తిరుపతి జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట ముదురుతోంది..! ఇప్పటి వరకు వైసీపీతో పోరాడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపును వ్యతిరేకిస్తున్న వర్గం.. మధుసూదన్ నాయుడును ఇంచార్జిగా కోరుతోంది. ఈ వివాదం చివరకు బహిరంగ ఘర్షణకు దారితీసింది.
2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి.. ఎన్నికల తర్వాత కూడా ఆయన ఇంచార్జిగా కొనసాగుతున్నారు. తను బరిలో ఉన్నందునే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగానని, టీడీపీకి రాజకీయంగా బలం పెంచామని చెబుతున్నారు చల్లా. అయితే.. క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు, పార్టీ వ్యవహారాల్లో ఆయన వర్గం ఆధిపత్యం పెరగడంపై అసంతృప్తి వంటి కారణాలు ఆయనపై నెగెటివిటీని పెంచాయి. అందుకే ఇంచార్జి మార్పు అంశం బలంగా తెరపైకి వస్తోంది. మధుసూదన్ నాయుడును కొత్త ఇంచార్జిగా నియమించాలనే ప్రతిపాదన కూడా పార్టీ పెద్దల ముందుకు వెళ్లింది.
ఇక ఈ వివాదం ఎంత తీవ్రంగా మారిందంటే.. 2026 జూలైలో పుంగనూరులో జరిగిన టీడీపీ అభిప్రాయ సేకరణ సమావేశమే రణరంగంగా మారింది. ఇంచార్జి మార్పు ఖాయమంటూ మధుసూదన్ వర్గానికి చెందిన నేత మాట్లాడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముల్లంగి వెంకటరమణపై దాడి జరగడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వివాదంపై చంద్రబాబు జోక్యం చేసుకున్నా మధుసూదన్ నాయుడు వర్గం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
పుంగనూరులో పార్టీపై ఎవరి పట్టు ఉండాలి? వచ్చే ఎన్నికలకు పార్టీని ఎవరు నడిపించాలి? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఇదే వివాదానికి ప్రధాన కారణమవుతోందనే వాదన ఉంది. ఒకవైపు.. చల్లా బాబును కొనసాగించాలనే వర్గం..మరోవైపు.. మార్పు తప్పనిసరి అంటున్న మధుసూదన్ నాయుడు వర్గం…ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోతే.. పుంగనూరులో వైసీపీతో పోరాటం కంటే ముందే టీడీపీకి సొంతింటి పోరు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
Also Read: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?
చివరికి చంద్రబాబు నిర్ణయం ఏంటి? చల్లా బాబుకే మరోసారి ఛాన్స్ ఇస్తారా? లేక మధుసూదన్ నాయుడు వర్గం డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటారా? అనే అంశం ఆసక్తిగా మారింది.
– Written by Dandugula Srinivas, BIG TV