బీఆరెస్ సోషల్ మీడియాను సర్కార్ తట్టుకోలేకపోతున్నదా? అది విపరీతంగా అబద్దాలు ప్రచారం చేస్తూ రేవంత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నదా? అంటే అవుననే అనాల్సి వస్తోంది సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్లను చూసిన తరువాత. ఇటీవల ఏ సభ జరిగినా బీఆరెస్ సోషల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయన. తోలు తీస్తానంటున్నారు. మిమ్మల్ని వదిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ వార్నింగులకు వెనక్కి తగ్గడం లేదు బీఆరెస్ సోషల్ మీడియా. వీరికి కేటీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ప్రచారం ఉంది. నెలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారంటున్నారు. లీగల్గా కూడా వారికి రక్షణ కల్పించడంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు కేటీఆర్. అంతే కాదు.. వచ్చేది మన సర్కారేననే ఓ భరోసా ఇవ్వడం ద్వారా బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
బీజేపీకి ఉన్నట్టుగానే బీఆరెస్కు కూడా అభిమానులున్నారు. కేసీఆర్ను బాగా ఇష్టపడేవారు స్వచ్ఛందంగానే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. కౌంటర్లిస్తున్నారు. దీనికి ధీటుగా స్పందించలేక చతికిలబడుతోంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా.. అవి కూడా పరిమిత వనరులతోనే ఉండటం.. అంత యాక్టివ్గా స్పందించలేక పోవడంతో బీఆరెస్ వారియర్స్తో పోల్చితే ధీటుగా నిలబడలేకపోతున్నారు.
Also Read: ‘సొంత గడ్డకు వచ్చా.. కన్నీళ్లు ఆగట్లేదు’.. నిజామాబాద్ సభలో కవిత భావోద్వేగం!
అందుకే ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డికి చిరాకు తెప్పిస్తున్నట్టుంది. బహిరంగ సభల వేదికల మీదే బీఆరెస్పై ఫైర్ అవుతూ వస్తున్నారు. కేటీఆర్కు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలకు కూడా అప్పీలు చేసుకుంటున్నారు సీఎం. ఆ తప్పుడు వార్తలను, అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని రిక్వెస్టు చేసుకుంటున్నారు. మరోవైపు దీనిపై సీఎం ఆదేశాలతో సైబర్ క్రైమ్ సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బీఆరెస్ సోషల్ మీడియాపై వేట మొదలైందని తెలుస్తోంది. వీరిపై చర్యలు తీసుకోకుంటే.. మున్ముందు మరింత నష్టం కలిగించడం ఖాయమనే భావనలో ఉంది రేవంత్ సర్కార్.
– Written by Dandugula Srinivas, BIG TV