Karnataka MP Prajwal Revanna Case: కర్ణాటకలో ఇప్పుడు ఒక్కటే టాపిక్.. సరిగ్గా మరో వారంలో పోలింగ్ జరుగుతుందనగా కొన్ని వీడియోలు తెరపైకి వచ్చింది. ఈ వీడియోలే ఇప్పుడు కన్నడ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే వైరలవుతున్న ఈ సెక్స్ టేప్స్లో ఉన్నది. కర్ణాటకలోని హాసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్ నేత.. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. యువతులను ట్రాప్ చేసి కొందరిని.. బెదిరించి మరికొందరిని.. తన లైంగిక వాంచనలు తీర్చుకున్నాడు. వాటిని వీడియోలు తీసి అనేక సార్లు బెదిరించాడు. మొత్తం 3 వేల వీడియోలున్న పెన్ డ్రైవ్ అతని వద్ద ఉంది. ఇవీ ప్రజ్వల్ రేవణ్ణపై ఉన్న అలిగేషన్స్.. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అయితే ఇలా ఆరోపణలు చేసిన వారిలో ఒకరు. స్వయానా ప్రజ్వల్ బంధువు కావడం మరో హైలేట్.. బాధితురాలిలో ఒకరు ప్రజల్వ్ తల్లికి స్వయానా మేనత్త కూతురు. రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఆరుగురు మహిళలు, యువతుల్లో ఒకరు ఆమె.. తన కూమార్తెకు కూడా ఫోన్ చేసి వేధించేవాడని చెబుతుంది ఆమె.. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి.. వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ లొంగదీసుకున్నాడని చెబుతున్నారు బాధితురాలు.నిజానికి మరోసారి ప్రజ్వల్ హసన్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఈ నెల 26న ఇక్కడ పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్కు ముందు నుంచే ప్రజ్వల్కు సంబంధించినవి అని చెబుతున్న ఈ వీడియోలు.. వైరల్గా మారాయి.
అయితే ఎన్నిక ముగిసిన తర్వాత ఆయన వేరే దేశానికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్. ఏ తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు? పోలీసులకు అందుబాటులో ఉండకుండా వెళ్లిపోవడం దేనికి సంకేతం? అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నలు.. ఒక్క ప్రజ్వల్పై మాత్రమే కాదు.. ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భార్య ఇంట్లో లేనప్పుడు.. హెచ్డీ రేవన్న.. మహిళా సిబ్బందిని స్టోర్రూమ్కి పిలిచేవాడని. తమపై లైంగిక దాడి చేసేవాడని చెబుతుంది బాధితురాలు. తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని వారు గొంతు విప్పేందుకు ప్రయత్నిస్తుండటం చూసి..తాను కూడా ముందుకు వచ్చానని బాధితురాలు చెబుతుంది.
ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో ఈ అంశం రాజకీయంగా అగ్గి రాజేస్తుంది. మే 7న మూడో దశ ఎన్నికల్లో కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అటు జేడీఎస్, ఇటు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సెక్స్ టేప్స్కు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే జేడీఎస్ ఇది డీప్ ఫేక్ వీడియో అని ఆరోపిస్తుంది..
కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఏమో.. నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అంటున్నారు. సిట్ దర్యాప్తు ముగిసే వరకు వెయిట్ చేద్దామంటున్నారు. బీజేపీ ఏమో మౌనంగానే ఉంది..
కానీ ఈ ఇష్యూ ఇప్పటికే తీవ్ర ఆందోళనలకు కారణమవుతుంది. ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజ్వల్, రేవణ్ణ, కుమారస్వామి, దేవేగౌడ ఫోటోలతో ఉన్న మాస్కులు ధరించి ఆందోళనలు చేస్తున్నారు. కర్ణాటకపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక్కడున్న 28 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు గెలుచుకునేలా పావులు కదుపుతుంది. అందుకే జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. కానీ ప్రజ్వల్ రూపంలో బీజేపీ ఆశలకు గండి పడే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ఘటనను సమర్థించలేక, విమర్శించలేక.. అడకత్తెర పొకచెక్కలా తయారైంది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. 10 రోజుల క్రితం ప్రధాని మోడీ ప్రశంసించిన నేత ఇప్పుడు విదేశాలకు పారిపోయారని.. ఇప్పుడు కూడా మోడీ మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు ప్రియాంకగాంధీ..ఇంకా జేడీఎస్తో బీజేపీ ఎందుకు పొత్తులో ఉంది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు ఖర్గే.. మరి బీజేపీ దీనికి ఏం సమాధానం చెబుతుంది? అనేది బిగ్ క్వశ్చన్.