Nellore district: నెల్లూరు జిల్లా టీడీపీలో రాజకీయ రగడలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఎన్నికల సమయంలో ఉన్న ఐకత్య ఇప్పుడు కనిపించడం లేదనే టాక్ నడుస్తుంది. ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మధ్య విభేదాలు తారా స్ధాయికి చేరుకున్నాయట. ఇలా వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతుండగానే రీ సెంట్ గా ఓ మహిళ రాజకీయ ఆరోపణలతో వారి వార్ లోకి ఎంట్రీ ఇచ్చి కలకలం రేపుతోంది. ఆమె ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేసింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే..మధ్య లో మహిళ ఎంట్రీ తో ఉదయగిరి రాజకీయం రసవత్తరంగా మారింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎదిగారు. మంత్రి నారా లోకేష్ పిలుపుతో ఉయగిరి ప్రాంతానికి వచ్చి…కాకర్ల ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రయాలు చేశారు. అప్పటికే ఇక్కడ ఉన్న మాజీ ఎంఎల్ఎ బొల్లినేని రామారావును పక్కన పెట్టి టిడిపి అధిష్టానం సురేష్ కి టికెట్ ఇచ్చింది. ఇరువురు నేతలు తొలి నుంచి ఎడమోహం పెడమోహంగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవాలో కాకర్ల సురేష్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఎన్నికల ముందు నుంచి ఉదయగిరి రాజకీయాల్లో అడుగుపెట్టి.. తొలిసారి ఎమ్మెల్యే అయిన NRI కాకర్ల సురేష్ ను వివాదాలు చుట్టు ముడుతున్నాయట. ప్రశాంతమైన నియోజక వర్గంలో అనూహ్యం గా రాజకీయ సెగ ప్రారంభమై అది తారాస్థాయికి చేరిందనే టాక్ నడుస్తుందట.
కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారా వుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందనేది స్ధానికంగా వినిస్తున్న టాక్. దీనంతటికీ కారణం గత ఎన్నికల్లో బొల్లినేని రామారావు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడటం..టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ గెలవడమేననేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న చర్చ. ఎన్నికల సమయం నుంచే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , బొల్లినేని రామారావు మధ్య అంతర్గతంగా గ్యాప్ నడుస్తూనే ఉందట. ఏదో ఒక ఘటనతో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయట. మొన్నటికి మొన్న చింతలపాలెం లో ఉన్న తన మామిడి తోటను ఎమ్మెల్యే మనుషులు లాక్కునేందుకు చూస్తున్నారంటూ సదాశివరావు అనే వ్యక్తి ఆరోపణలు చేసిన వెంటనే మరో మహిళ వెంగమాంబ తెర మీదకు వచ్చారు. సాఫ్ట్వేర్ జాబ్ కావాలని అడిగిన తనకు.. రాజకీయ పదవి ఇప్పిస్తానని ఎమ్మెల్యే మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. పొలిటికల్ లీడర్స్ ను నమ్మి మోసపోవద్దని ఆమె చెప్పుకొచ్చారు.
వెంగమాంబ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించారు. గత ఏడాది పింఛన్ల పంపిణీలో భాగంగా దుత్తలూరు మండలం ఏకొల్లు గ్రామానికి వెళ్లిన సమయంలో వెంగమాంబ అనే మహిళ పరిచయం అయిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి చక్కగా వివరించిందని.. పార్టీకి సేవ చేస్తానని చెప్పడంతో.. అంగన్వాడీ పిల్లలకు సేవ చెయ్యాలని సూచించినట్లు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు..తనను అప్రదిష్ట పాలు చేసేందుకు వెంగమాంబ అనే మహిళ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తనను ఇబ్బంది పెట్టాలని వెంగమాంబ చూశారని.. అందుకే ఆమెను దూరం పెట్టానని ఎమ్మెల్యే కాకర్ల మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారం పై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు.
మొత్తానికి రోజుకో వివాదం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తనను లాగుతున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. 2024 ఎన్నికల్లో కాకర్ల సురేష్ విజయం కోసం పనిచేసిన అనేక మంది ఇప్పుడు ఆయనతో లేరనేది స్థానికంగా చర్చ నడుస్తుందట. టిడిపికి చెందిన వ్యక్తులు, ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆయన అనుచరులు సురేష్ చేసే ప్రతి పనిలో అవినీతి, అక్రమాలు వెతుకుతున్నారనే చర్చ జరుగుతుందట. వైసిపి కన్నా టిడిపి నేతలు ఆయనను టార్గెట్ చేస్తున్నారనేది నేతల మధ్య నడస్తున్న టాక్.
ఇటీవల ఉదయగిరి నియోజక వర్గం లో కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించారు ఎమ్మెల్యే. అయితే ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని రామారావు వర్గం బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అభివృద్ధిని అడ్డుకుంటే.. తాటతీస్తా! తొక్కుకుంటూ వెళ్తా.. అంటూ.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .. బొల్లినేని రామారావు పేరు చెప్పకుండా పరోక్షంగా వార్నింగు ఇచ్చారనేది టీడీపీ నేతల మధ్య గుసగుసలు నడుస్తున్నాయట. అప్పటినుంచి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయంట. విభేదాలు తారా స్ధాయికి చేరడంతో నియోజకవర్గం టీడీపీలో రెండు గ్రూపులుగా తయారైంది.
అయితే ఈ విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వార్ లోకి ఇటీవల వెంగ మాంబ అనే మహిళ ఎంట్రీతో మరింత చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆమె పలు ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. అయితే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా వెంగమాంబ ఆరోపణలను కొట్టి పారేశారు. తననాపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే.. అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బెంగుళూరులో ఉన్న వెంగమాంబ ఎలాంటి కౌంటర్ ఇవ్వక పోగా తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఓపికగ్గా ఉండటం నేర్చుకున్నాను కాబట్టి.. మౌనంగా ఉన్నానని ట్విట్ చేసి సైలెంట్ అయిపోయారు. దాంతో కొంత సమయం తీసుకొని ఆమె తన సొంత సోషల్ మీడియాలో కాకర్ల సురేష్ కౌంటర్లకి సమాధానం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
మరో పక్క తనను కావాలనే వివాదంలోకి లాగుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉన్నారని నియోజక వర్గ ప్రజల్లో చర్చ సాగుతోంది. మరి ఉదయగిరి టీడీపీ నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.
Story By: Ajay, Big Tv