Water War: ఇటు తెలంగాణ..అటు ఏపీలో వాటర్ వార్ నిప్పులు రాజేస్తోంది. ఏపీలో టీడీపీ, వైసీపీలు నీటి వివాదాలపూ మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తుంటే..హరీశ్రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై విమర్శల దాడి చేస్తోంది టీడీపీ. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే..మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటున్నారు. ఇంతకీ ఏంటా జల వివాదం? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కాస్త ..రెండు పార్టీల మధ్య పంచాయితీకి ఎలా దారితీసింది?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై, ముఖ్యంగా పోలవరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కృష్ణా జలాల పంపిణీ వంటి అంశాల్లో నిరంతర రగడ కొనసాగుతోంది; ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల మళ్ళింపు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలు, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వాడకం వంటి అంశాలపై చర్చలు, వివాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ జల వివాదాలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి, అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరుగుతున్నాయి.
ఆ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్ కాస్త ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రెస్మీట్ మొదలైన వాటర్ వార్… .సీఎం రేవంత్ స్పీచ్, దానికి కౌంటర్గా హరీశ్రావు విమర్శలతో మరింత హీటెక్కింది. ఈ క్రమంలో అటు సీఎం రేవంత్..ఇటు హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో రీసౌండ్ చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం..ఇప్పుడు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మద్య రాజకీయ రగడను రాజేసింది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే.. మీ హయాంలో అన్యాయం జరిగిందంటూ టీడీపీ, వైసీపీ డైలాగ్వార్కు దిగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో మాట్లాడి….ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా అపామని పేర్కొన్నారు
రేవంత్ కామెంట్స్ని ఆయుధంగా చేసుకుని వైసీపీ…కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు అందరికీ తెలియాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారని జగన్ విమర్శించారు. స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని, ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు స్వార్థమే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు. 22 టీఎంసీల నీళ్లు మనకు ఎందుకు అని ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా అవసరమా అని ఫైర్ అయ్యారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టూ స్టేట్స్ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెగ్యులర్గా రచ్చ నడుస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నీటి వాటాలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటుంటే.. ప్రాజెక్టు పూర్తి అయితే కరువు నెల సీమకు నీటి కొరత తీరుతుందని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుతో ప్లస్ ఏంటి..మైనస్ ఏంటనేది ఎలా ఉన్నా తరచు ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు, మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య వార్గా మారింది.
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వార్కు రీజన్గా మారాయి. చంద్రబాబుని ఒప్పించి..లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించాను అని రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ అస్త్రంగా మార్చకుంటోంది. అటు వైసీపీ అటాక్కు రివర్స్ కౌంటర్లు ఇస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించారని 2022లోనే ట్రైబ్యునల్ పనులు ఆపేసిందని చెప్తున్నారు. అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి సీమ ప్రజలను వైసీపీ మోసం చేసిందంటున్నారు ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దం అనే సవాల్ విసురుతోంది టీడీపీ.
కట్ చేస్తే బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్రావు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీని కార్నర్ చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ని జగన్ హయాంలోనే తాము ఆపించామన్నారు హరీశ్. ఈ కామెంట్స్తో టీడీపీ శ్రేణులు ఇది కదా అసలు మ్యాటర్ అని వైసీపీపై అటాక్ చేస్తున్నాయి. రాయలసీమకు అసలు ద్రోహం చేసింది వైసీపీనే అని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ను ఆపింది ఎవరన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొన్నా.. రెండు రాష్ట్రాల్లో వాటర్ పాలిటిక్స్ తెగ హీట్ పెంచేస్తున్నాయి.
Story By: Ajay, Big TV