AP Politics: ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం.. ఇప్పుడే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు పవన్. కూటమి ఏడాది పాలన ఇలా ముగిసిందో.. లేదో.. అప్పుడే వైసీపీకి రాజకీయ భవిష్యత్ లేకుండా అడ్డుకుంటామని చెప్పడం చూస్తుంటే.. ఆంధ్రాలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల దాకా ఇదే వేడి కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని జగన్ పదేపదే ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా అధికార కూటమికి, అధికారులకు బ్లూ బుక్ వార్నింగులు ఇస్తున్నారు. ఆ క్రమంలో జనసేనాని వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానంటున్న పవన్
ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ వార్నింగుతో వైసీపీపై పవన్ వ్యూహాం ఏంటి అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2029 టార్గెట్గా అడుగులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. 2029లో అధికారంలోకి రాగానే 2.0ను చూస్తారంటూ తరుచూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ చేస్తున్నారు. 2029లో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి వాళ్ల సంగతి చూస్తానని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నారు.
జగన్ కామెంట్స్పై తీవ్రస్థాయిలో స్పందించిన పవన్
తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులలో ఇటీవల జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై కూడా క్లారిటీ ఇచ్చారు జగన్. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇటీవల జగన్ చేస్తున్న కామెంట్స్పై స్పందిస్తూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చినీయంశంగా మారాయి. ప్రకాశం జిల్లా పర్యటనలో.. పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. అసలు.. వైసీపీ అధికారంలోకి రావాలి కదా? ఎలా అధికారంలోకి వస్తారో.. మేమూ చూస్తామంటూ.. పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కూటమి బంధంపై స్పష్టత ఇచ్చిన జనసేనాని
చంద్రబాబుకు అనుభవం ఉంది.. నాకు పోరాడే శక్తి ఉంది.. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉంటేనే.. ఏపీకి భవిష్యత్ అంటూ.. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రా పొలిటికల్ సర్కిల్స్లో.. ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయ్. వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఉంటుందో.. ఎవరికి వారు పోటీకి దిగుతారోనన్న ఊహాగానాలు, అనుమానాలకు చెక్ పెట్టేలా.. మార్కాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశాయ్. కూటమి బంధంపై చంద్రబాబుకు, తనకు స్పష్టత ఉందని.. ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని చెప్పారు. కూటమిలో కొన్ని విభేదాలుంటే ఉండొచ్చని.. ఎవరూ ఎక్కువ, తక్కువ కాదని చెప్పారు. ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్.
15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉండాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. గతంలోనూ.. పవన్ కల్యాణ్.. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉండాలని చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. కానీ.. కిందిస్థాయిలో తెలుగుదేశం, జనసేన నాయకులకు మధ్య తేడాలొస్తున్నాయి. ఇవన్నీ.. పవన్, చంద్రబాబు దృష్టికి వస్తున్నా.. ఎక్కడికక్కడ గొడవల్ని సద్దుమణిగేలా చేస్తున్నారు. ఇది.. ఈ ఒక్క టర్మ్తో అయిపోయేది కాదని.. 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని.. కూటమి పార్టీల క్యాడర్ని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
వ్యక్తిగత విమర్శలకు ధీటుగా బదులిచ్చిన పవన్ కళ్యాణ్
అదలా ఉంటే వైసీపీపై ఇంత గట్టిగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వ్యూహం ఎంటనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2014 నుంచి వైసీపీని రాజకీయంగా బలంగానే ఎదుర్కోంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్. ప్రజాసంక్షేమం కంటే పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ క్లియర్ ఇండికేషన్ ఇచ్చిన పవన్….రాజకీయం వైసీపీని బలంగా ఎదుర్కోంటామనే సంకేతాలు పంపించారనేది విశ్లేషకుల మాట. గతంలో వైసీపీ నాయకులు తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పవన్ కల్యాణ్ ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాము తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు పవన్.. రంపాలు తెస్తాం….మెడకాయలు కోస్తామంటే.. చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామనుకున్నారా అని పవన్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సరదాగా ఉంటాయని.. అద్భుతమైన పాలన చేసి ఉంటే.. 151 స్థానాల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. తమది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదని.. తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా సిద్ధమవుతున్న జనసేన
2029లో వైసీపీ కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే పవన్ వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ స్టార్ట్ అయింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, వైఫల్యాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ… కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే…వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేనాని. ఎన్నికలకు ముందు, తర్వాత వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులను జనసేనలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి దెబ్బకొట్టారు. చేరికల ద్వారా వైసీపీ బలాన్ని తగ్గించి, జనసేన బలాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.
Also Read: ఫీజు కట్టలేదని కాలేజీలో వేధింపులు చివరికి..
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం
ఓ వైపు చేరికలపై దృష్టి సారించడమే కాకుండా వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు పవన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్…వారి సమస్యల పరిష్కారం చూపుతూ ఆ వర్గాలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకును బలహీనపరిచే వ్యూహాన్ని జనసేనాని పకబ్బందీగా అమలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీని రాజకీయంగా దెబ్బతీయడమే పవన్ కళ్యాణ్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత..ఆ పార్టీని మరింత బలహీనపరిచి…ఆ పార్టీ ఓటు బ్యాంకును తగ్గించే ఎత్తుగలతో పవన్ ముందుకు వెళ్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వ్యూహం ద్వారా, 2029 ఎన్నికల్లో వైసీపీని రాజకీయంగా నిర్వీర్యం చేసి జనసేన-కూటమి బంధాన్ని కొనసాగించాలని పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు.
జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్న పవన్ ప్రసంగాలు
పవన్ కల్యాణ్ సినీ ఇమేజ్ను రాజకీయంగా ఉపయోగించుకుంటూనే…ప్రజలతో భావోద్వేగ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి ఎలా వస్తోందో చూస్తామ అనే వ్యాఖ్యలు వైసీపీకి గట్టి హెచ్చరిక పంపడమే కాకుండా…జనసేన క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నాయి. మొత్తంగా వైసీపీని కట్టడీ చేసేందుకు పవన్ గీస్తున్న యక్షన్ ప్లాన్, ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.