Telangana Congress 1000 Days: వెయ్యి రోజులు! అంటే.. దాదాపు మూడేళ్లు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతోంది. ఇన్నాళ్ల పాలనలో.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతోంది కాంగ్రెస్ నాయకత్వం. వెయ్యి రోజుల పాలనపై రేవంత్ సర్కార్ తన ప్రగతి ప్రోగెస్ను విడుదల చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ది గురించిన పురోగతి బాగానే జరిగింది. దీనికి తగినంత ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడం వల్ల రేవంత్ సర్కార్పై పాజిటివ్ కన్నా నెగిటివ్ ప్రచారమే ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. ఓ వైపు బీఆరెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా ఇచ్చిన హామీలపై నిరసన ప్రదర్శనకు దిగుతున్న తరుణంలో.. సర్కార్ తన వెయ్యి రోజుల పాలనను ప్రజాపాలనగా అభివర్ణించుకని సమర్థించుకుంటుంది. ఇది సామాన్య ప్రజానీకంలో కూడా చర్చకు వస్తుంది.
వెయ్యి రోజుల్లో తాము అద్భుతమైన పాలన అందించామని, తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో పాటు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు పంట రుణ విముక్తి కలిగించామని, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించామని తెలిపారు.
వెయ్యి రోజుల పాలనలో.. పంట రుణాల మాఫీతో పాటు, సన్నవడ్లకు క్వింటాలుకు 500 బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ విజయవంతంగా అమలవుతున్నాయి. ఇప్పటివరకు 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కులగణనతో పాటు, ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీలకు వది్య, ఉద్యోగాల్లో రిజర్వ్డ్ వాటాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేయడం చరిత్రాత్మకమైన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా ఆరు గ్యారంటీల అమలు తుది దశకు చేరుకుందని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శక పాలనను అందిస్తున్నామంటున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయ్. ఆరు గ్యారంటీలతో పాటు మిగతా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదంటున్నారు. దీనిపై.. బీఆర్ఎస్ నిరసనలకు కూడా కార్యాచరణ ప్రకటించింది. వెయ్యి రోజుల పాలనలో.. ప్రజల ఆకాంక్షలను ఏ మేర నెరవేర్చిందనే అంశంపై.. రానున్న రోజుల్లో రాజకీయ చర్చ జోరందుకునే అవకాశం ఉంది.
హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు పథకం.. ఈ మూడు జనాలకు బాగా కనెక్టయ్యాయి. ఈ సర్కార్కు ఇవే ప్రధాన ఆయువు పట్టుగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. స్టార్టింగ్లో హైడ్రాపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తరువాత పరిస్థితి మారింది. క్రమంగా హైడ్రా పేదల కోసమేననే భావన ఏర్పడుతోంది. ఇప్పుడు హైడ్రా ఉండి తీరాలనే పట్టు జనాల నుంచే రావడం కూడా దీని ప్రయార్టీని తెలియజేస్తోంది. కానీ బీఆరెస్ ఆదిలో దీనిపై పెంచిన గొంతును అదే స్థాయిలో వినిపించలేకపోతున్నది. కారణం.. జనాలకు దీనిపై ఉన్న వ్యతిరేకత తగ్గడమేనని తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పురోగతి బాగుంది. జీహెచ్ఎంసీలో తీసుకున్న టవర్స్పై కూడా భారీ అంచనాలున్నాయి. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలపై పేద వర్గాల్లో పాజిటివ్ చర్చ జరుగుతోంది. ఉచిత బస్సు పథకం.. మహిళల నుంచి విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంది. దీనిపైనా బీఆరెస్ మొదట్లో తప్పుడు ప్రచారం చేయాలని చూసినా.. వెనక్కి తగ్గాల్సిన పరిస్థితే ఎదురైంది. ఇక అడ్మినిస్ట్రేషన్పై రేవంత్ సర్కార్ పట్టు కోల్పోయిందనే అభిప్రాయాలున్నాయి.
ఉచిత పథకాల అమలు బాగానే ఉన్నా.. దీని కన్నా దివాళా తీస్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాల్సిన అసవరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక పరిపుష్టి లేకపోవడం.. జనాల జీవితాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నదనే భావన ఉంది. పార్టీలో నిస్తేజం ఏర్పడింది. సర్కార్ వచ్చినా మాకేం లాభం జరగలేదనే నిరుత్సాహం క్యాడర్లో పెరుగుతోంది. ఎవరూ ఉత్సాహంగా లేరు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలంటే పార్టీ పటిష్టతను కూడా సీరియస్గా తీసుకోవాలనే కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా .. సీఎం రేవంత్ ఉగ్రరూపం !
ఇదే సమయంలో యూరియా కొరత, యాప్ అమలు, 22ఏ భూములు, పాలిటెక్నిక్ జీవో 97, హైడ్రా వంటి అంశాలపైన BRS విమర్శనాస్త్రాలు సందిస్తోంది. గత BRS పాలనతో పోలిస్తే జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి ఎలా ఉంది? మొత్తంగా వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నలు కీలకంగా మారాయి.