Kavitha Three-Colored Saree: కాదేది రాజకీయాలకనర్హం.. దేవుడు, కారు, బ్యాట్, పువ్వు.. ఆఖరికి కట్టుకునే చీర కూడా. అస్సలు నమ్మకపోతే బీఆర్ఎస్ నేతలను అడగండి. తెలంగాణ జాగృతి నేత కవిత కట్టిన చీరపై రచ్చ చేస్తున్నారు కారు పార్టీ నేతలు. మూడు రంగుల చీర కట్టిన కవిత.. ఇక కాంగ్రెస్లో చేరడం ఖాయమంటూ ప్రచారం మొదలైంది. ఇంతకీ ఏంటీ చీర గోల? అసలెందుకు ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎందుకు మొదలైంది?
కవిత సస్పెన్షన్తో మారిన మొత్తం కథ
కల్వకుంట్ల కవిత.. ఎప్పుడైతే ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్కు రాసిన లేఖ బయటికి వచ్చిందో.. అప్పటి నుంచి ఆమె అడుగులు, మాటలు, చేతలు అన్ని బీఆర్ఎస్కు దూరంగా జరుగుతున్నట్టే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేయడంతో కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది అనే హింట్స్ ఇచ్చేస్తున్నారు కవిత. ఇలాంటి సమయంలో కవిత కట్టిన ఒక్క చీర ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఈ ఈవెంట్కి కవిత కాంగ్రెస్ జెండాలోని మూడురంగులున్న చీరను ధరించి వచ్చారు.
కవిత కట్టిన చీరపై తెగ చర్చ
ఇప్పుడీ చీరపై తెగ చర్చ జరుగుతోంది. కవిత కాంగ్రెస్లో చేరుతున్నానని హింట్ ఇస్తున్నారా? అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతోంది. నిజానికి కవిత కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం ఇప్పటిది కాదు. గతంలో కూడా జరిగింది. కానీ ఆమె ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పారు. ఈ మధ్యే కొత్త పార్టీ పెడతానంటూ హింట్స్ కూడా ఇస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి ఈ ఈవెంట్కు అటెండ్ అవ్వడానికి ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అఫ్కోర్స్ అప్పుడు కూడా ఆమె అదే రంగు చీరలో ఉన్నారు. అప్పుడేం మాట్లాడారో ఓ సారి వినండి.
కవితను టార్గెట్ చేస్తూ ట్రోల్స్
ఉదయం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన కవిత.. అదే రోజు సాయంత్రం భట్టి విక్రమార్క్ కొడుకు నిశ్చితార్ధానికి హాజరయ్యారు. అప్పుడు ఈ రంగు చీరలో ఉండటంతో ఇప్పుడు పార్టీ మార్పు, కాంగ్రెస్లో చేరిన అనే చర్చ మొదలైంది. మాములుగానే గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.. అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందనే చెప్పాలి. కవితను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ ప్రారంభించారు. మూడు రంగుల జెండా చీర ధరించారు.. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్టుగా పోస్ట్లు పెడుతూ పోతున్నారు.
వణికిపోతున్న బీఆర్ఎస్ నేతలు
మరోవైపు ఉదయం కాంగ్రెస్ గద్దెలు కూల్చమని బీసీ సోదరులకు పిలుపునిచ్చి.. సాయంత్రం కాంగ్రెస్ మంత్రి ఇంట్లో వేడుకకు హాజరవడాన్ని ఎలా చూడాలన్నది మరికొందరి కామెంట్స్. కానీ అది పార్టీ.. ఇది వ్యక్తిగతం అంటూ ఆమె మద్దతుదారులు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా కొన్ని రోజులుగా కవిత తీరు మాత్రం అందరిని కాస్త టెన్షన్ పెడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె మైక్ ముందుకు వస్తే బీఆర్ఎస్ నేతలకు ఓ చిన్నపాటి వణుకు వస్తుందనే చెప్పాలి. ఎవరిని టార్గెట్ చేస్తుందో..? ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నేతలు ఈ చీర ఇష్యూని అంది వచ్చిన అవకాశమని భావిస్తున్నారు.
Also Read: డీసీసీల ఎంపికపై కాంగ్రెస్లో గందరగోళం.. హైకమాండ్ నిర్ణయం ఇదేనా!
మరి నిజంగా ఈ చీర ధరించడం వెనక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? నిజంగానే ఆమె ప్రజలకు హింట్ ఇచ్చారా? లేక ప్రజల నాలుకలపై ఉండటానికి వ్యూహాత్మకంగా ఈ చీరను సెలెక్ట్ చేసుకున్నారా? యాధృచ్చికంగా జరిగిందా? అనేది మాత్రం పెద్ద మిస్టరీగానే ఉంది ప్రస్తుతానికి.
Story By Vamshi Krishna, Bigtv