YCP In-charge: తాడేపల్లిగూడెంలో వైసీపీ ఇన్చార్జ్ మార్పుతో ఒక్కసారి గా రాజకీయం వేడి ఎక్కింది. సెగ్మెంట్లో మార్పు కోరుకున్న వైసీపీ క్యాడర్కి అభీష్టానికి అనుగుణంగా అధిష్టానం నియోజకవర్గం పార్టీలో భారీ గా మార్పులు చేర్పులు చేసింది… తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడును వైసీపీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ ఇన్చార్జి కొట్టు సత్యనారాయణను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించింది. ఆ క్రమంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల ఇన్చార్జులను తనదైన స్టైల్లో మార్చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడేపల్లిగూడెంలో కూడా మార్పులుచేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇంతకాలం పార్టీ ఇన్చార్జ్గా కొనసాగుతున్న మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను పక్కనపెట్టేశారు. ఆయన స్ధానంలో వడ్డీ రఘురాంనాయుడి సెగ్మెంట్లో వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జ్ మార్పుతో తాడేపల్లిగూడెం వైసీపీలో ఏం జరుగుతుందనే చర్చ స్టార్ట్ అయింది. 2004లో దివంగత వైఎస్సార్ హయంలో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ గెలుపొందారు. వైఎస్ మరణాంతరం జగన్ వెంట నడుస్తూ వచ్చారు. అంత దగ్గర ఉన్న సీనియర్ని జగన్ పక్కన పెట్టడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోకుండా అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించారంట. ఒంటెద్దు పోకడల కారణంగానే వైసీపీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దానికి తోడు నియోజకవర్గంలో బిల్డింగ్ లే అవుట్ల మంజూరు, ప్రారంభోత్సవాలు, ఇతరాత్రా కార్యక్రమాల సమయాల్లో అనుమతుల కోసం భారీగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో అటు ప్రజలు, ఇటు సొంత పార్టీలో వ్యతిరేకతతో కొట్టు సత్యానారాయణ 50 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఘోరపరాజయం పాలయ్యారు.
పార్టీ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో మాజీ డిప్యూటీ సీఎం నూతనోత్తేజం తీసుకు రాలేకపోయారనే చర్చ పార్టీలో నడుస్తుందట. పార్టీ కార్యాలయం కొంతమందికే పరిమితమైందనే టాక్ స్ధానికంగా ఉందట. దీంతో పార్టీ నేతలకు, కేడర్ మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు వైపు మారాయట. ఈ నేపధ్యంలో పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మూడంకెల సంఖ్యలో మినహా కొట్టు సత్యానారాయణ జన సమీకరణ చేయలేకపోయారంట. ఇటీవల కాలంలో పార్టీ సీనియర్లతో సైతం వాదనలకు దిగినట్లు సమాచారం. వీటన్నిటి దృష్ట్యా కొట్టు సత్యనారాయణను ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి పీఏసీ మెంబర్ గా నియమించాంటున్నారు.
మంత్రిగా కొట్టు సత్యనారాయణపై సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకతకు పెరిగిపోవడం, ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వడంతో రాజకీయంగా కొట్టు యాక్టివ్గా కనిపించడం మానేశారంట. అందుకే వడ్డీ రఘురాం నాయుడుకు పార్టీ శ్రేణుల మద్దతు పెరిగిందనే చర్చ జరుగుతోంది. దానికి తోడు రఘురాం నాయుడు పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించడం, వారికి భరోసాగా నిలవడం వంటివి మరింత బలాన్ని చేకూర్చాయట. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయాలంటే నాయకత్వ మార్పు అనివార్యమని వైసీపీ అధిష్టానం భావించిందంట. అందుకే రానున్న ఎన్నికలను పురస్కరించుకుని ముందుగానే నాయకత్వ బాధ్యతలను వడ్డీ రఘురాం నాయుడు కు అప్పగించినట్లు నాయకులు మాట్లాడుకుంటున్నారట.
అయితే ఇంచార్జ్ మార్పుతో కొట్టు రాజకీయంగా ఏం చేయబోతున్నారన్న చర్చ నడస్తుందట. పీఏసీ మొంబర్గా నియామకం కావడంతో పార్టీలో కొట్టు సత్యనారాయణ హోదా పెరిగింది తప్ప…తగ్గలేదనేది ఆయన వర్గీయుల చెప్పుకుంటున్నారు. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇరువురు నేతలు ఏ విధంగా కలిసి పని చేస్తారు…నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు వెళతారు అన్నది చర్చినీయంశంగా మారిందట. ఏదేమైనప్పటికీ, ఇన్చార్జ్ మార్పు ఫ్యాన్ స్పీడు పెంచుతుందో లేదో చూడాలి.
Story by: Ajay, Big Tv