Congress Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన కను సైగలతో దశాబ్దాల తరబడి జిల్లా రాజకీయాలను శాసించారు ఎంపీ రేణుకాచౌదరి .. అప్పట్లో కాంగ్రెస్ ఆదిష్టానం వద్ద ఆమె ఏం చెబితే అదే నడిచేదట..అంతలా రాజకీయాలని ప్రభుతం చేసిన ఆమె ప్రస్తుతం ఆ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు .. ఆమెనే నమ్ముకున్న అనుచర వర్గానికి పార్టీ అధికారంలో ఉన్నా దిక్కులేకుండా పోయిందంట. ప్రస్తుతం ఆమెను జిల్లాకు రాకుండా ఆ వర్గానికి చెక్ పెట్టేలా జిల్లా మంత్రులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఫలితంగానే రేణుకాచౌదరి తన అనుచరులను సైతం పట్టించుకోని పరిస్థితి వచ్చిందా? అసలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని చెప్పుకునే రేణుకాచౌదరి
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక వెలుగు వెలిగిన మహిళ నేత.. జిల్లా ఆడ బిడ్డగా చెప్పుకునే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి.. పొలిటికల్ సర్కిల్ లో ఆమెకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. టీడీపీలో తన రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టి 2 సార్లు రాజ్యసభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడ ఖమ్మం జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన ఆ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు
2019లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి పరాజయం
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండవ సారి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు..గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో పర్యటించిప్పుడు అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రేణుక చౌదరి ఒంటి కాలుపై విరుచుకుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
మన్మోషన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రేణుక
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1998లో కాంగ్రెస్లో చేరి రెండు సార్లు ఖమ్మం ఎంపీగా గెలిచి, 2004లో మన్మోహన్ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరికి సోనియా గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉందంటారు. అందులో భాగంగా ఆమెను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్దల సభకు పంపి రాజ్యసభ సభ్యురాలిగా నియమించారు. ఆ క్రమంలో ఆమె ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు, నాలుగు సార్లు మాత్రమే ఖమ్మం జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
ఏడాదిగా ఖమ్మం జిల్లా వైపు చూడని రేణుకచౌదరి
ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రఘురాంరెడ్డి తో కలిసి, జిల్లాను పర్యటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రేణుక చెప్పి దాదాపు సంవత్సరం అవుతుంది.. అప్పటి నుండి ఇప్పటి వరకు రేణుకా చౌదరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాకపోవడం గమనార్హం.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో రేణుకా చౌదరికి ముందు నుంచి తనకంటూ ఓ ప్రత్యేక వర్గం ఉంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండి కూడా జిల్లాలో ఆమె పర్యటించక పోవడంతో పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గతం నుండే జిల్లాలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరి నడుమ వర్గపోరు ఓ రేంజ్లో ఉంటూ వచ్చింది.
రాజకీయంగా మంత్రులతో పోటీ పడలేకపోతున్నారా?
అలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఎవరి సొంత వర్గాలు వారికున్నాయి. పూర్తి ఫాంలో ఉన్న ఆ ముగ్గురు బలమైన మంత్రుల మధ్యకు వెళ్లి రాజకీయం చేయలేక.. రేణుకాచౌదరి జిల్లాకు వెళ్లలేకపోతున్నారన్న చర్చ నడుస్తుందట. మరోవైపు జిల్లాలో ఆమె అవసరం లేదనే సంకేతాలు ఆదిష్టానానికి జిల్లా నేతలు పంపారన్న టాక్ కూడా వినిపిస్తోంది.ఆ క్రమంలో ఎప్పటి నుండో రేణుకా వర్గంగా చెప్పుకుని కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్నవారు అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారట.. ఆమె జిల్లాకు రాకపోవడంతో అనుచర వర్గం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందట. ముగ్గురు మంత్రులతోను ఆమెకు పోసగకపోవడం లేదన్న టాక్ కూడా ఉంది.
జిల్లా మంత్రుల పర్యటనలో కనిపించని రాజ్యసభ సభ్యురాలు
జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలిగా ఉండి జిల్లా మంత్రుల పర్యటనలో ఆమె ఇప్పటి వరకు పాల్గొన్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఆమె జిల్లాకు రాకపోవడానికి కారణాలు ఏవైనా రేణుక తన క్యాడర్ ను కాపాడుకోవడం కోసమైనా జిల్లాలో పర్యటించాలని అనుచరులు కోరుకుంటున్నారట. ఇంకో వైపు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ప్రాధాన్యత ఉంటుందో లేదో? అని ఆమె అనుచరుల్లో గుబులు చెందుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
నామినేటెడ్ పదవుల్లో జిల్లా మంత్రుల వర్గీయులకు పెద్ద పీట
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, తుమ్మల వర్గీయులకు నామినేటెడ్ పదవుల్లో అగ్ర పీఠం వేశారు. కానీ రేణుక వర్గానికి చెందిన వారికి ఎలాంటి నామినేటెడ్ పదవులు కట్టబెట్టకపోవడంపై ఆమె వర్గీయులు ఇప్పటికే అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట.. ఇదే వ్యవహారంపై రేణుకా సైతం ఇటీవల కాలంలో రాష్ట్ర అధిష్టానంతో తేల్చుకుంటానంటూ హైదరాబాదులో తన నివాసంలో అనుచరుల ముందు ఘాటుగా వ్యాఖ్యానించారంట.
Also Read: అంబటికి జగన్ షాక్? ఆ పోస్ట్ ఊస్ట్!
అయితే ఇంతవరకు అతీగతి లేకపోవడంతో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి ఎక్కడ మొండి చెయ్యి చూపుతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట ఆమె వర్గీయులు. ఈ పరిస్థితికి కారణం ముగ్గురు మంత్రులతో ఆమెకు సయోధ్య లేకపోవడమా?.. లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వద్ద తగిన ప్రాబల్యం లేదా? అన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించక పోతే నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటానని రేణుకాచౌదరి అంటున్నారంట. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి కారణంగానే మంత్రులతోనూ ఆమె అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో రేణుక ప్రభావం తగ్గిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇప్పటికైనా తన వారి కోసమైనా ఆమె రంగంలోకి దిగుతారా? లేదంటే.. ఆ మంత్రులతో మన కేందుకులే అని సర్దుకుపోతారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv