Sujana Chowdary: అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. ఇలా ప్రమాణం చేసిన ఓ ప్రజాప్రతినిధి.. దైవసాక్షిగా చేసిన తన ప్రమాణాన్ని తుంగలో తొక్కేశారు. గెలిచినప్పుడు జనానికి కనిపించిన ఆయన.. ఆ తర్వాత ముఖం చాటేశారట. తాను ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని..ఆ నియోజకవర్గ సమస్యలు తీర్చాలని.. ప్రజల కష్టంలో తోడుండాలని పూర్తిగా మర్చిపోయారట… అందుకే.. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో.. మా ఎమ్మెల్యే కనబడుట లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు..?
ప్రజలకు.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే వారధి
ఎమ్మెల్యే అంటే ఎవరు.. ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉంటూ.. ప్రజకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించే వ్యక్తి. తనను నమ్మి ఓటేసి గెలిపించిన నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా ప్రజలకు కష్టమొస్తే ముందుండాలి. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనాచౌదరి మాత్రం.. ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారట. 2024లో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన సుజనా చౌదరి.. ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
సుజనాచౌదరిపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజలు
సుజనా చౌదరి.. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నేత. కేంద్రమంత్రిగా టీడీపీ తరపున ఢిల్లీలో చక్రం తిప్పారు. అయితే 2019లో బీజేపీలో చేరిన ఆయన.. 2024లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన సుజనాచౌదరిపై స్థానిక ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారట. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఆయన.. తమ ఎమ్మెల్యే అయితే.. సమస్యలు పరిష్కరిస్తారని.. అందుబాటులో ఉంటూ.. కష్టాల్లో తోడుంటాడని అనుకున్నారట. కానీ గెలిచిన తర్వాత సుజనా చౌదరి.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదట. అక్కడి నాయకులు, కార్యకర్తలను కూడా కలవడం లేదని టాక్. ఎప్పుడో అమాస, పున్నానికి ఒక్కసారి వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతారని పెదవి విరుస్తున్నారు. సుజనా చౌదరి గెలిచి ఇప్పటికీ దాదాపు 20 నెలలు అవుతున్నా.. పట్టుమని నాలుగైదు సార్లు కూడా రాలేదట. దీంతో సుజనా చౌదరిని అనవసరంగా గెలిపించామని ప్రజలు, స్థానిక కార్యకర్తలు అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సుజనా చౌదరి నియోజవర్గ పరిధిలోని భవానిపురంలో 42 ఇళ్లను అధికారులు.. కోర్టు ఆర్డర్తో కూల్చివేశారు. బాధలో ఉన్న తమ ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. అస్సలు అటువైపే కన్నెత్తి చూడలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాధితులు.. ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే.. అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో.. మరింత మండిపోయిన ప్రజలు.. క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. దీంతో చేసేదేమి లేక అక్కడున్న సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో అండగా ఉంటానని.. హామీ ఇచ్చిన సుజనా చౌదరి..ఇప్పుడు కష్టకాలంలో కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారని..బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారట.
కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన సుజనాచౌదరి..
ప్రజా ఆగ్రహం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి..బాధితులతో మాట్లాడే తీరికలేక.. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు భవానీపురం బాధితుల తరపున ప్రతినిధులను.. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వద్దకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తీసుకెళ్లారు. బాధితుల అభియోగాలను కలెక్టర్కు వివరించారు. వారి అభ్యంతరాలను పరిశీలించిన కలెక్టర్.. లక్ష్మీ రామ సొసైటీ వ్యవహారం పై ఎంక్వైరీ చేయిస్తానని హామీ ఇచ్చారట. ప్లాట్ల యజమానులను మోసగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారట. కలెక్టర్కు వివరించడం బాగానే ఉన్నా..కనీసం బాధితులను పరామర్శించి.. వారి సమస్యను నేరుగా వినే తీరిక లేదా అంటూ సుజానా చౌదరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారట.
కార్యకర్తలు, నేతలు సైతం ఆగ్రహం
ప్రజలే కాదు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు సైతం సుజనా చౌదరి ప్రవర్తన పట్ల గుర్రుగా ఉన్నారట. ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఏ సమస్య అయినా.. ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ను కలవండి అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఎమ్మెల్యే చెప్పిన ఇంఛార్జుల దగ్గరకు వెళ్తే.. వారు వ్యవహరించే తీరు బాగాలేక బహిరంగంగానే నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఏపీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు.. కానీ సుజనా మాత్రం నియోజకవర్గాన్ని వదిలేసి ఇన్చార్జిలతో వ్యవహారాలను నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయట. ఇది సరైన విధానం కాదు అంటూ కూటమి నేతలు మండిపడుతున్నారట. రాజకీయంగా, స్థానికంగా వస్తున్న విమర్శలతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటారా..? ఇకనుంచైనా ప్రజలకు అందుబాటులో ఉంటారా.. అనేది వేచి చూడాలి.
Story By Kishan, Bigtv