ఒక కీటకాన్ని చూసి నవ్విన వ్యవస్థ, అదే కీటకం సునామీలా ముంచెత్తుతుందని ఊహించలేకపోయింది. సోషల్ మీడియా స్క్రీన్ల దాకా పరిమితమైన ఒక ఆవేశం, ఈరోజు ఢిల్లీ పీఠాల పునాదులను కదిలించే స్థాయికి చేరింది.”గతంలో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వర్మ అనుకోకుండా చేసిన “బొద్దింకలు” అనే వ్యాఖ్యను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, డిజిటల్ తరానికి అది ఒక ఆత్మగౌరవ ప్రశ్నగా మారింది. ఇన్ స్టాగ్రామ్లోని ఓ చిన్న అకౌంట్లో పురుడుపోసుకున్న ‘కాక్రోచ్ పార్టీ’ ఆ తర్వాత జంతర్ మంతర్ వేదికగా రెక్కలు తొడిగి ఎగురుతుందని, ఏకంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని వణికిస్తుందని బహుశా ఎవరూ కలగని ఉండరు.
బొద్దింక దండు –ఏ గుర్తింపు లేని, కేంద్ర ఎన్నికల సంఘంలో కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక సోషల్ మీడియా మూవ్మెంట్… ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించే స్థాయికి చేరిందంటే, అది సాదాసీదా ఆందోళన కాదు! అది నేటి యువత ఆక్రోశం, మార్పు కోసం వారు పడుతున్న తపన. జంతర్ మంతర్ ప్రాంగణంలో సృష్టించిన ప్రభంజనం, ఢిల్లీ రాజకీయ గోడలను దాటి దేశమంతా మార్మోగింది. ఈ విషయంలో అభిజీత్ దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ పార్టీ తెగించడాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. సాంప్రదాయ రాజకీయ పార్టీలు బిలియన్ల కొద్దీ రూపాయలు, విస్తృతమైన యంత్రాంగం ఉపయోగిస్తే తప్ప సాధించలేని ప్రజా సమీకరణను, కేవలం ఒక ఆశయంతో, సోషల్ మీడియా శక్తితో చేసి చూపించారు. డిజిటల్ సమాజంలో డిజైన్ అయిన పోరాటం వీధుల్లోకి వచ్చి ఫలితాలను సాధించగలదని నిరూపించడం నేటి యువతరంలో ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఈ “బొద్దింక దండు” వేసిన బాటలోనే నడవాల్సిన పరిస్థితిని కల్పించడం వీరి నైతిక విజయానికి ప్రతీక.
వ్యవస్థను గడగడలాడించిన అభిజీత్ దీప్కే- అయితే, ఇక్కడే అసలైన ప్రశ్నాపత్రం ఉంది. ఆవేశంతో వ్యవస్థను ప్రశ్నించడం ఒక ఎత్తైతే… అదే వ్యవస్థను శాశ్వతంగా మార్చడం ఇంకో ఎత్తు.మన దేశంలో వ్యవస్థపై తిరుగుబాటు జెండా ఎగరేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ కిరణాలు కొత్తవేమీ కాదు. కన్నయ్య కుమార్ జేఎన్యూ ఆవరణ నుంచి తన పదునైన ఉపన్యాసాలతో దేశాన్ని ఊపేశారు.హార్దిక్ పటేల్ గుజరాత్ పటేల్ ఆందోళనలతో బీజేపీ గడ్డపైనే సంచలనం సృష్టించారు.వారిద్దరూ కూడా ఆరంభంలో అభిజీత్ దీప్కే లాగే వ్యవస్థను గడగడలాడించారు. కానీ కాలక్రమేణా ఆ వేడి చల్లారిపోయింది. చివరికి తాము దేనికైతే వ్యతిరేకంగా పోరాడారో, లేదా ఏ వ్యవస్థనైతే ప్రశ్నించారో… అదే సాంప్రదాయ రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుని, ఆ పెద్ద పార్టీల నీడలోనే లీనమైపోయారు. ఒక సునామీలా వచ్చిన ఉద్యమం చివరికి ఒక చిన్న నదిలా పెద్ద సముద్రంలో కలసిపోయింది.
అభిజీత్ దీప్కే ముందున్న అసలైన సవాల్..ఇప్పుడు లీడర్గా ఎదిగిన అభిజీత్ దీప్కే ముందూ అదే పెద్ద సవాలు నిలిచింది.కాక్రోచ్ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?అనేది ఇప్పుడు డౌట్..లేదా, కాలక్రమేణా ఈ ఆక్రోశం చల్లారిపోయి, అభిజీత్ కూడా ఏదో ఒక పార్టీలో విలీనమైపోతారా?భారతీయ రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదగడం అంటే కేవలం ధర్నాలు, సోషల్ మీడియా ట్రెండింగ్లు మాత్రమే కాదు. దానికి ఒక స్పష్టమైన సిద్ధాంతం, నిలకడైన వ్యూహం, బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం కావాలి. ఢిల్లీ పీఠంలో ఉన్న బీజేపీ గానీ, సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ గానీ ఇటువంటి మూవ్మెంట్స్ను ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలిసిన చదరంగం క్రీడాకారులు. ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్గా కాక్రోచ్ పార్టీని ఎదగనివ్వకుండా ఉండేందుకు ఈ దిగ్గజ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తాయి.
ALSO READ: జంతర్ మంతర్ టు పార్లమెంట్.. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ జెన్-జీకి ప్రతిపాదన..!
ఒక రాజకీయ వ్యతిరేకత మాత్రమే ప్రజాపార్టీని నడిపించలేదు. కాక్రోచ్ పార్టీ కేవలం ఒక యాంటీ-సిస్టమ్ నిరసనగా మిగిలిపోతుందా, లేదా స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఒక పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా రూపొందుతుందా అనేదే ఇప్పుడు అసలైన పాయింట్. యువత కేవలం రోడ్లెక్కి నిరసనలు తెలిపితే సరిపోదు… ఆ నిరసనను చట్టాలు చేసే అధికారంగా మార్చుకోగలిగినప్పుడే దేశంలో నిజమైన మార్పు వస్తుంది. అభిజీత్ దీప్కే ఆ దిశగా అడుగులు వేసి చరిత్ర సృష్టిస్తారా, లేదా గతంలో వచ్చిన యువ నాయకుల్లాగే ఒక ‘ఫ్లాష్ ఇన్ ది పాన్’ లా మిగిలిపోతారా? కాలమే సమాధానం చెప్పాలి…ప్రస్తుతం దేశంలో రాజకీయ వ్యూక్యూమ్ చాలా ఉంది..బొద్దింకలకు కచ్చితంగా ఆ వ్యాక్యూమ్ ని నింపే శక్తి ఉంది.. కానీ ఆచరణ ఎంత వరకు ?
ఈ ఆర్టికల్ రాసినవారు – బిగ్టీవీ చీఫ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి