Nara Lokesh: రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక పథకం ‘కలలకు రెక్కలు’ను వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. విదేశాల్లో మరియు స్వదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో, 88,196 మంది స్వదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.
మరోవైపు, విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై మంత్రి లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించి, విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉమ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.
విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా కూడా చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ, జేమ్స్ కుక్ వంటి వర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిని మంత్రి ఆరా తీశారు. విశాఖపట్నాన్ని ఎడ్యుసిటీగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా, అక్కడ వరల్డ్ క్లాస్ ఏవియేషన్ వర్సిటీ, ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా గుజరాత్కు చెందిన నామ్ టెక్ సంస్థ రాష్ట్రంలో 3 హబ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, అలాగే ప్రభుత్వ ఐటీఐలను బ్లూస్టార్, అమరరాజా వంటి పరిశ్రమలతో అనుసంధానించామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా 26 డిప్లొమా కోర్సుల కరిక్యులమ్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.
పాఠశాల విద్యలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి, బాలల భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేందుకు, ఎంపిక చేసిన ఉత్తమ టీచర్లను మార్చిలో సింగపూర్కు, వేసవిలో ఫిన్లాండ్కు పంపించి అక్కడి విద్యా విధానాలపై శిక్షణ ఇప్పించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. డిసెంబర్ 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహించాలని, టెట్, డీఎస్సీ ప్రక్రియలను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కోన శశిధర్, విజయరామరాజు, నారాయణ భరత్ గుప్త తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Gold mining: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. లక్షల టన్నుల గోల్డ్.. ఎక్కడో తెలుసా..?