Kavitha Strategy: కవిత రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దక్కిన ఊరటను రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. కవితపై సీబీఐ కోర్టు కేసు కొట్టేసినప్పుడు, ఆమె అరెస్ట్ కారణంగానే బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ కీలక నేతలు వ్యాఖ్యానించారు. దాంతో కేసు నడుస్తున్న సమయంలో, తర్వాత బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ను ఆస్త్రంగా చేసుకుని…రాజకీయంగా బీఆర్ఎస్ను ఇరుకునపెట్టేలా కవిత అడుగులు వేస్తున్నారట.
గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ యాక్టివిటీస్లో చురుగ్గా ఉన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఉద్యమ సమయంలోనే సొంతగా తెలంగాణ జాగృతి సంస్ధను స్థాపించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వ్యాప్తికి కృషి చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి పాలు అయ్యారు. అయితే ఆమెకు 2020లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. కవిత మంత్రి కావాలని అనుకున్నారు అని చెబుతారు. కానీ అది జరగలేదు
కేవలం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్న కల్వకుంట్ల కవితకు తన తండ్రి పార్టీలో కూడా సముచిత పదవి దక్కలేదు. అధికారం కోల్పోకముందే ఆమెసోదరుడు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీలో చక్రం తిప్ప మొదలుపెట్టారు. అలాగే హరీష్ రావు సహా ఇతర నేతలకు ప్రాముఖ్యత దక్కడంతో కవిత పార్టీతో కొంత గ్యాప్ పాటస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమె ఇరుక్కుని, అరెస్టు కావడం జరిగిపోయాయి. ఈ కేసు తరువాత కవితను పార్టీ పెద్దలు ఇంకా దూరం పెట్టారని ఆమె వర్గీయులు విమర్శిస్తుంటారు. అందుకే ఆమె బెయిల్పై విడుదలయ్యాక కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించలేదంట.
లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ తనయురాలికి ఎట్టకేలకు పూర్తి ఊరట దక్కింది. దాంతో ఆమె ఇపుడు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. తొందరలో పార్టీని పెట్టాలని అనుకుంటున్న ఆమెకు తాజా తీర్పు నెత్తిన పాలు పోసినట్లు అయిందనేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్. నిజానికి కవిత మీద విమర్శలు ఎక్కువగా చేసింది బీఆర్ఎస్ నేతలే అని అంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ క్వీన్ గా విమర్శించడం కల్వకుంట్ల వారి ఆడబిడ్డకు తీవ్ర ఆవేదన కలిగించాయం. నిజానికి లిక్కర్ స్కాం విషయంలో కవిత దాదాపు అయిదు నెలలు జైలు జీవితం అనుభవించారు. అయితే పార్టీ తరఫున తనకు తగినంత మద్దతు దక్కలేదని ఆమె చాలా సార్లు ఆవేదన చెందారని గుర్తు చేస్తున్నారు జాగృతి నేతలు.
అయితే లిక్కర్ స్కాం లో కలిగిన ఊరటను బీఆర్ఎస్ వాడుకోకుండా కవితపై అభియోగాలు మోపుతోంది. కవిత అరెస్ట్ రాజకీయంగా తమకు నష్టం చేసిందని స్వయంగా కేటీఆఠే వ్యాఖ్యానించారు. తన వల్లనే వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది ఆ పార్టీ నేతలు చెప్పడంపై కవిత మండిపడుతున్నారు. స్వయంకృతాపరాధంతోనే ఆ పార్టీ ఓటమలు మూటగట్టుకుంటోందని ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా లిక్కర్ కేసులో నిర్దోషిగా బయటపడ్డ కవిత.. అనవసరంగా తనను జైలు పాలు చేయడం, తండ్రి పార్టీలో తనను ఏకాకిని చేయడం సెంటిమెంటుగా ఉపయోగపడుతుందని భావస్తున్నారంట.
ఆ సానుభూతి తాను కొత్తగా పెట్టబోయే పార్టీకే దక్కాలని కవిత వ్యూహరచన చేస్తున్నారంట. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చిన ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు దక్కకుండా ఉండేలా కవిత ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారట. కవిత రాజకీయం అంతా ఇపుడు బీఆర్ఎస్పైనే ఫోకస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. జనంలో బీఆర్ఎస్ ని ఎంత పలుచన చేస్తే అంతే స్థాయిలో తన కొత్త పార్టీకి బలం చేకూరుతుంది అన్నది ఆమె వ్యూహంగా ఉందుంటున్నారు. అందుకే ఆమె లిక్కర్ స్కాం తీర్పుని అనుకూలంగా మార్చుకుంటూ అదే సమయంలో బీఆర్ఎస్ మీద విమర్శలు ఎక్కు పెడుతున్నారట. దానికి తగ్గట్లే బీఆర్ఎస్కి కవిత దూరం అవ్వడంతో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ మాదిరిగా తమ పార్టీని బీజేపీ సీబీఐ కేసుల పేరుతో టార్గెట్ చేసిందని చెప్పకునే అవకాశం లేకుండా పోయింది.
బీఆర్ఎస్ విషయంలో కవిత ఎక్కడా తగ్గడం లేదు. రానున్న కాలంలో జనంలోకి మరింతగా ఇదే పాయింట్ తో కవిత దూసుకెళ్లాలని చూస్తున్నారంట. లిక్కర్ క్వీన్ అని విమర్శించిన వారి నోళ్ళు మూతపడేలా ఆమె తన వాయిస్ పెంచేలా మాట్లాడుతున్నారట. లిక్కర్ స్కాం తీర్పుతో బీఆర్ఎస్ సైలెంట్ అవాలన్నదే ఆమె స్కెచ్గా కనిపిస్తోంది. అంతే కాదు తన రాజకీయ భవితకు ఇదే పునాది కావాలని ఆకాంక్షిస్తున్నారట. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా కవిత కొత్త పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అన్నది ఆసక్తికరంగా తయారైంది. కవిత స్వయంగా సత్తా చాటుకోవడనికి అవలంభిస్తున్న స్రాటజీలతో.. ఆమె ఫ్యూచర్తో పాటు బీఆర్ఎస్ ఫేట్ కూడా ఆధారపడి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Story by: Apparao, Big Tv