ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు..! అచ్చం ఇట్లనే ఉందంటున్నారు మోడీ తీసుకున్న నిర్ణయం. ధర్మేంద్ర రాజీనామా పై కేంద్రం తీసుకున్న నిర్ణయం .. మోడీ అభిమానులకు మింగుడు పడటం లేదు. మోడీని సపోర్టు చేస్తూ.. కాక్రోచుల ఉద్యమాన్ని పలుచన చేసేందుకు.. పగలు, రాత్రి సోషల్ మీడియాలో విపరీతంగా కష్టపడ్డారు కాషాయ ప్రేమికులు.
కానీ ఆకస్మాత్తుగా మోడీ ఇంతలా బెండ్ అవుతాడని, ఆ ఉద్యమానికి తలవంచుతాడని, ధర్మేంద్ర రాజీనామా నిర్ణయంతో కేంద్రం.. కాక్రోచుల ఉద్యమానికి ఎంత జడిసిందోననే విషయం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు.
అక్కడ ఢిల్లీలో జరిగిన ఘటనలు, పార్లమెంటు స్తంభించిపోవడం..ప్రతిపక్షం ఇండి కూటమి వారికి మద్దతుగా నిలవడం… ఇవన్నీ గమనిస్తూ వస్తోంది మోడీ సర్కార్. అమిత్ షా సైతం… దీన్ని లోతుగా అధ్యయనం చేశాడు. అంత ఆషామాషీగా ఈ ఉద్యమాన్ని కొట్టిపారేయలేమనే అభిప్రాయానికి రావడంతోనే ఇక.. అనువుగాని చోట అధికులమనరాదు.. అనే పాలసీని ఫాలో అయినట్టుగా తెలుస్తోంది.
అందుకే తప్పలేదు. తగ్గాడు. కానీ ఇంత చేసినా.. వెనక్కి తగ్గినా.. తను మాత్రం నెగ్గలేదు. ఇదే బీజేపీకి విషాదాన్ని మిగిల్చింది. తొలి షాక్నిచ్చింది. తమకు ఇక తిరుగేలేదు అనే దగ్గర నుంచి.. తిరోగమనం స్టార్ట్ అయ్యిందని వారంతట వారే ఒప్పుకునే దాకా వచ్చింది పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే నిర్ణయం వెనుక.. లోతైన ఆలోచనలు, అధ్యయనం ఉంది. అంతిమంగా ఇది తప్పదు అనుకున్న తర్వాతే ఇక దిగి వచ్చారు.
అయితే మోడీ ఇలా చేస్తాడని కనీసం ఊహకు కూడా అందలేదు ఆయన అభిమానులకు. దీన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు బాహాటంగానే మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కాక్రోచులపై ఉన్న కసిని కూడా ఇక్కడ బహిర్గతం చేస్తున్నారు. చిటికీ మాటికీ ఇలా జంతర్మంతర్ వేదికనెక్కి.. ఆందోళన చేస్తే.. ఇక కేంద్ర ప్రభుత్వం దిగివస్తుంది.. చెప్పింది వింటుంది. అడిగిన డిమాండ్స్ నెరవేరుస్తుంది..? అనే సంకేతమిచ్చారా మోడీగారు..! ఇలా చేస్తారని అనుకోలేదు. ఓ కొత్త చరిత్రకు నాంది పలికారు. ఇక ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు.. అనే విధంగా దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే లెవల్లో తెగ బాధపడిపోయి.. మోడీ నిర్ణయాన్ని తెగ తిట్టుకుని, ఆయన తీరును తెగ విమర్శించేసి.. తమ కడుపులోని బాధనంతా సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కతున్నారు.
ఈ బాధలో ఓ అర్థం ఉంది. ఓ మెసేజ్ కూడా ఉంది. ఇక తమ ప్రతిష్ట తగ్గుతుందనే ఆవేదన.. కాక్రోచులంతా కలిసి కాంగ్రెస్నే లేపుతున్నారు.. అంతిమంగా ఇది ఆ జాతీయ పార్టీ ఖాతాలో పడుతుందనే వాస్తవం.. వీటినే ఇప్పుడు కాషాయదళం జీర్ణించుకోలేకపోతున్నది. కానీ మోడీ మాత్రం ఇప్పటి పరిస్థితుల రీత్యా వెనక్కి తగ్గినా.. అది బీజేపీకి పెద్ద నష్టమేమీ చేయదనే భావిస్తోంది. కాంగ్రెస్ దీంతో ఒక్కసారిగా ఆకాశానికేం ఎగరదనే ధీమాతో ఉన్నది.