Cyber Hacking: సాధారణంగా ఒక సామాన్యుడి అకౌంట్ హ్యాక్ అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్లేది సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికే. మరి ఇప్పుడు ఆ పోలీసుల అకౌంటే హ్యాక్ అయితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఎస్. గతంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక ఎక్స్ అకౌంట్ మే 22వ తేదీన హ్యాకింగ్కు గురైంది. విచిత్రం ఏంటంటే, సైబర్ నేరాలను నిమిషాల్లో గుర్తించాల్సిన అధికారులు ఈ హ్యాకింగ్ జరిగి దాదాపు 20 రోజులు గడుస్తున్నా కనీసం గుర్తించ లేకపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు చర్చించుకోవడం, మీడియాలో వార్తలు రావడం ప్రారంభమైన తర్వాతే సైబర్ సెక్యూరిటీ అధికారులు నిద్ర లేచారు. అంటే ఎంతలా మానిటరింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంటే హ్యాక్ అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఈ ఘటన బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, ఐటీ ఎక్స్పర్ట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ మోసాలను అరికడుతామని చెప్పే.. ప్రభుత్వ డిపార్ట్ మెంట్ కే ఈ గతి పడితే ఒక కామన్ పబ్లిక్ సైబర్ నేరగాళ్ల బారిన పడితే న్యాయం ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. అత్యాధునిక సాంకేతికత, దర్యాప్తు వ్యవస్థలు ఉన్న సంస్థే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ను ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. 20 రోజుల పాటు హ్యాకింగ్ గురైన అకౌంట్ను ఎవరూ చూడకపోవడం శాఖలో ఇంటర్నల్ కో ఆర్డినేషన్ లేదని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు సాంకేతిక వైఫల్యాలు వెంటాడుతుంటే, మరోవైపు అంతర్గత అవినీతి సంస్థ ప్రతిష్టను మసకబారుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇదే బ్యూరోకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ 9 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోవడం సంచలనం సృష్టించింది. ఒక సైబర్ మోసం కేసులో నిందితులకు సహకరించేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు.
Also Read: ఫోన్లో చిన్న బిర్యానీ గొడవ.. కట్ చేస్తే కొడుకు కళ్లెదుటే తల్లిదండ్రులు..
అసలు ఈ అకౌంట్ ఎలా హ్యాక్ అయింది? టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటించలేదా? లేదా పాస్వర్డ్ మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయా? అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన కేవలం ఒక అకౌంట్ హ్యాకింగ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ డిజిటల్ భద్రతా వ్యవస్థలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో తనను తాను కాపాడుకోలేకపోతే, సామాన్యుల డేటా భద్రత ఎలా ఉంటుంది? ఈ ఘటన ప్రభుత్వానికి, సైబర్ విభాగాలకు పెద్ద మేలుకొలుపు అయ్యే అవకాశం ఉంది. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఓవరాల్ గా సైబర్ నేరగాళ్లు వాడే అత్యాధునిక టూల్స్, ఫిషింగ్ పద్ధతులను పసిగట్టడంలో బ్యూరో వెనుకబడిందా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ హ్యాకింగ్ ద్వారా లోపల ఉన్న కీలక డేటా ఏమైనా లీక్ అయిందా? లేదా కేవలం ప్రచారానికి మాత్రమే హ్యాక్ చేశారా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.