Warangal: ఓరుగల్లు పొలిటికల్ సెగలు…అక్కడి సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ను డామినేట్ చేస్తున్నాయట. సవాళ్లు ప్రతి సవాళ్లతో…ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయ్భాస్కర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. బహిరంగ చర్చకు దమ్ముందా అంటూ మాజీ ఎమ్మెల్యే విసిరిన చాలెంజ్ కు… అంతేఘాటుగా స్పందించారు నాయిని. ఇంతకీ ఓరుగల్లు పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది?
ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్ళాలంటే…చుట్టూ అనుచరుగణం, గన్ మెన్లు, భారీ కాన్వాయ్….అదంతా ఓ సినిమా రేంజ్ సీన్. కానీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఓ బైక్ పై హనుమకొండ బస్టాండ్ కు చేరుకున్నారు. అక్కడి వ్యాపారులతో ఒంటరిగానే ముచ్చటించారు. ఎమ్మెల్యే చుట్టూ గన్మెన్లు లేరు, భారీ కాన్వాయ్ లేదు, అనుచరగణం అసలే లేదు. చూస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారట. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన ఛాలెంజ్ విసరడంతో, ఎమ్మెల్యే నాయిని ఒంటరిగా బస్ స్టాండ్ కు వచ్చి రెండు గంటలు అక్కడే ఉన్నారట.
పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ను బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ఘాటుగా స్పందించారు. సంక్రాంతి గంగిరెద్దుల్లా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, పత్తి కొనుగోళ్లు జరిపే సీసీఐ ఎవరి చేతుల్లో ఉంటుందో తెలియదా అంటూ కౌంటర్ ఇచ్చారు. కవిత ఇస్తున్న షాక్ లతో హరీష్ రావు మెదడు పనిచేయట్లేదన్నారు.
రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కోట్లు దోచుకున్నందుకు సిగ్గుపడాలని హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును అంతలా విమర్శిస్తే ఊరుకుంటారా అంటూ అధిష్టానం ఫైర్ అవడంతో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పొలిటికల్ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి, అధిష్టానం చురకల అంటిన ఫ్రస్ట్రేషన్ లో వ్యక్తిగత విమర్శలు చేశారు వినయ్ భాస్కర్. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి దమ్ముంటే గన్ మెన్లు లేకుండా హన్మకొండ బస్ స్టాండ్ కు వెళ్ళాలని సవాల్ విసిరారు. దీంతో క్షణాల్లో బస్ స్టాండ్ వద్ద ఒంటరిగా ప్రత్యక్షమయ్యారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
సుమారు రెండు గంటల పాటు బస్టాండ్ ప్రాంగణంలోని వ్యాపారులతో ముచ్చటించారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. అంతేకాకుండా, తాను ఒంటరిగా వచ్చానని.. ఇప్పుడు రా చూసుకుందాం అంటూ వినయ్ భాస్కర్ కు ప్రతి సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని ఫైర్ అయ్యారు. త్వరలోనే స్థానిక బీ ఆర్ ఎస్ నేతల అవినీతి బాగోతాలు బయటపెట్టి, బజార్లో నిలబెడతానని మండిపడ్డారు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరినట్లు అయింది.
హరీష్ రావు మెప్పుకోసం, వ్యక్తిగత విమర్శలు చేసి వినయ్ భాస్కర్ తప్పు చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హాయంలో హుడ్ హుడ్ తుఫాను కారణంగా వేల మంది రైతులు ఆగమైనప్పుడు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రి హరీష్ రావు ఎంతమంది బాధితులను ఆదుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుల పేరుతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని మరి కొంతమంది మండిపడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన సవాల్ కు, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్పందిస్తారని ఎవరూ ఊహించలేదట. అయితే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈగోను వినయ్ భాస్కర్ రెచ్చగొట్టారని, అంతేగాటుగా ప్రతిస్పందన ఉంటుందని, కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. దీంతో వరంగల్ పశ్చిమ పాలిటిక్స్ లో ఏం జరగబోతుందోననే చర్చ జోరుగా సాగుతోంది.
Story by Apparao, Big Tv