అక్కడ ఉద్యమం సఫలీకృతమైతే మన సెలబ్రిటీలెందుకు ఊపిరి పీల్చుకుంటారు..? అక్కడ ధర్మేంద్ర రాజీనామా చేస్తే మన తెలుగు తారలెందుకు సంబురపడతారు? ఎందుకంటే.. ఇప్పటిదాకా మనోళ్లు తేలుకుట్టిన దొంగలు కదా!: అందుకు. అవును.. ఢిల్లీలో కాక్రోచులు చేస్తున్న ఆందోళనను పట్టించుకోలేదు. వారిపై జరిగిన దమనకాండనూ సైలెంట్గా చూస్తుండిపోయారు.
కళ్లు మూసుకున్నారో ఏమో తెలియదు కానీ, నోరైతే మూసుకున్నారు. ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా చడీచప్పుడు చేయలేదు. పెద్దవారికి సిద్దాంతాలు అడ్డొచ్చాయి. చిన్న తారలకు సినీ అవకాశాలు అడ్డుగా మారాయి. పాతకుపోయినోళ్లవి..ఢిల్లీతో అనుబంధాలు.. మిగిలిన వారందరివి ఈ ముదురు తారలతో అనుబంధాలు..అందుకే ఎవరూ చప్పుడు చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ.. విద్యార్థులకు సంఘీభావం తెలుపుతుంటే.. ఇక్కడ మనవారికి భయం పట్టుకున్నది.
తమదాకా వస్తే.. అన్నట్టుగా.. తమను ఎక్కడ అడుగుతారో.. మేమెక్కడ స్పందించాల్సి వస్తుందో.. అయితే కరెక్టో, లేక లేదనో..ఏదో ఒకటి చెప్పాలి కదా! ఉద్యమం కరెక్టేనని ప్రాణం పోయినా చెప్పలేరు. ఎందుకంటే అక్కడ రాంబాబు బడితె పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఆయన అన్నయ్య చిరు.. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కాయె…! కూటమి ప్రభుత్వామాయె.. బాబుతో బంధాలన్నీ నందమూరి వంశంతోనేనాయె.. ఇక మన తెలుగు ఇండస్ట్రీ కుక్కిన పేనులా.. తేలు కుట్టిన దొంగలా అలా పడి ఉందే తప్ప.. లోన ఉన్న ఆవేశం, ఆవేదన, మనోవేదన ఏదీ చెప్పలేక, చెప్పుకోలేక తల్లడిల్లిపోయారంటే నమ్మండి.
ఇదిగో ఇవాళ ధర్మేంద్ర రాజీనామా చేశాడనగానే.. ఆ సీజేపీ వాళ్లకన్న ముందు అత్యంత త్వరగా, అంబరాన్నంటేలా ఆనంద పడింది మాత్రం తెలుగు సినీ తారలేనంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే.. ఇక దీనికి పుల్ స్టాప్ పడింది. ఎక్కడ మీడియా కనబడి దీనిపై ప్రశ్నలడుగుతుందోనని దొంగచాటును పారిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. అసలు బయటకు వెళ్లకపోతే బెటర్ కదా.. ఇంట్లోనే ఉంటే ఎవరూ అడగరు అని అనుకునే దుస్థితీ ఇకపై లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్నారట మన తారలు.
పాపం.. ఎంత కష్టమొచ్చింది మనోళ్లకు. అక్కడ లాఠీలు ఆ విద్యార్ధుల వీపులపై ఎంతలా నొప్పిని కలగజేశాయో.. మనోళ్లు అంతకు మించి బాధను ఇక్కడ అనుభవించారు. ఎప్పుడు ఈ లొల్లి ముగుస్తుందా? మాకు స్వేచ్చ ఎప్పుడు దొరుకుతుందా? అని. అంతేగా మరి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. !
ఎటూ తేల్చుకోలేక, తమకంటూ ఓ స్వేచ్ఛ లేక .. మనుసులో ఉన్నది బయటకు చెప్పుకోలేక ముప్పుతిప్పలు పడితే.. ఇప్పుడు వీరి మనోవేదన అర్థం చేసుకున్న వాడిలా మోడీ.. ధర్మేంద్ర రాజీనామాకు ఓకే చెప్పినట్టున్నాడు. అందుకే అందరూ ఓసారి మోడీకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. ఈ కాక్రోచులు ఇక ఎప్పుడు రోడ్డెక్కినా.. చచ్చే చావొచ్చి పడుతుంది మన సినీ తారలకు.