టీ నూతన జిల్లా అద్యక్షులను నియమించింది. రాష్ట్ర అధ్యక్ష రేస్ లో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రను నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించమని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై బీదాకు అవగాహన ఉంది. కొత్తగా వచ్చిన నేతలు ఎవరు.. పాత నేతలు ఎవరు అనేది తెలిసిన నాయకుడు. ఆ క్రమంలో తమ ఆవేదన రవిచంద్ర ముందు పెట్టాలనే ఆలోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారట. కానీ ఏకాంతంగా కలిపిస్తే కానీ తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారట.
తమ పరిస్థితి దారుణంగా తయారైందని అనుకుంటున్నారట
తమ బాధ చెబితే, పనీబాట లేకుండా నేతల ఎదురుగా కుర్చీల్లో కూర్చుని వారు చెప్పే మాటలు విని ఆయా ఎమ్మెల్యేలు, నాయకుల చెవిన వేసే బ్యాచ్ వల్ల భయపడాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ఇంతలా భయపడాల్సి వస్తోందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందంగా ఉండేవారని, తమ పరిస్థితి దారుణంగా తయారైందని అనుకుంటున్నారట. మరి తెలుగు తమ్ముళ్ల ఆవేదనను బీదా రవిచంద్ర తీరుస్తారా.. తనకెందుకులే అని ఆయన కూడా మౌన మునిలా మారిపోతారో వేచి చూడాలి.