Rottela Festival : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మొదలైంది. ఏటా మోహరం పర్వదినం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు. నేటి నుంచి 11 వరకు 6 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లాట్ ఫామ్లు సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి అదే రొట్టెను చెల్లిస్తారు. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేయాలని అన్నారు.
Also Read: తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ఈ రోట్టెల పండుగ కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ..7జోన్లుగా దర్గా ప్రాంగణాన్ని విభజించి.. 7వేల మందికి పైగా సిబ్బందిని పరిశుభ్రతకోసం నియమించారు. 1600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువులో గజ ఈతగాళ్లని బోట్లతో సిద్ధం చేశారు. 24 పార్కంగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.