దేశంలో దొంగలు పడ్డారు! ఇది అప్పట్లో ఓ ఫేమస్ సినిమా పేరు. చాల ఏళ్లుగా జనం నోళ్లలో నానిన నానుడి. ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి చెప్పాలేమో? దేశంలో బొద్దింకలు పడ్డారని. ఆ సినిమా పేరు నెగిటివిటీకి సంబంధించినది.. ఈ బొద్దింకలు పడ్డారనేది ఒక్క బీజేపీకి తప్ప అందరికీ సానుకూలమైన నినాదమనే చెప్పాలి.
మొన్నటి జంతర్మంతర్ ఉద్యమ ఫలితం దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. బలవంతమైన సర్పము.. చలిచీమల చేతజిక్కి చావదే సుమతీ! అన్నట్టుగా ఈ కాక్రోచెస్ పార్టీ అంత పెద్ద బలాఢ్యుడైన మోడీని ఏం చేయగలుగుతుంది..? అని అనుకున్నారంతా. కానీ మెడలు వంచడమే కాదు.. గజగజా వణికించి.. రాజీనామా చేసేదాకా వదల్లేదు. రాజీనామా చేసి తప్పైందని ఇద్దరూ చెంపలేసుకునేలా చేసిందా ఉద్యమం.
ఆ ఉద్యమం ముగిసిందో లేదో.. ఈ కాక్రోచెస్ మీద వెటకారాలు, హేళనలు, ఆరోపణలు.. అవినీతి మరకలు… ఉగ్రవాద జాడలు..అన్నీ తీశారు. మీదేశారు. కానీ బొద్దింకల విజయాన్ని తక్కువ చేసి చూపలేకపోయారు. ఇప్పుడు ఈ బొద్దింకల కార్యచరణ ఏమిటీ? తరువాతి ఉద్యమ రూపానికి ఏ అంశాన్ని తీసుకోబోతున్నారు? అనే చర్చ కూడా గత కొంతకాలంగా బాగానే జరుగుతున్నది. దీనికి ఇవాళ సీజేపీ పార్టీ నుంచి ఓ క్లారిటీ వచ్చింది.
ఈ నెల 5. 6 తేదీల్లో ముఖ్యమైన కార్యకర్తలంతా .. అంటే దాదాపుగా 50 మంది మీటింగు పెట్టుకుని భవిష్యత్ కార్యచరణ డిసైడ్ చేస్తారట. దేశం మొత్తం తిరిగిరావాలనే ఆలోచన మాత్రం ఉంది. దీనికి లిజనింగ్ టూర్ అని పేరు పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రజల నాడి తెలుసుకొని, సమస్యలపై ఆకలింపు చేసుకుని, సమాజాన్ని మరింతగా అధ్యయనం చేసి .. ఆ తరువాత పోరాటాలు నిర్మించాలనేది ఈ బొద్దింకల వ్యూహంగా ఉంది.
ఇదే విషయాన్ని బయటపెట్టారు కూడా ఇవాళ. ఐదారు తారీఖుల్లో మీటింగులు పెట్టుకుని.. ఎప్పట్నుంచి ఎప్పటి వరకు దేశ మొత్తం తిరిగి రావాలో డిసైడ్ చేసుకుంటారు. ఏయే రాష్ట్రాల్లో ఏయే సమస్యలతో జనం సతమతమవుతూ ఉన్నారు. ఏవి కీలకంగా ఉన్నాయి. బొద్దింకలు చేపట్టే ఉద్యమం ద్వారా ఎంత మందికి మేలు జరగనుంది? ఆ సమస్య తీవ్రత ఎంత? దీని వెనుక రాజకీయ కోణం ఎలా ఉంది? ఇవన్నీ గమనిస్తారు. పరిశీలిస్తారు. తెలుసుకుంటారు. ఆ తరువాతే బరిలోకి దిగుతారన్నమాట.
నీట్ లీక్పై ఉద్యమాన్ని ఒక్క ఢిల్లీకే పరిమితం చేయకుండా పలు మెట్రో నగరాలకు కూడా విస్తరించింది కాక్రోచ్ పార్టీ. హైదరాబాద్లో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కూడా ఆందోళన చేశారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఇష్యూలను తీసుకుని ఎక్కడి వారక్కడే ఉద్యమాలు చేయాలని డిసైడ్ అయ్యింది సీజేపీ పార్టీ.
అందుకే నేషనల్ లిజనింగ్ టూర్.. పేరుతో దేశం మొత్తం కలియ తిరుగుతారన్నమాట. ఈ యాత్ర ద్వారా రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడాన్ని కూడా ఓ పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.