Telangana New BJP: నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు రాకతో తెలంగాణ బీజేపీలో నయా జోష్ కనిపిస్తోందా? రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా కొత్త అధ్యక్షుడు మార్చగలుగుతారా? రామచంద్రరావు కూడా బండి సంజయ్ దూకుడును కొనసాగిస్తారా… లేక సౌమ్యుడు కిషన్ రెడ్డి అడుగు జాడల్ని ఫాలో అవుతారా? ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది
కొత్త సారథి ముందు సవాళ్లు
బీజేపీ బలం, బలహీనతలు తెలిసిన రామచంద్రరావు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన రామచంద్రరావుకు ఆందోళనలు కొత్తకాదు. స్వతహాగా న్యాయవాది అయిన ఆ వకీల్ సాబ్కు పార్టీ బలం, బలహీనతల గురించి బాగా తెలుసు అనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తుంది. బెంజ్ తెలుసు, గంజి తెలుసు అన్నట్టు పార్టీలో సంస్థాగత రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలను రామచందర్రావు బాగా ఒంటబట్టించుకున్నారనేది పార్టీ నేతల మాట. తనపై వస్తున్న విమర్శలపై అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాతే గట్టిగానే సమాధానం ఇచ్చారు రామచంద్రరావు. గుండీలు చించుకొని మాట్లాడితే లీడర్ కాదు, సిద్ధాంతం ఒంట పట్టించుకున్నోడే నాయకుడు అంటున్న రామచంద్రరావు మాటలు బీజేపీలో హైప్ తెస్తోందంట
ఆసక్తి రేపుతున్న రామచంద్రరావు వ్యవహారతీరు
బండి సంజయ్ లాంటి దూకుడు స్వభావం…కిషన్ రెడ్డి లాంటి కామ్ అండ్ కూల్ నేచర్ ఉన్న అధ్యక్షులను తెలంగాణ బీజేపీ నేతలు చూశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావు ఎలా వ్యవహారించబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. బండి సంజయ్ ఎగ్రెసివ్ ధోరణిలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన హయంలో బీఆర్ఎస్ విధానాలను బలంగా ఎండగొట్టారు. ఆ తర్వాత బీజేపీ పగ్గాలను కిషన్ రెడ్డి చేపట్టారు. కిషన్ రెడ్డికి స్వతహాగా సౌమ్యుడన్న పేరుంది. బండి సంజయ్ లాగా ఎగ్రెసివ్ గా కాకుండా…కిషన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పార్టీ వ్యవహారాలను నడిపించారని పార్టీ నేతలు అంటుంటారు. ఇప్పుడు రామచంద్రరావు ఎలా పార్టీని ముందుకు తీసుకువెళ్లబోతున్నారనేది పార్టీలో హాట్ డిబెట్ అయిందట.
గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
స్వతహాగా న్యాయవాది అయిన రామచందర్రావు ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన అనుభవం ఉండడం రామచందర్రావుకు కలిసొచ్చే అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సుదీర్ఘకాలంగా పార్టీలో యాక్టీవ్ రోల్ పోషించిన నాయకుడిగా నేతల పనితీరు, అంతర్గత అంశాలను ఎలా డీల్ చేయాలన్నది ఆయనకు తెలియంది కాదు. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసే నిబద్ధత నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావుకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు.
రాజకీయంగా, పార్టీలోని పరిణామాలతో సవాళ్లు
అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిని రామచంద్రరావుకు అటు రాజకీయంగా, ఇటు పార్టీలోని పరిణామాలతో సవాళ్లు ఎదురుకానున్నాయి. రాబోయేది ఎన్నికల కాలం. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తల్లో కొంత నిరాశ నెలకొంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ని సమర్ధంగా సిద్ధం చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావుకి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సవాలే అంటున్నారు
బీజేపీలో రెడ్డి, ఓబీసీ నాయకుల మధ్య వర్గ విభేదాలు
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలోని అంతర్గత సమస్యలను అధిగమించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడం వంటి సవాళ్లను ఎదుర్కొబోతున్నారు. బీజేపీలో రెడ్డి మరియు ఓబీసీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య సమన్వయం సాధించడం రామచంద్రరావు ముందున్న ప్రధాన సవాలు అంటున్నారు. ఆ వర్గ విభేదాలను అధిగమించి, పార్టీని ఐక్యంగా నడపాల్సి ఉంటుంది. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న వివాదాలు, విభేదాలను అధ్యక్షుడిగా రామచంద్రరావు చక్కదిద్దాల్సి ఉంది.
Also Read: శివసేనలోకి రాజాసింగ్?
సంజయ్ దూకుడు, కిషన్ రెడ్డి లాంటి సౌమ్యత కలగలిపి పార్టీని యాక్టివ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం రామచందర్ రావు ముందున్న దీర్ఘకాలిక లక్ష్యం. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్లను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.
Story By Apparao, Bigtv